సాహిత్యంలో మెజారిటీ జులుం

ఇటీవల ఒక తెలుగు కథ గురించి విపులంగా, నిశితంగా, ఆవేశంగా జరిగిన చర్చల్లో ఒక వింత పాయింటు నా దృష్టిని ఆకర్షించింది.
ఇదీ ఆ పాయింటు సారాంశం - ఈ కథలో పాత్రలాగా ఎవరూ ఉండరు, అలా ఎవరూ ప్రవర్తించరు, ఒకేళ ఉన్నా చాలా తక్కువ మంది ఉంటారు, ప్రపంచంలో 99 శాతం ఇలా ఉండరు.

మన సమకాలీన జీవితంలో మెజారిటీ అభిప్రాయానికి చాలా విలువుంది. ఎంతైనా ప్రజాస్వామ్యాన్ని తలకెత్తుకున్న వాళ్ళం కదా. సమాజంలోనూ రాజకీయాల్లోనూ సరే, మరి సాహిత్యంలోనూ ఈ మెజారిటీ వాదన చెల్లుతుందా అని నాకో అనుమానం వచ్చింది.

పురాణాల సంగతి అట్లా పెడితే, మనుచరిత్రలో ప్రవరుడి వంటి పురుషులు ఆనాడైనా, ఈనాడైనా ఎంతమంది ఉంటారంటారు? పోనీ ఆముక్తమాల్యదలో గోదాదేవి వంటి స్త్రీలు? అబ్బ, వాళ్ళంతా రాచరికపు యుగం వాళ్ళూ పోనివ్వండంటరా, అర్జంటుగా ఆధునిక యుగానికే వచ్చేద్దాం.

కన్యాశుల్కంలో గిరీశాన్నో మధురవాణినో మీరెన్నిసార్లు చూశారు? బారిష్టరు పార్వతీశం కనిపించాడా ఏ మొగల్తుర్రు రోడ్డుమీదైనా? దయానిధి మీ పక్కింట్లోనో, సీతారామారావు మీ ఎదురింట్లోనో కనబళ్ళేదుగా ఎప్పుడైనా? రావి శాస్త్రి గారి విమల (మూడుకథల బంగారం) గానీ, రంగనాయకమ్మగారి విమల (స్వీట్ హోం) గానీ తారసపడ్డారేవిటి విశాఖపట్నం పూర్ణామార్కెట్టు దగ్గర?

అసలు సంగతేంటంటే గొప్ప సాహిత్యం ఎప్పుడూ ఏదో ఒక కారణంగా అసాధారణమైన వ్యక్తుల్ని గురించే పట్టించుకుంటుంది. పోనీ సాధారణ వ్యక్తుల్లోని అసాధారణ లక్షణాల్ని గురించే పట్టించుకుంటుంది. అంచేత ప్రపంచంలో నూటికి తొంభైతొమ్మిది మంది సాహిత్యంలో పాత్రల్లా ఉండరు. దాన్నే తిప్పి చెబితే, సాహిత్యంలో పాత్రలు ప్రపంచంలోని నూటికి తొంభైతొమ్మిది మందిలాగా ఉండవు. ఇంకా గట్టిగా చెబితే ఎక్కడో లక్షల్లోనో కోట్లలోనో ఒక్కరైన అసాధారుణుల్ని గురించే సాహిత్యం పట్టించుకునేదీ, పాత్రలుగా నిలబెట్టేదీనూ. ఎందుకంటే బిర్రబిగుసుకున్న సమాజాన్ని తట్టిలేపేదీ, ముందడుగు వెయ్యమని ముల్లుగర్రతో పొడిచేదీ వాళ్ళే.

కోటిలో మిగతా తొంభైతొమ్మిది లక్షల తొంభైతొమ్మిది వేల తొమ్మిదివందల తొంభైతొమ్మిది మంది ఉన్నట్టే సాహిత్యంలో పాత్రా ఉంటే, ఇహ చెప్పేదేవుందీ?

Comments

మేధ said…
బాగా చెప్పారు!
This comment has been removed by the author.
viswamitra .. మీరంత కష్టపడి షెర్లాక్ హోంసు పాత్ర ధరించనక్కరలేదు. ఈ టపా ఇటీవల బ్లాగుల్లో జరిగిన చర్చలోంచి పుట్టిందని టపాదిలోనే చెప్పియుంటిని. ఐనా తెలుగు కథని మలుపు తిప్పగల సాహితీదిశానిర్దేశకుల్నీ, సత్సాహిత్య విమర్శకుల్నీ పట్టుకుని టంకాలూ ఉటంకాలూ ఇవ్వడానికి నేనెంతవాణ్ణండీ. ఏదో, ఊరి మర్రి చెట్టులాగా ఇలా ఉన్నానంతే.
rākeśvara said…
this leads to our next question.
How odd is acceptably odd?

వారి అసాధరణత్వానికి ఎక్కడ గీస్తారు గీత. అహ్ ఇలా ఎవ్వ్వరూఊఊ చేయరు అని అనిపించకూడదు.
కాబట్టి అందరూ మనం ఇలా చేస్తే బాగుణ్ణు లేదా వాడు అలా ఎందుకు చేసాడో నాకు అర్థమవుతుంది అన్నంత వరకే ఆ అసాధరణత్వాన్ని రాగాలి. లేకపోతే చదివేవారికీ చూసేవారికీ ఆసక్తిపోతుంది.
నాదొక సందేహం..

రచయితలు సాహితీదిశానిర్దేశకులు, సత్సాహిత్య విమర్శకులు మెచ్చినట్టుగా రాయాలా??? మరి అవతలి వాళ్లు కూడా ఇలాగే వింటారా?? విమర్శ వరకు ఒకే.. కాని అది నిర్ధేశం అంటే ఎలా??

నాకు తెలీక అడుగుతున్నాను.. నిజ్జంగా..
రాకేశ్వరరావు .. మంచి పాయింతు లేవనెత్తారు. ఇక్కడ ఆసక్తి ఒకటే కాదు విషయం. సాహిత్యంలో గానీ, నిజజీవితంలోగానీ హీరోలెలా పుడతారు అని చాలా పరిశోధనే జరిగింది. వాటికి సిద్ధాంతాలు గట్రా ఏవో ఉన్నాయి.
అతిశయోక్తి శ్రుతిమించితే, ఆసక్తి పోవడం అటుంచి, అసలు అవగాహన దారితప్పే అవకాశం చాలా ఉంది. అందుకే కాబోలు అతి సర్వత్ర వర్జయేత్తన్నారు. అదలా ఉండగా, పాఠకుడే సాహిత్యాన్ని చదవడంద్వారా తన మనసులో పునస్సృష్టి చేస్తున్నప్పుడు, ఈ గీత ఇలాగే గియ్యాలి అని ఎవరైనా ఎలా చెప్పగలరు? మీకు పొట్టిదైన గీత నాకు చాలా పొడుగవ్వచ్చు!
జ్యోతిగారూ, ఏంటోనండి. ఈ అవతలి వాళ్ళు ఇవతలి వాళ్ళు అనుకుంటూంటే ప్రేమాభిషేకం సినిమాలో శ్రీదేవి జయసుధల మధ్య జరిగే ఒక సన్నివేశంలోని సంభాషణలు గుర్తొచ్చి జీవితమ్మీద విరక్తి పుడుతోంది. ఐనా విమర్శకులు ఉన్నదే ఒకరికి చెప్పేందుకే గాని తాము వినేందుకా ఏవిటండీ, మీరు మరీనూ!
చాలా బాగా చెప్పారు.
ప్రేమాభిషేకం :-)
భావన said…
"గొప్ప సాహిత్యం ఎప్పుడూ ఏదో ఒక కారణంగా అసాధారణమైన వ్యక్తుల్ని గురించే పట్టించుకుంటుంది. పోనీ సాధారణ వ్యక్తుల్లోని అసాధారణ లక్షణాల్ని గురించే పట్టించుకుంటుంది." రెండవది నిజమనిపిస్తుంది నాకైతే.. "సాధారణ వ్యక్తుల్లోని అసాధారణ లక్షణాల్ని గురించే పట్టించుకుంటుంది"

ఈ చర్చ ఎక్కడ జరిగిందో కాని దానికి నా 2 సెంట్స్.. కధల లో లా మనుష్యులు ఎందుకు వుండరు... అచ్చం గా 100% వుండమేమో ఎందుకంటే ఇన్ని కోట్ల మంది మనుష్యులలో ఒకళ్ళ లా ఇంకొకళ్ళు వుండనప్పుడు కధ లో లా 100% మనం ఎందుకు వుంటాము కాని కధలు జన జీవనం నుంచే పుడతాయి, అలాంటి పాత్రలు మన మద్య లోనే వుంటాయి అన్ని కధలలో అన్ని పాత్రలు అసాధారణం గా... మూస పోసిన మంచితనం తోనో లేదా చెడ్డ తనంతోనో వుండరు కదా అలాగే అందరు సమాజాన్ని ముల్లు గర్ర పెట్టీ తోయగలిగే పాత్రలు గా కూడా వుండరు కదా,
మీ ప్రేమాభిషేకం పోలిక అదిరింది, :-)
చివరి గా ఒక చిన్న చణుకు (మొగవాళ్ళెవ్వరు ఫీల్ అవ్వకండేం) రంగనాయకమ్మ విమల లను కొంచం అటు ఇటు గా ఎక్కడైనా చూడ వచ్చు కాని, బుచ్చిబాబు లను మాత్రం అబ్బే అతని కి అటు ఇటు ఒక మైలు దూరం లో కూడా అలాంటి వాళ్ళను చూడం..
Unknown said…
పురాణాలను ప్రక్కనపెడితే అని మొదలు పెట్టారు. కాని మానవజాతికి మార్గనిర్దేశం చేసే పురాణపాత్రల్ని తలుచుకోకుండా వుండటం నాకు సాధ్యం కావట్లేదు. రామాయణంలోని రాముని పాత్ర మీరు చెప్పిన కోట్లమందిలోని ఒకపాత్ర..
"అసలు సంగతేంటంటే గొప్ప సాహిత్యం ఎప్పుడూ ఏదో ఒక కారణంగా అసాధారణమైన వ్యక్తుల్ని గురించే పట్టించు కుంటుంది. పోనీ సాధారణ వ్యక్తుల్లోని అసాధారణ లక్షణాల్ని గురించే పట్టించుకుంటుంది. అంచేత ప్రపంచంలో నూటికి తొంభైతొమ్మిది మంది సాహిత్యంలో పాత్రల్లా ఉండరు. దాన్నే తిప్పి చెబితే, సాహిత్యంలో పాత్రలు ప్రపంచంలోని నూటికి తొంభైతొమ్మిది మందిలాగా ఉండవు. ఇంకా గట్టిగా చెబితే ఎక్కడో లక్షల్లోనో కోట్లలోనో ఒక్కరైన అసాధారుణుల్ని గురించే సాహిత్యం పట్టించుకునేదీ, పాత్రలుగా నిలబెట్టేదీనూ. ఎందుకంటే బిర్రబిగుసుకున్న సమాజాన్ని తట్టిలేపేదీ, ముందడుగు వెయ్యమని ముల్లుగర్రతో పొడిచేదీ వాళ్ళే"
రామునిపాత్ర పై విషయానికి సరిగ్గా సరిపోతుంది. ఇటువంటి మంచి విషయాలను గురించి చర్చ జరిగేలాంటి పోస్టును మీ బ్లాగులో ఉంచినందుకు మీకు నా ధన్యవాదాలు.
budugu said…
కొత్తపాళీ గారు, బాగా చెప్పారండీ. అలాంటి అసాధారణ (ఎక్కడా కనిపించని)పాత్రనొకదాన్ని తీసుకొని ఎంచక్కా తెలుగులో కథలల్లే వారికీ కొదవలేదు మనదగ్గిర.
కొత్తపాళీ వారూ.. నాకు మీ మాటలు మరో విషయంలో కూడా బ్లాగుల్లో పొలిక కనిపించి జోవియల్‌గా అన్నాను. మీరు అపార్ధం చేసుకున్నట్టు అనిపించింది. నా కామెంట్ వెనక్కి తీసుకుంటున్నాను. :(
నారాయణస్వామిగారూ ! నేను మీలా మొహమాటంగా మాట్లాడేవాణ్ణి కాను. నాకు American journalism standards తెలియవు కనుక కుండ బద్దలు కొడుతున్నాను. ప్రజాస్వామ్యం ఒక రాజకీయ పరిపాలనాసూత్రం మాత్రమే. అంతకుమించి దానికి ఏ విధమైన అదనపు మూల్యమూ లేదు. సాహిత్య, సాంస్కృతిక విషయాలకీ, వైయక్తిక సంబంధాలకీ మెజారిటీ సూత్రాలు, ప్రజాస్వామ్యాలు వర్తించవు.

సాహిత్యంలో పాత్రల మనస్తత్త్వం మీద ఆంక్షలు విధించాలనుకుంటే అసలు ఆ పాత్రల్ని సృష్టించిన రచయితలమీదనే ఆంక్షలు విధించాల్సి వస్తుంది. ప్రపంచంలోని రచయితలంతా సహజంగానే ఎంతోకొంత freaks. వాళ్ళు కూడా మిహతా జనంలానే ఉండాలని వైవిధ్యంగా ఆలోచించకూడదనీ చట్టాలు చెయ్యాల్సి వస్తుంది.
Arun said…
Install Add-Telugu widget button with ur blog, u can easily post ur articles on top Telugu social bookmarking sites & u get more visitors and traffic to ur blog.
Download from www.findindia.net
రవి said…
"అసలు సంగతేంటంటే గొప్ప సాహిత్యం ఎప్పుడూ ఏదో ఒక కారణంగా అసాధారణమైన వ్యక్తుల్ని గురించే పట్టించుకుంటుంది. పోనీ సాధారణ వ్యక్తుల్లోని అసాధారణ లక్షణాల్ని గురించే పట్టించుకుంటుంది."

నాదీ మామూలుగా ఇదే అనుకోలు. అయితే అప్పుడప్పుడూ "ఇది నిజంగా నిజమేనా?" అని అనుమానం వస్తుంటుంది.

గాథాసప్తశతి లో గాథలలో పల్లె పడుచుల నిత్యజీవితంలో సంఘటనలతో కూర్చిన సంఘటనలు, బౌద్ధ సాహిత్యం లోని, కిస (కృశ) గౌతమి, సుజాత, వంటి పాత్రల గురించి చదివినప్పుడు.

అవీ అసాధారణమైనవే అంటే చెప్పేదేమీ లేదు.:-)
@భావన .. ఆసక్తి కరమైన పాయింట్లు లేవనెత్తారు. ఇక్కడ శాతాలు మాట్ళాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. అతన్ని చూడవే, అచ్చు సెక్రటరీ నవల్లో రాజశేఖరమే .. అంటే అది ఒక పోలిక. తెలుగు మగాళ్ళందరూ రాజశేఖరంలానే ఉంటారు, వారందరికీ రాజశేఖరం ప్రతీక అంటే అదింకో పోలిక. నేను మాట్లాడుతున్నది రెండో రకం గురించి.

@వేదుల వారికి .. నమస్కారం. పురాణాలు పక్కన పెట్టమన్నది, వాటిల్లో పాత్రలు ఎలాగూ మానవాతీతంగా ఉంటాయనే. మీ వ్యాఖ్యకి నెనరులు.

@బుడుగు .. వోకే.
@ viswamitra .. లైట్ బాస్. పీస్!

@ తాలబాసు గారు .. మీ ఉవాచతో 150% శాతం ఏకీభవిస్తున్నా. బైదవే, నేను కొంచెం మొహమాటంగా రాస్తానంటారా? వొదిలించుకుందామనే ప్రయత్నిస్తున్నానండీ.

@ Ram .. stop spamming!
@ రవి .. గాథా సప్తశతి ఇత్యాదుల గురించి మీ వ్యాఖ్య ఆసక్తి కరం. అప్పుడు మనం ఏది నిత్య జీవితం, ఏది దానికి అతీతం అని నిర్ద్వంద్వంగా నిర్వచించాల్సిన అవసరం ఏర్పడుతుంది.
వేమన said…
మనం మన చుట్టూ మనుషుల్లా కానే కాదు అనుకున్నా, అందరూ ఎలా ఉంటే మనం కూడా అలాగే అనుకున్నా, రెంటిలోనూ ఇబ్బందులున్నాయి నిజ జీవితంలో. అందుకే కధల్లోనైనా స్వేచ్చ ఉండాలనుకుంటాను.
మంచి మాటలు. సాహిత్యంలోని ప్రసిద్ధపాత్రలను అచ్చంగా పోలిన మనుషులుండకపోవచ్చునేమోగానీ, ఆ పాత్రల లక్షణాల్లో కొన్నయినా లేని మనిషీ ఉండడనుకుంటాను.
"కోటిలో మిగతా తొంభైతొమ్మిది లక్షల తొంభైతొమ్మిది వేల తొమ్మిదివందల తొంభైతొమ్మిది మంది ఉన్నట్టే సాహిత్యంలో పాత్రా ఉంటే, ఇహ చెప్పేదేవుందీ?"

హ్మ్! నుజమే కదా. రోజువారీ విషయాలూ, రోజువారీ మనుషుల గురించి చెప్పుకునేందుకేముమ్ది కనుక? హేమిటో!
@వేమన, రానారె, గీతాచార్య .. రైఠో!
విమల ఐనా, బుచ్చి బాబైనా ఉండే ఉండవచ్చు. కథల్లో పాత్రలు కల్పితాలైనా ఏమో ఎక్కడో ఒక చోట తగలనూ వచ్చు. ఏమో గుర్రమెగరా వచ్చు.... ఏమంటారు? అసలు ప్రవర్తనా నిర్దేశం చెయ్యటానికి మనమెంతటివారం అంటాను నేను. ఇది ఇలాగే ఉండాలి, వీరిలాగే ఉండాలి అంటే ఇప్పటికి కూడా స్త్రీలు తలుపు చాటున నుల్చుని మాట్లాడల్సిందే కానీ మార్పు సహజం కదా
రమణ said…
సీతారామారావు, దయానిధి ల లోని లక్షణాలు కొన్నైనా చాలా మందిలో ఉండేవే. వాళ్ళు కూడా సాధారణ వ్యక్తులే, కాకపోతే అసామాన్యంగా ఆలోచిస్తారనుకుంటా. అవి సామాన్యులు తెలుసుకోవటానికే, బుచ్చిబాబు, గోపీచంద్ లాంటి తాత్వికులు వాళ్ళని సృష్టించి ఉండాలి.