ఏదో DRDO ప్రయోగశాలలో పనిచేసే ఒక యువ పరిశోధకురాలు ఏదో కొంచెం పనికొచ్చే డిస్కవరీ ఏదన్నా చేశారనుకోండి. అకస్మాత్తుగా అబ్దుల్ కలాం గారి దగ్గిర్నించి ఫోనొస్తే ఎలా ఉంటుంది?
ఏదో సినిమాలో ఏదో చిన్న పాత్రలో .. తనకున్న పరిధి బహు కొద్దే అయినా .. తన ప్రతిభ కనబరుస్తూ ఒక నటి అద్భుతంగా నటించింది అనుకోంది. అథాట్టున చిరంజీవి గారి దగ్గర్నించి ఆమెకి ఫోనొస్తే ఎలా ఉంటుంది?
కానీ మీకూ తెలుసు, నాకూ తెలుసు, నిజ జీవితంలో ఇవి జరిగేవి కావని.
ఒక ఫీల్డులో ఆయన ఒక దిగ్గజం .. అదే ఫీల్డులో ఆమె ఇంకా తప్పటడుగులు వేస్తున్న చిన్నారి. ఐనా ఆమెలో ప్రతిభ గుర్తించి, ఆమెని వెదికి పట్టుకుని, ఫోన్ చేసి మాట్లాడి, అది చాలక, తానే పని గట్టుకుని వారింటికి వెళ్ళి ఆమెని ప్రోత్సహించిన వైనం .. నాకైతే చదువుతుంటే గొంతు చిక్కబట్టింది.
కారా మాష్టారూ, మీ పెద్ద మనసుకి వినమ్రంగా టోపీలు తీసేశాం!
మనం అబ్దుల్ కలాములూ, చిరంజీవులూ, కారా మేష్టార్లూ కానక్కర్లేదు మన తోటి వారిలో ప్రతిభని గుర్తించి ప్రోత్సహించడానికి!!
Sunday, May 11, 2008
ప్రోత్సాహం
Tuesday, May 6, 2008
షేర్ ఆటొ కథ - కమామిషు
ఈ టపా తొలి ముద్రణలో ఒక పొరపాటు జరిగింది. ఒక కథని మరిచాను. ఇప్పుడు సవరించాను.
మొత్తం పది కథలు వొచ్చాయి. మనలోమాట రమణి, ఒనమాలు లలిత, దైవానిక శ్రీకాంత్, మయూఖ లలితాస్రవంతి తమ బ్లాగుల్లో ప్రచురించారు. నా మదిలో .. ప్రవీణ్ గార్లపాటి, గడ్డి పూలు సుజాతా పాత్రో, సౌమ్య రైట్స్ సౌమ్య, రాజారావు తాడిమేటి, నివేదన రమ్య, జ్యోతి వలబోజు నాకు మెయిల్లో పంపారు. ఇందులో ఈమాట మేనెల సంచికలో రాజారావు, రమ్య గార్ల కథలు వచ్చాయి.
అన్ని కథల్లోనూ కొన్ని కొన్ని కామన్ లక్షణాలు లేకపోలేదు. చాలా కథల్లో ఆ చిన్నపిల్ల చేసే ఏదో పిల్ల చేష్టకి తల్లి "ఉరిమి" చూడ్డాన్ని చిత్రించారు. హీరో మహేష్ బాబు ప్రసక్తి కూడ బాగా తరచుగానే వినబడింది. పాత్రల వర్ణనలు ఇంచుమించుగా అందరూ ఒకేలా చేశారు - అఫ్కోర్సు, కథకి ఇచ్చిన ఇతివృత్తం అదే కావటం వల్ల కావచ్చు అనుకోండి. కామన్ గా ఉన్న లక్షణాలు ఇంతవరకే.
నాకు మహా సంబరం కలిగేట్టు అందరూ తలో దారీ తొక్కారు పాత్రల మన్సతత్వ చిత్రణలోనూ, కథని నడిపించటంలోనూ.
ABCDEFG - రమణి
ముగ్గురు హీరోయిన్లూ, ఆటో ఛేజ్, పాఠకుల్ని ఉత్కంఠతో ఉర్రూతలూపే సస్పెన్సు, చివరాఖరికి మనసుల్ని ద్రవీభవింపజేసే కరుణ రసాత్మకమైన ముగింపుతో రమణి గారు ఒక మంచి తెలుగు సినిమాకి కావల్సిన సరంజామాని సిద్ధం చేశారు తన కథలో. సినిమా కథ అంటే ఏమీ చులకన కానక్కర్లేదు. పాఠక ప్రేక్షకుల్ని రంజింప జెయ్యటానికి ఎంతో సృజనశక్తి కావాలి. ఐతే, తనే ఫస్టు ప్రచురించాలి అనే తొందరో మరేవిటో గానీ మరీ హడావుడిగా జరిగిపోయింది కథనం. రక్తి కట్టించడనికి అవసరమైన హంగులన్నీ కహలోనే ఉన్నాయి. ఇంకాస్త ఓపిక పట్టి, శ్రద్ధ తీసుకుని పాత్రల్నీ, సంఘటనల్నీ మలిచి ఉంటే ఈ కథ జనరంజకమయ్యేది అనడంలో సందేహం లేదు. హీరో ఒక్కడికి తప్పించి ఆటోలోని మిగతా ప్రయాణీకులకి చెప్పుకోదగ్గ పాత్ర యేదీ లేదు. కాగా వీరొక్కరే ఇతివృత్తంలో లేని పాప, పాప తల్లి, కిడ్నాప్ గేంగ్ ని ప్రవేశ పెట్టి ఆసక్తికరమైన మలుపునిచ్చారు.
ఇబ్బంది - లలిత
ఎక్కడా అపశృతి దొర్లనివ్వకుండా ఆద్యంతమూ ఒక చిలిపి ఆహ్లాద కరమైన వాతావరణంలో కథ నడిపించారు లలిత. సాధారణంగా తమ కొంటె చేష్టలతో ఆడపిల్లల్ని అల్లరి చేసే కాలేజి కుర్రాడే ఒక వింత పరిస్థితిలో చిక్కుకుని తానే ఇబ్బందిగా ఫీలయినట్టు ముచ్చటైన మలుపు తిప్పి ముగించారు. ఈ నాటి సాంఘిక వాతావరణానికి తగినట్టు సెల్ ఫోన్లో రింగ్ టోన్ ని కథకి కీలకంగా ఉపయోగించుకోవటం కూడ బావుంది. ఐతే ఈ కథ కూడా ఒక స్కెచ్ లాగా మిగిలిపోయింది, తగినంత డీటెయిల్ నింపే ప్రయత్నం చెయ్యక పోవడంతో. షేర్ ఆటోలోని మిగతా ప్రయాణీకులందరూ అప్పుడూ అప్పుడూ ఓ మాట అనడంతో వాళ్ళ పనై పోయింది. కాలేజ్ స్టూడెంటు ప్రవర్తన వల్ల ఆటోలోని పడుచు పిల్ల ఇబ్బంది పడ్డ సూచన ఏదీ లేదు కథలో. ముందు తానే మిగతా వారిని ఇబ్బంది పెట్టి, చివరకి తన సెల్ ఫోన్ వల్ల తనే ఇబంది పడ్డట్టు, అవసరమైన సిచ్యువేషనల్ డీటెయిల్ చిత్రిస్తూ చెప్పి ఉంటే కథ ఇంకా రక్తి కట్టి ఉండేది.
జీవన తరంగాలు - శ్రీకాంత్ (దైవానిక)
ఫేంటసీ సాహిత్యాన్ని బాగా ఇష్టపడే నూతన బ్లాగరి శ్రీకాంత్ ఈ కథతో చెయ్యి తడి చేసుకున్నారు. ఉదాత్తమైన సంఘటనలనీ, మానవ హృదయంలోని లోతుల్ని ఆవిష్కరించ ప్రయత్నించారు కానీ పాత్ర చిత్రణకి అవసరమైన నేపథ్యం కొరవడి, కథలో జరిగిన సంఘటనలు తెచ్చి పెట్టుకున్నట్టుగా మిగిలాయి. మొదటినించీ ప్రథమ పురుషలో సాగుతున్న కథనంలో ఉన్నట్టుండి "అనుకుంటా" అంటూ రెండు చోట్ల యువకుడైన మయూర్ తరపున వకాల్తా పుచ్చుకుంటాడు కతకుడు. రైలు పెట్టెలో ఎక్కి కూర్చున్న హీరో మనసులో ఆలోచనలుగా మొదలైన కథ, తిరిగి మళ్ళీ హీరో దగ్గిరికి చేరకుండానే ముగిసిపోయింది. అస్పష్టత ఉండటమే నేరం కాదు గానీ, తిన్ననైన కథనంలో కోరి అస్పష్టతని తెచ్చుకున్నప్పుడు దానికేవన్నా నిర్దిష్టమైన ప్రయోజనం ఉన్నప్పుడే అది రాణిస్తుంది.
శుభారంభం - సుజాత
కథా సందర్భానికీ పాత్రలకీ తగిన నేపథ్యాన్ని చక్కగా వర్ణించారు. ఎండ తీవ్రతని చెబుతూ ఆటోలో ఆ పేద కుటుంబం తమ గోనె సంచీ అంతా వెదికి నీళ్ళ బాటిల్ని పట్టుకుని, సేదతీరే దృశ్యాన్న్ కళ్ళకు కట్టినట్టు వర్ణించారు. ఆ పడుచు పిల్లని యువకుడు మొదట్లో చూసే చూపులోనూ, చివరికి ఆటో దిగిపోయాక చూసే చూపులోనూ ఉండే తేడాతో అతని వ్యక్తిత్వంలో కలిగిన మార్పుని హృద్యంగా పట్టుకున్నారు. భాష వాడుకలో చాలా జాగ్రత్త వహించాలి. చాలా చోట్ల అవసరానికి మించిన గంభీరమైన పదబంధాల్ని ఉపయోగించారు. కథకి తగిన ముగింపు. కొద్దిగా చిత్రిక పడితే ఇంకా మెరిసేదేమో అనుకోకుండా ఉండలేక పోతున్నాను.
మానవత్వం - జ్యోతి వలబోజు
కథకి కావలసిన వాతావరణ నేపథ్యాన్నీ, పాత్రల నేపథ్యాన్నీ పట్టించుకుని కథలో ప్రకటించే ప్రయత్నం బాగా చేశారు. కథలో ఏం చెప్పాలి అనీ, ఎలా చెప్పాలి అనీ బాగా ఆలోచించినట్టు కనిపిస్తోంది. తొలి కథ మీద మంచి పరిణతి కనిపిస్తోంది. తమ తమ బాధల్లో ఆలోచనల్లో మునిగి ఉన్న వివిధ పాత్రలు ఇంకొకరికి ప్రాణాపాయం మీదికి వచ్చిందనంగానే తమ చింతల్ని మరిచి పోయి ఆ మనిషికి ప్రాణం పొయ్యడనికి మూందంఅ వేసినట్లు చూపెట్టడం మంచి మానవతకి గుర్తు. ఐతే ముగింపు నీతి కథల ముగింపులాగా ఉంది. మరి కాస్త ప్రయత్నిస్తే వాస్తవికత నిండిన కథలు రాయగలరు.
ప్రవీణ్ కథనం
వైవిధ్య భరితమైన టపాల్ని అలవోకగా వెలయిస్తూ ఇటీవల బ్లాగు పుస్తక నిర్మాణంతో సంకలనకర్తగా అవతరించిన ప్రవీణ్ దీనితో కథా రచయితగా రంగ ప్రవేశం చేసి ఇంకో వీరతాడు మెడకెత్తుకున్నారు. జేజేలు. అభినందించదగిన ప్రయత్నం. నిజజీవిత నాటకానికి దగ్గరగా ఉంది మీ కథా గమనం. కానీ ప్రవీణ్, ఈ కథ చదివాకా .. మీరెప్పుడూ షేర్ ఆటో ఎక్కలేదని మాత్రం చెప్పగలను :-)
సౌమ్య కథనం
మామూలుగానే సౌమ్య కథల్లో హఠాత్తుగా జనాలకి జ్ఞానోదయమయ్యే లాంటి సంఘటనలు ఉండవు. ఈ కథలో కూడా జన జీవన్ స్రవంతిలోని ఒక పాయని ప్రత్యక్షం చేశారు. కాకపోతే, కథ జరిగినంత సేపూ ఏదో జరుగుతుందేమోనని పాఠకుల్లో రేగే ఉత్కంఠకి ఓదార్పు దొరక్క పోవడంతో నీరసం వస్తుంది.
శ్రమయేవ జయతే - లలితా స్రవంతి
విలక్షణమైన ఆలోచన చేసి, ఆటోనే కథలో ఒక పాత్రని చేసి, ఆత్మ కథలాగా చెప్పించడం మంచి ప్రయోగం. ఆటోకి మనసుంటుందా, అది మాట్లాడుతుందా .. అంటే? ఉండకూడదని మాత్రం ఏముంది? కథ అన్నాక అది ఒక సృజనాత్మక ప్రక్రియ కదా! లేనిది ఉన్నట్టు చూపడం కూడా అందులో భాగమే. చదువు మానసిక వికాసానికే గానీ కేవలం జీవనోపాధికోసం కాదనీ, జీవనోపాధికి నిజాయితీ గల ఏ వృత్తి అయినా గౌరవ ప్రదమేననే మంచి సందేశాన్ని, ఆర్ద్రంగా చెప్పారు.
అంతర్మథనం - రాజారావు
పూర్తిగా యువకుడి పాత్ర దృష్టిలో, అతని మనోభావాల చిత్రణగా సాగిన కథనం. ఇంచుమించు చైతన్య స్రవంతిలాగా ఎక్కడా బిగి సడలకుండా నడిపించారు. యువకుణ్ణే కాక మిగిలిన పాత్రలకి కూడా తగినంత ప్రాముఖ్యత కల్పిస్తూ, వారి వారి వేష భాషల్ని చక్కగా చిత్రించారు. చివర్లో జరిగే మలుపుతో, ఓ.హెన్రీ కథల్లాగా, మానవత్వమే మనలో మెరిసే మరుగు పడని రత్నం అని చాటి చెపుతూ కథ ముగించారు.
అటో - ఇటో - రమ్య
ఈ కథ చదువుతుంటే పకడైన స్క్రీన్ ప్లేతో ప్రతిభ గల దర్శకుడు తీసిన ఒక లఘు చిత్రం చూసిన అనుభూతి కలిగింది నాకు. రచయిత్రి దృష్టి లాంగ్ షాట్ తో మొదలై, మీడియం కి వచ్చి, అప్పుడప్పుడూ ఆయా పాత్రల మీద క్లోజప్ గా ఫోకస్ చేస్తూ .. మనల్ని ఆ ఆటో వెంబడే పరుగులు తీయించారు. ఆటోలో ఉన్న ఆరుగురు వ్యక్తులే కాక, రాజేంద్రనగర్ నించీ మెహిదీపట్నం చేరే దాకా మధ్యలో తగిలే అనేక సెంటర్లు కూడా కథలో భాగం పంచుకుని సజీవమై నిలిచాయి. ప్రతి ఒక్క సన్నివేశంలోనూ పాత్రల మనోభావాలని సందర్భోచితంగా పట్టుకోడానికి రచయిత్రి చూపిన శ్రద్ధ కనిపిస్తుంది. ముగింపు సంఘటన ఆశ నిరాశల మధ్య పెండ్యులంలా ఊగుతూ, నిజమింతే కదా అని ఆశ్చర్యంతో ముక్కున వేలేయిస్తుంది.
ఈ సారి కూడా విజేత రమ్య గారే.
రాజారావు, లలితాస్రవంతి గార్ల కథలు కూడా నాకు బాగా నచ్చాయి. అంచేత వారిద్దరికీ కూడా ఈ సారికి ప్రోత్సాహక బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను.
విజేతలకి అభినందనలు. ఈ పాత టపాలో నాకు బాగా నచ్చిన నాలుగు పుస్తకాలకి లింకులు ఉన్నాయి. అవి చూసి ఒకటి యెంచుకుని మీ యెంపికని నాకు మెయిల్లో తెలియబరిస్తే, ఆ పుస్తకం మీకు అందే ఏర్పాటు చేస్తాను.
ఉత్సాహంతో ముందుకొచ్చి పాల్గొన్న వారందరికీ పేరు పేరునా నా ధన్యవాదాలు. ఈ తడవ తొలిసారి రచయితలైన రాజారావు, ప్రవీణ్, శ్రీకాంత్, సుజాత గారలకి ప్రత్యేక అభినందనలు.
ఇక్కడ ఒక విచిత్ర వ్యక్తిని (పునః) పరిచయం చేస్తాను. మొదట ఇచ్చిన ఇతివృత్తం తెల్లకాయితం మీద ఒక కథ పరిశీలనకి వచ్చింది. చదివి, రాసినాయనతో, కథ బానే ఉంది గానీ ఇందులో తెల్ల కాయితం ఎక్కడా పెద్దగా కనబట్టల్లేదే అన్నా. "జరుగుతున్నది కబడ్డీ పోటీ కాగా, కుస్తీ బాగా సాధనచేసి వచ్చాడట ఒకడు. బరిలో దిగడం ఆలస్యం ఔట్ అయిపోయాడు. అలా నా కథ కూడా మెడ పట్టి బయటకు నెట్టబడింది. మన సచివాలయం ఎదురుగా ఆర్భాటంగా పైకెగసిన ఫ్లైఓవరును తలపింపజేసే నా కథను సమయం చూసుకొని సక్రమంగా సరయిన చోట దించాలి." అని తనమీద తనే జోక్ చేసుకో గలిగిన నిండు వ్యక్తిత్వం అతనిది. తెల్ల కాయితం పోతే పోయింది కానీ ఈ కథలో మంచి పస ఉండే సూచనలున్నాయి, ఇలాగే ప్రొసీడవమని చెప్పిన నా మాట మన్నించి, అబ్బే ఇది చాలదు, ఇంకా రాయాలి, ఇంకా చిత్రిక పట్టాలి, ఇంకా మెరుగు పెట్టాలి అన్న నా సాధింపులు భరించి మొత్తానికి ఒక చక్కటి కథని వెలయించాడు, మన వీరబల్లె వీరుడు, భట్టుపల్లె భట్టుమూర్తి. "పేరు గలవాడేను మనిషోయ్" ఈమాట మే సంచికలో ప్రచురితమైంది.
కొత్త కథా ఇతివృత్తం త్వరలో ప్రకటిస్తాను.
Monday, May 5, 2008
National Day of Prayer
నిన్న సాయంత్రం ఒక అద్భుతమైన కార్యక్రమంలో పాలుపంచుకుని వచ్చాను. ఆ ఉత్తేజం మసకేయక ముందే మీ అందరితో పంచుకోవాలని ఇలా..
అమెరికాలో నేషనల్ డే ఆఫ్ ప్రేయర్ అని జరుపుతూ ఉంటారు, మేనెలలో మొదటి గురువారం నాడు. దీని చరిత్ర, పుట్టుపూర్వోత్తరాలని వికీ పేజిలో చదవొచ్చు.
నిన్న నే వెళ్ళిన సమావేశం ప్రత్యేకత అర్ధం కావాలి అంటే ఇక్కడ స్థానికంగా దీని చరిత్ర కొంచెం చెప్పాలి.
నేనుండే బుల్లి ఊరికి పక్కనే ట్రాయ్ అని పెద్ద ఊరుంది. డెట్రాయిట్ నగర పరిసర ప్రాంతాల్లో పెద్దది, అనేక పెద్దా చిన్నా కంపెనీలకి నెలవు. సగటు ఆదాయం, విద్యా స్థితి, పాఠశాలల పురోగతి మొదలైన విషయాల్లో దేశం మొత్తమ్మీద ముందంజగానే ఉంటుంది ఈ వూరు. జాతి మత పరంగా కూడా గొప్ప వైవిధ్యం ఉంది ట్రాయ్ జనాభాలో. భారతీయ సంతతి వారూ, హిందువులూ అధిక శాతంలోనే ఉన్నారిక్కడ. డెట్రాయిట్ ప్రాంతంలో తొలిసారిగా మొదలైన హిందూ దేవాలయం కూడా ఇక్కడే ఉంది.
ట్రాయ్ నగర పౌరులు కొందరు కలిసి చాలా ఏళ్ళుగానే ఈ నేషనల్ డే ఆఫ్ ప్రేయర్ ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ప్రార్ధన సమావేశము ట్రాయ్ నగరపాలక సంస్థ భవన సముదాయం మధ్యలో ఉన్న ప్రాంగణంలో జరిపేవారు. దీన్ని నిర్వహించడానికి ఒక కమిటీ గట్రా ఉన్నారు - వీల్లు నగరపాలనలో సభ్యులు కానీ, అధికారులు కానీ కాదు - మనలాంటి సాధారణ పౌరులే. 2005 సంవత్సరపు సమావేశానికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఒక భారతీయ హిందూ వనిత ఆ కమిటీ మీటింగుకి వెళ్ళి, వాళ్ళు చేస్తున్న పనికి ముచ్చట పడి, ఆ ప్రార్ధన సమావేశంలో నేను కూడా ఒక హిందూ ప్రార్ధన శ్లోకం చెబుతాను అన్నారు. అప్పుడా కమిటీ సభ్యులు చాలా మర్యాదగా ఆమెని మందలించి ఇచ్చట క్రిస్టియను ప్రార్ధనలు మాత్రమే జరుపవలెను అని నచ్చ చెప్పారు. ఆమె తెల్లబోయి ఇదేమి అన్యాయం అని నగరపాలికను అడిగింది. వాళ్ళు మాకేమీ సంబంధం లేదు, ఊరికినే మా ప్రాంగణంలో జరుపుకోటానికి అనుమతిస్తున్నాం అన్నారు. ఈమె మళ్ళీ ఆ కమిటీ మీటుంగుకి వెళ్ళి ఈ ప్రార్ధన క్రిస్టియనులకి ప్రత్యేకం కాదు. ప్రార్ధన చెయ్యదలుచుకున్న అమెరికనులందరూ పాల్గొనవచ్చు. ఇద్ఫి నా హక్కు - అంది. దాంతో వాళ్లకి తిక్క రేగి అసలు ప్రార్ధన లేదు, సమావేశం లేదు, కేన్సిల్! అన్నారు.
ఈమె ఏమీ తక్కువది కాదు, వీరనారీమణి. చుట్టుపక్కల వివిధ మతాచార్యులని సంప్రదించింది. ఏం చెయ్యగలం అని పెదవి విరిచారు. ఏమన్నా చెయ్యాలి అని చేతులు కలిపారు. ఎలా చెయ్యాలి అని తలలు పట్టుకున్నారు. చివరికి ఎట్లాగైనా చెయ్యాల్సిందే అని నడుం బిగించారు. దాని ఫలితమే 2005 మేలో ట్రాయ్ లో తొలిసారిగా జరిగిన సర్వ మత ప్రార్ధనా సమావేశం.
ఆ వీర నారీమణి శ్రీమతి కుప్పా పద్మ, నాకు ఆర్యీసీలో సహాధ్యాయి, ఈ దేశంలో ఆత్మీయురాలు కావటం నాకెంతో గర్వంగా ఉంది. పైగా నా తోటి తెలుగు సాహిత్య పిపాసి, శ్రీ తాడేపల్లి సుధాకర్ గారి సతీమణి.
నేనూ వెళ్ళాను ఆ తొలి సమావేశానికి. అద్భుతంగా జరిగింది. ఆ సమావేశంలో పాల్గొన్నాక నాకే తెలియని ఒక వింత ఆనందంతో నిండిపోయాను ఆ పూట. సర్వమత సమానత్వమూ, విశ్వమానవ సౌభ్రాతృత్వమూ అంటే ఏవిటో తొలిసారిగా ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చి కళ్ల నీళ్ళు తిరిగాయి. అప్పణ్ణించీ ప్రతి యేడు వెళ్తూనే ఉన్నా. ప్రతిసారీ ఆ అనుభవం ద్విగుణీకృత బలంతో మనసు నింపుతూనే ఉంది. 2005 లో, ఆ వేడిలో మొదటి సమావేశం నిర్వహించిన కార్యకర్తలు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారే గానీ, వారెవ్వరికీ ఇది పెరిగి పెద్దదవుతుందని కానీ, ఇదొక సాంప్రదాయంగా మారుతుందని గానీ అనుకోలేదు వాళ్ళు. కానీ మూడేళ్ళ తరువాత, ఇది నాలుగోసారి, ఆ ఉత్సాహం కానీ, ఆ భ్రాతృ భావం కానీ, వెల్లువెత్తే ఆ సుహృద్భావం గానీ ఏమాత్రం తగ్గలేదు సరి కదా, కొత్త బలం పుంజుకుంటూ ఎదుగుతోంది. ఆ చిన్ని మొక్క వేళ్ళూనుతోంది. త్వరలోనే పదిమందికీ నీడనిచ్చే వటవృక్షం అవుతుందనే నా ఆశ.
నిన్నటి సమావేశం ట్రాయ్ యూదు మత ప్రార్ధనా మందిరం "షీర్ టిక్వః"లో రాబ్బై ఆర్నీ స్లూటల్బెర్గ్ గారి నిర్వహణలో జరిగింది. ఆర్నీ గారు తన మధురమైన గొంతుతో (ఆయన మాట్లాడినా నాకు పాటలానే ఉంటుంది!) రెవరెండ్ మార్టిన్ నియ్మోల్లర్ గారి ప్రఖ్యాతమైన పద్యం First they came .. వినిపించారు. తెలుగులో నా స్వేఛ్ఛానువాదం ..
వాళ్ళు మొదట కమ్యూనిస్టుల కోసం వచ్చినప్పుడు నేను కాదనలేదు - నేను కమ్యూనిస్టుని కాను గనక.
వాళ్ళు తరవాత సోషలిస్టుల కోసం వచ్చినప్పుడూ నేను వొద్దనలేదు - నేను సోషలిస్టుని కాను గనక.
వాళ్ళు పిమ్మట శ్రామిక నాయకుల కోసం వచ్చినప్పుడు నేను నోరు మెదపలేదు - నేను శ్రామిక నాయకుణ్ణి కాను గనక.
వాళ్ళు ఆపైన యూదుల కోసం వచ్చినప్పుడు నేను అభ్యంతర పెట్టలేదు - నేను యూదుణ్ణి కాను గనక.
వాళ్లు ఆఖరికి నా కోసమే వచ్చారు - కానీ అప్పటికి ఎవరూ మిగల్లేదు గొంతెత్తి అరిచేందుకు.
యూదు, ముస్లిము, సిక్కు, హిందూ, ప్రెస్బిటీరియన్ క్రిస్టియన్ మతాలనించి ప్రార్ధనలు చేశారు. హిందువుల తరపున ఒక పది మంది చిన్నారులు, శ్రీ కంచి పరమాచార్యులు రచించిన సంస్కృత కృతి "మైత్రీం భజత" ని ముద్దుగా ఆలపించారు. కార్యక్రమం చివర్లో అందరూ కలిసి ఏక కంఠంగా మార్టిన్ లూథర్ కింగ్ గారి వియ్ షల్ ఓవర్కం పాటని పలుభాషల్లో గానం చెయ్యడం గొప్ప అనుభవం. ఇందులో హిందీ కూడా ఉంది, ఎవరన్నా ఈ పాటని ఆ బాణీకి తగినట్టు తెలుగు చేస్తే వచ్చే సంవత్సరం తెలుగు సమావేశంలో తెలుగులో కూడా పాడొచ్చు.
Friday, May 2, 2008
నా కథ
న్యూజెర్సీ తెలుగు లలితకళాసమితి వారి తెలుగు పత్రిక తెలుగుజ్యోతి రజతోత్సవ ప్రత్యేక సంచికలో.
Sunday, April 27, 2008
బ్లాగ్విషయం - గ్రంధాలయాలు - 1
ఎన్ని గ్రంధాలయాలని చెప్పను?
చిన్నప్పుడు మా బడి వీధిలో నాపరాతి గచ్చు రీడింగ్ రూము దగ్గిర్నించి విదేశంలో విశ్వవిద్యాలయాల బృహద్గ్రంధాలయల మీదుగా నేడు బహు చిన్నవైనా అత్యాధునికమైన తంత్ర వనరులతో అలరారే ఇక్కడి స్థానిక గ్రంధాలయాల వరకూ .. నా జీవితంలో గ్రంధాలయాల పాత్ర తలుచుకోడం అంటే ఆల్మోస్టు నా జీవితమంతా నెమరేసుకోవడమే. ఈ కథ ఒక్క టపాతో ముగిసేది కాదు, విడతలుగా రాసుకోవాల్సిందే.
మా బడి ఇంటినించి సుమారు ఒక అరమైలు దూరం ఉండేది. అప్పుడప్పుడూ బస్సులో వెళ్ళినా సాధారణంగా నడిచే వెళ్ళటం. నేను నాలుగో క్లాసులో ఉన్నప్పుడు అనుకుంటా .. ఆ వీధిలో ఒక గుమ్మం ముందు బంతి పూల తోరణం కట్టి "నేడే ప్రారంభోత్సవం" అనే చిన్న బేనరొకటి కట్టి ఉంది. మేము బడికి వెళ్ళే వేళకి ఇంతే. సాయంత్రం తిరిగి వస్తుంటే అక్కడ చాలా మంది ఉన్నారు. కొంచెం తెలిసినట్లుగా కనిపించిన ఒకాయన్ని అడిగాం ఏం జరుగుతోందని. ఇక్కడ గ్రంధాలయం తెరుస్తున్నాం, మీరు కూడా వచ్చి చదువు కోవచ్చు అని చెప్పాడాయన. పిల్లల పుస్తకాలు కూడా ఉంటాయా అని ఆత్రంగా అడిగాను. ఆయన కొంచెం నవ్వి "ప్రస్తుతానికి వార్తా పత్రికలూ వార పత్రికలూ అవీ ఉంటాయి. నెమ్మది మీద అన్ని రకాల పుస్తకాలూ సమకూరుస్తాం" అన్నాడు. మాకు అప్పటీకి తెలీదు, ఆయనే ఈ గ్రంధాలయ వ్యవస్థాపకుడూ ఆ యిల్లు ఆయనదే.
మర్నాడు మేం బడికి వెళుతుంటే అక్కడే అరుగు మీద కూర్చుని ఉన్నాడాయన. మమ్మల్ని పిలిచాడు. లోపల చాపలు పరిచి ఉన్నాయి. ఒక టేబుల్ మీద తెలుగు దిన పత్రికలు దొంతర పెట్టి ఉన్నాయి. ఒక కొత్త నోటుబుక్కు, ఒక కొత్త పెన్సిలు రెండూ ట్వైన్ దారంతో ముడేసి బల్ల కోడుకి కట్టేసి ఉన్నై, ఎవరూ ఎత్తుకు పోకుండా. అన్నీ మాకు చూపించి, రోజూ వచ్చి మేమక్కడ పత్రికలు చదువుకోవచ్చనీ, వచ్చే నెల నించీ చందమామ లాంటీ పత్రికలు కూడా తెప్పిస్తాననీ, మాకు నచ్చిన విషయాల్ని ఆ నోటుబుక్కులో రాయాలనీ చెప్పాడాయన - వొట్టినే మన పేరు రాసేస్తే చాలదట.
సరే, ఇక ఆ రోజు నించీ సాయంత్రం ఇంటీకి వచ్చే దారిలో కనీసం ఓ పావుగంట అక్కడ పేపర్లు తిరగెయ్యడం అలవాటయింది. పేపరు చివరి పేజీలో పెద్దగా వేసే మా అభిమాన హీరోల సినిమాల ప్రకటనలు చూసి వాటీని చించి దాచుకోవాలనే కోరిక బలంగా ఉన్నా కూడా మేం నిగ్రహంగానే ఉన్నాం. ఒక రోజు పొద్దున మేం బడికి వెళుతుంటే ఆయన పిలిచాడు. మేం దగ్గిరికి వెళ్తూనే తిట్లంకించుకున్నాడు. ఏంటంటే ఎవరో ఆకతాయి వెధవలు పేపర్లని చించనే చించారు. రెగ్యులర్ గా అక్కడికి వచ్చేది మేమే కాబట్టి మమ్మల్ని పట్టుకున్నాడు ఈ పెద్దమనిషి. మాకు రోషం మహా మండి పోయింది. ఇహ ఆ రోజు నించీ ఆయన చుట్టు పక్కల లేకుండా చూసి లోపలికి దూరి ఆ నోటు బుక్కులో మాకొచ్చిన బూతులన్నీ రాసేసి పారిపోయేవాళ్ళం. రెండో నెలకల్లా ఈ గ్రంధాలయం మూతబడింది. స్థానే ఒక చిల్లరకొట్టు వెలిసింది.
ఇంచుమించు ఈ సమయంలోనే నాకు ఒక క్రైస్తవ బాలల గ్రంధాలయమూ ఒక సోవియట్ బాలల గ్రంధాలయమూ కూడ పరిచయమయ్యాయి. మొదటిది ఒక పాస్టరు గారింట్లోనే. అందుకని అంతా పకడ్బందీగా ఉండేది, ప్రశాంతంగా ఉండేది. ఆ పుస్తకాలు చక్కటి కాగితంతో బైండుతో, రంగు బొమ్మలతో చాలా అందంగా ఉండేవి. అక్కడే నేను అబ్రహాము, మోజెస్ ఇత్యాదుల కథలు మొదటిసారి చదివాను. మా బడి ఉండేది చుట్టుగుంట దగ్గిర విశాలాంధ్ర పత్రికాఫీసు ఉన్న రోడ్డులో. అంచేత ఆ చుట్టు పక్కల కమ్యూనిస్టు పార్టీ ప్రాభవం బలంగానే ఉండేది. అక్కడే ఈ సోవియట్ బాలల లైబ్రరీ కూడా. అందులో సోవియట్ బాలల సాహిత్యం మొదటి సారి పరిచయమైంది. ఆ పుస్తకాలు కూడా చాలా చక్కటీ కాగితంతో చక్కటి బొమ్మల్తో ఉండేవి. కథల్లో పాత్రల పేర్లు మీషా, శోష్కా .. అని ఇలా తమాషాగా ఉండేవి. నేనూ నా స్నేహితులు ఒకరికొకరు ఇలాంటి పేర్లు పెట్టుకుని పిలిచుకునే వాళ్ళం. కాకపోతే ఈ రెండు రకాల పుస్తకాల్లోనూ భాష మాత్రం చందమామ లాంటి పత్రికల్లో మాకు అలవాటైన భాష కాదు, చాలా తమాషాగా ఉండేవి. ఆ విచిత్రమైన భాషకి ఆశ్చర్య పడుతూనే కథలంటే ఉన్న పిచ్చి వల్ల క్రమం తప్పకుండా ఈ రెండు లైబ్రరీలనీ దర్శిస్తూ ఉండేవాణ్ణి.
Monday, April 21, 2008
రెండో కథకి గడువు పొడిగింత
పలువురు బ్లాగ్జనుల కోరిక పై రెండో కథాంశానికి కథలు సమర్పించే గడువు పొడిగించడమైనది. ఔత్సాహిక కథకులకి ఏప్రిల్ 25 వరకూ సమయం ఉంది. త్వరపడండి :-)
అసలు ఏంటీ, కథాంశం, గడువు అనుకుంటున్నారా?
ఐతే ఇక్కడ చూడండి. కాస్త ఓపిగ్గా ఆ టపా చివరిదాకా చదివితే అసలు కథ మీకే తెలుస్తుంది.
ఇప్పటిదాకా వెలువరించిన వారు: లలిత, రమ, తాడిమేటి రాజారావు, మయూఖ, దైవానిక, రమ్య.
ఎవర్నైనా నేను గమనించక పోతే దయచేసి నాకో వేగు పంపండి.
Wednesday, April 16, 2008
నిజ జీవితంలో తెల్ల కాయితం
నేను తెల్ల కాయితం కథా వస్తువుని ప్రకటించినప్పుడు ఒకరిద్దరు మిత్రులు అన్నారు, ఇంకా ఈ కాలంలో ఒక్క తెల్ల కాయితం కూడా దొరకని వాళ్లుంటారా అని.
ఏం చెప్పాలో తెలీక మౌనంగా ఉండిపోయాను.
ఐతే ఈ ఇతివృత్తాన్ని ఉపయోగించి మనవాళ్ళు చాలా మంది రాసిన కథల్లోని కొన్ని సంఘటనలు ఒక నిజజీవితంలో జరిగిన ఉదంతం ఇలా కళ్ళబడుతుందని అనుకోలేదు.
సుంకోజి దేవేంద్ర మంచి భవిష్యత్తున్న యువ కథా రచయిత. తన సొంత అనుభవాల్ని నెమరు వేసుకుంటూ అవే తనకి కథకుడిగా ఎదగడానికి ఎలా ప్రేరణ అయినాయో ఇక్కడ చదవండి తన సొంత గొంతులో.
కథ 2005 సంకలనంలో చోటు చేసుకున్న అతని కథ కొమ్మిపూలు గురించిన ప్రస్తావన ఈ సమీక్షలో చూడచ్చు.
అతని కథల సంపుటి అన్నం గుడ్డ అనే పేరుతో 2007 లో విడుదలైంది.
దేవేంద్ర గురించి, అన్నం గుడ్డ కథల సంపుటి గురించి మరి కొన్ని మాటలు.
http://kadalitaraga.wordpress.com/2007/02/23/aksharala_daarushilpi_devendra/
http://pustakam.wordpress.com/2007/07/09/annam/
దేవేంద్రని ఈ సరి కొత్త గౌరవం సాధించిన సందర్భంగా మనసారా అభినందిస్తూ ..








