పట్టమ్మాళ్ గారికి వీడుకోలు

సంగీత కళానిధి డి.కే. పట్టమ్మాళ్ తొంభై నిండిన పండు వయసులో ఈ అవతారం చాలించి సరస్వతీ సాన్నిధ్యానికి చేరుకున్నారు.

సాంప్రదాయకమైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి, బ్రాహ్మణ బాలికలు వేదికనెక్కి కచ్చేరీ చెయ్యడం అనాచారంగా భావించే కాలంలోనే అనేక సామాజిక కట్టుబాట్లని ఎదురుకుని, గొప్ప గాయనీమణిగా పేరు తెచ్చుకున్నారు. తన తరంవారే అయిన ఎమ్మెస్ సుబ్బలక్ష్మి, ఎమ్మెల్ వసంతకుమారిలతో కలిపి కర్ణాటక గాత్ర సంగీతంలో స్త్రీరత్నత్రయంగా ప్రసిద్ధి చెందారు. తరువాతి తరంలో స్త్రీలు వేదికనెక్కేందుకు మార్గదర్శకులయ్యారు.

తమిళంలో ఎన్నో మరపురాని కృతులు రచించిన మహా వాగ్గేయకారుడు పాపనాశం శివన్ గారి ప్రత్యక్ష శిష్యురాలీమె. అందువల్ల తమ గురువుగారి కృతులు పాడ్డంలో ఆ కృతుల భావం ఇంకా గొప్ప సొగసుతో ప్రభవిస్తుండేది. ఆవిడ గొంతు విలక్షణమైనది. ఎమ్మెస్ సుబ్బలక్ష్మికి లాగా కోకిల కంఠం కాదు, వసంత కుమారికి లాగా కంచుగంట కాదు. కొద్దిగా బొంగురుగా, ఒక మాదిరి జీర కలిసిన కొమ్ముబూర ధ్వనిలా ఉండేది. అటువంటి గొంతునే తన స్వంత ముద్రగా మలచుకుని, అంత ప్రసిద్ధుడైన గురువు నీడలో పెరిగినా సంగీత వేదిక మీద తనదైన స్థానం సంపాదించుకున్నారు. సంప్రదాయం, శ్రుతి శుద్ధం, లయ మీద పట్టు .. వెరసి పట్టమ్మాళ్ (ఇది చిన్న శ్లేష. తెలుగులో పిల్లల్ని చిన్ని, బంగారం అని పిల్చుకున్నట్టు, తమిళంలో చెల్లం, పట్టు (silk)అంటారు. ఒక్కోసారి అదే నిజం పేరుకూడా అవుతుంది. పట్టు + అమ్మాళ్ = పట్టమ్మాళ్ అన్నమాట).

తనకంటే బాగా చిన్నవాడైన సోదరుడు డి.కే. జయరామన్ కి తానే గురువై తనంత వాడిని చేశారు. ఈ నాడు పట్టమ్మాళ్ గారి మనుమరాలు శ్రీమతి నిత్యశ్రీ మహాదేవన్ బామ్మగారి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కర్ణాటక రంగంలో మంచి పేరు తెచ్చుకుంటున్నారు.

ఆవిడ ఇంకా కొన్నేళ్ళు బతికి ఉండాలని కోరుకోవడం బహుశా అత్యాశే అవుతుంది. అయినా, అకస్మాత్తుగా ఇక లేరు అనుకుంటే, చెవుల్లోనూ, మనసులోనూ వెలితే మరి!

పట్టమ్మాళ్ వికీ పేజి
హిందూ పత్రికలో వార్త
మ్యూజిక్ ఇండియా ఆన్లైన్లో దీక్షితర్ కృతి రంగనాయకం

సర్వసమర్ధులం!

మనం చాలా సమర్ధులం.

అబ్బో, మనలో బోలెడు సామర్ధ్యం ఉంది.

ఎంత సామర్ధ్యం ఉన్నదంటే, ఎంత ఉన్నదో మనకే తెలీక, వ్యక్తిత్వ వికాస పుస్తస్కాల రచయితలూ, కోర్సుల నిర్వాహకులూ, ఆఖరికీ సినీ రచయితలు కూడా ఈ విషయాన్ని మనకి పదేపదే ఎప్పటికప్పుడు బోధిస్తుంటారు. మనలో ఎంత సామర్ధ్యం ఉన్నదో ఎప్పటికీ మనం మర్చి పోకుండా, ఏ క్షణమూ మనం సమర్ధులమనే విషయం మనకి మరపు రాకుండా.

మా అమ్మా నాన్నల తరం సంగతి, కనీసం ఈ విషయంలో, నాకు అంత బాగా తెలీదు కానీ, నా తరంలో .. మనసు పెడితే సాధించలేనిదేదీ లేదు, మనకి అసాధ్యం ఏదీ కాదు, మనం సకల సమర్ధులం అన్న ఆత్మ విశ్వాసంతోనే పెరిగాం మేమంతా. అలాగే సగం జీవితాన్ని గడిపేశాం కూడా. ఎప్పుడన్నా యాభైల్లో అరవైల్లో రాసిన కథలూ నవల్లూ చదువుతున్నప్పుడు, ఆ నిరుద్యోగ సమస్యలూ, ఆ దిగువ మధ్య తరగతి దిగుళ్ళూ, ఆ బేలబేల ప్రేలాపనలూ, ఆ దీనాలాపాలూ చదివి అప్పుడప్పుడూ వొళ్ళు మండేది కూడాను. ఆ ఆ బేల దీన ఏడుపుగొట్టు హీరో వెధవాయిని పట్టుకుని ఆ చెంపా ఈ చెంపా వాయించి ఒక నాలుగు పుంజీల వ్యక్తిత్వ వికాసం వాడి నోట్లో కుక్కి, ఒక నాలుగౌన్సుల ఆత్మవిశ్వాసపు హార్మోను ఇంజెక్షనిచ్చి, సిక్స్ ట్రాక్ స్టీరియోఫోనిక్ సిస్టంలో కుడిచెవిలో ఎప్పుడూ ఒప్పుకోవొద్దురా వోటమీ అంటూనూ, ఎడమ చెవిలో సాహసం శ్వాసగా సాగిపో సోదరా అంటూనూ మారు మోగించేసెయ్యాలనిపించేది.

మరింత సామర్ధ్యం ఉంది గదా మనలో! అదొక మధుమదోన్మత్త కాల్పనిక జాగ్రదావస్థ!!
ఉన్నట్టుండి మెలకువొస్తుంది.

అప్పటిదాకా తనువులు వేరైనా మనసులు ఒకటే అనుకున్న స్నేహితుడు ఉన్నట్టుండి బద్ధశత్రువైపోతేనో, అప్పటిదాకా మనకి కొండంత అండగా నిలిచిన అమ్మ అనారోగ్యం పాలయ్యి మన కళ్ళముందే జీవఛ్ఛవంలా ప్రాణమున్న అస్తిపంజరంలా తయారవుతుంటేనో, అప్పటిదాకా ప్రాణప్రదంగా ప్రేమించిన భర్తో భార్యో ఇక నీతో జీవితం చాలు అని దాంపత్యానికి చరమగీతం పాడుతుంటేనో, మన జీవన దీపం అని అప్పటిదాకా అల్లారుముద్దుగా పెంచుకుంటున్న మన బిడ్డ తెలిసితెలిసీ తప్పు దారి పట్టి మనకి దూరమై పోతుంటేనో ...

అప్పుడు అనిపిస్తుంది, బహుశా మనం అంత సమర్ధులం కాదేమోనని!

ఒక్క క్షణం పాటు.

ఒక ఆత్మవిశ్వాసపు ఇంజక్షను మనకి మనమే చేసుకుని సాగిపోతాం, సాహసం శ్వాసగా.
సర్వ సమర్ధులం కదా మరి!

ఆంధ్రజ్యోతి ఆదివారం ముఖపత్ర వ్యాసం ఆస్ట్రేలియా తెలుగు బ్లాగర్ల నించి

ఆస్ట్రేలియాలో కొంతకాలంగా భారతీయ విద్యార్ధుల మీద జరుగుతున్న మూక దాడుల గురించి ఇద్దరు తెలుగు బ్లాగర్లు రాసిన వ్యాసాలు ఈ ఆదివారం ఆంధ్రజ్యోతి ముఖపత్ర కథనంగా వెలువడినాయి.

అదలాగుండగా, ఇవ్వాళ్ళ (ఆదివారం) పొద్దున్న సుమారు తొందిన్నరకి యింటెనక పెరట్లోకి వెళ్తే పైన పశ్చిమాకాశంలో బహుళ పంచమి జ్యోత్స్న వెలతెలబోతూ కనబడింది. నేను భయపళ్ళేదనుకోండి. కానీ "ఆకాశపుటెడారిలో కాళ్ళుతెగిన ఒంటరి ఒంటెలాగుంది జాబిల్లి" .. ఇదిమాత్రం నిజం!
ఇదే జాబిల్లి నిండు పున్నమి నాడు వెండి పళ్ళెంలా మెరుస్తూ ప్రేమికులకి విరహాగ్నిని పెంపు చేస్తుంటాడంటే .. ఇవ్వాళ్ళ ఈ క్షణాన నమ్మడం కష్టమే! కాలమెంత చిత్రమైనది, ఎంత గొప్ప మార్పుని తెస్తుంది?

తెలుగెలా నిలుస్తుంది?

బ్లాగర్లు కొందరు తెలుగు భాష మనుగడ గురించి బాగా లోతుగా ఘాటుగా చర్చించారు ఇటీవల.
ఆ సందర్భంగా కొన్ని ఆలోచనలు. ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నది రాసే భాష గురించే, మాట్లాడే భాష గురించి కాదు.

ఆంగ్లం మూలంగానూ హిందీ మూలంగానూ తెలుగు మరుగున పడిపోతున్నది అనే ఆక్రోశం ఈనాటిది కాదు. 30లు 40లలో వచ్చిన అనేక కథల్లో వ్యాసాల్లో నవలల్లో కూడా ఈ ఆక్రోశం చూడచ్చు మనం. బాబోయ్, తొందరగా ఏమన్నా చెయ్యకపోతే మన కళ్ళముందే తెలుగు భాష కనుమరుగైపోతుందో అన్నంత ఆందోళన వ్యక్తపరిచారు ఆ తరం రచయితలు. మరి ఆ తరం దాటి డెబ్భయ్యేళ్ళ పాటు తెలుగు మనడమే కాక, ఈ గ్లోబలైజుడు కంప్యూటరైజుడు యుగంలో కూడా సజీవంగా మన నాలుకలమీద, మన కీబోర్డుల మీద, మన కంప్యూటరు తెరల మీద నాట్యమాడుతోంది గదా!

అలాగని ఆందోళన కలిగించే పరిస్థితులు లేవని నేననడం లేదు. ఏవిటా ఆందోళన కలిగించే పరిస్థితులు, వాటిని గురించి ఏమి చెయ్యాలి, ఎంత చెయ్యగలం .. ఇవన్నీ కొంచెం స్పష్టంగా ఆలోచించుకోవాలి, ఉద్యమాలకి ఉపక్రమించేముందు.

భాష సజీవం. జీవానికి గుర్తు మార్పు. అందుకని అది నిరంతరం మారుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఇదింక మారకూడదని శాసిస్తామో, ఇక ఆ భాషకి సమాధి కట్టినట్టే.

మన మనసుల్లో ఉన్న మాట చెప్పుకోడానికి, మన ఆలోచనలు పంచుకోడానికి, ప్రస్తుత పరిస్థితుల్ని చర్చించుకోడానికీ భాష ఉపయోగ పడాలి. ఈ ప్రయోజనం నెరవేర్చలేక పోయినప్పుడు భాష పాతబడిపోతుంది. ఇలా పాత బడినప్పుడు అది సమాధికి ఒక అడుగు దగ్గర వేసినట్టే. ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నది రాసే భాష గురించే, మాట్లాడే భాష గురించి కాదు.

గతమంతటా భాష ఒకేరకంగా లేదు. పద్య సాహిత్యంలోనే, నన్నయ భాష వేరు, శ్రీనాథుడి భాష వేరు, పెద్దన భాష వేరు. ఆధునిక యుగం వచ్చాక కూడా గురజాడ దగ్గిర్నించీ ఇప్పటి వరకూ భాష మారుతూనే ఉంది, ఆయా కాల పరిస్థితులకి తగినట్టు.

శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు రాసిన వ్యాసాలు చదువుతున్నానీమధ్య. అకస్మాత్తుగా ఒక విశేషం కనబడింది వారిద్దరి రచనల్లోనూ. ఆంగ్లాన్ని చాలా తక్కువ ఉపయోగించారు వారు. వారిద్దరి ఆంగ్ల భాషా పరిజ్ఞానం, సాహిత్య పరిజ్ఞానం ఏమీ తక్కువకాదు మళ్ళీనూ. సంక్లిష్టమైన అనేక సామాజిక సాహిత్య విషయాల్ని చక్కటి తెలుగులో రాశారు, ఆంగ్లమ్మీద ఆధారపడకుండానే. మనమేమో, ఏదో రోజువారీ సంభాషణ కాక కొద్దిగా జటిలమైన విషయం గురించి ఒక్క వాక్యం రాయాలన్నా, హమ్మో ఇంగ్లీషు వాడకుండా ఎలాగు? అనుకుంటూ అందోళనలో పడిపోతున్నాం.

తెలుగులో కంప్యూటరు, ఫైలు, ఇత్యాది పదాల్ని వాడాలా వొద్దా అని ఒక వివాదం. ఆ సామర్ధ్యం ఉన్నవారు ఇటువంటి అనేక పదాలకి తెలుగు సమానార్ధకాల్ని ప్రతిపాదించి వాడుతున్నారు. వాటిల్లో కొన్నిటికి కొంత జనాదరణ లభిస్తున్నది కూడా, కనీసం బ్లాగర్లలో. ఈ గోలంతా ఎందుకూ, ఆంగ్లపదాలనే ఉపయోగిస్తే పోలేదా అని కొందరి వాదన. వాదన, చర్చ మంచిదే కానీ అది అవహేళనకి దారి తీస్తే మొదటికే మోసం వస్తుంది. ఇలా ప్రతిపాదిస్తున్న పదాలేవీ మాంత్రికుడు హాంఫట్ అని మాయాదర్పణంలోంచి పుట్టించినవి కావు, ఎప్పటినించో ఉన్నవే. వాడుక లేక మరుగున పడిపోయాయి. ఉదాహరణకి ఫైలుకి కవిలె, దస్త్రం అనే పదాలు వాడుకలో ఉండేవి. ఇప్పుడు మళ్ళీ వాటికి బూజు దులిపి కంప్యూటరు ఫైలు అనే అర్ధంలో వాడితే, కొన్నాళ్ళు కొత్తగా ఉండొచ్చుగానీ అందులో ఎగతాళి చెయ్యాల్సినదేమీ లేదు.

ఈ విషయంలోనే రెండు ముచ్చట్లు చెప్పాలి. కథలకి కావలసిన భాష వేరు, కవిత్వానికి కావలసిన భాష వేరు, సాంకేతిక శాస్త్రీయ వ్యాసాలకీ చర్చలకీ కావలసిన భాష వేరు. శాస్త్ర చర్చల్లో భాష జనసామాన్యానికి అందుబాటులో ఉండే భాష కాదు. మనలో నాకు బాగా ఇంగ్లీషు వొచ్చు అనుకున్న వాళ్ళలోనే ఒక ఆంగ్ల సాహిత్య విమర్శని, ఒక సామాజిక శాస్త్ర చర్చని, ఒక ఆర్ధిక శాస్త్ర విశ్లేషణని ఎంతమందిమి క్షుణ్ణంగా అర్ధం చేసుకో గలం? అందుకని మనం చర్చిస్తున్నది సాంకేతిక పరిభాష గురించి కాదు. కాస్తో కూస్తో చదువుకున్న వారందరికీ నాలుగు విషయాలూ మాట్లాడుకునేందుకు అందుబాటులో ఉండే భాష గురించి. శాస్త్ర చర్చలకి కావలసిన పారిభాషిక పదాల్ని ఆయా వర్గాలు సృష్టించుకుంటాయి.

రెండో ముచ్చట, మనం గుర్తు పెట్టుకోవాల్సింది, మార్పు ఒక్కోసారి పని గట్టుకుని ప్రయత్న పూర్వకంగా తేవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం వాడుక భాషలో రాసుకుంటున్నాం అంటే, దానికి సుమారొక వందేళ్ళ క్రితం ఒక కురుక్షేత్ర సంగ్రామమే జరిగింది. ఆ యుద్ధంతో పోలిస్తే, ఇప్పుడు భాషగురించి జరుగుతున్న చర్చలు, వాదోపవాదాలూ పిల్లలాటలాగా ఉంటాయి.

సప్తర్షి మండలం - పెద్ద గరిటె

వేసవి రాత్రుల్లో ఆరుబయటనో డాబామీదనో పడుకుని బాల్యం గడిపిన వాళ్ళకి సప్తర్షి మండలం సుపరిచయమే. చక్కగా పేద్ద గాలిపటంలా ఉంటుంది, మూడు నక్షత్రాల తోకతో.

ఆంగ్లం నేర్చాక దీన్ని Big Dipper అంటారని నేర్చుకున్నా, కానీ ఎందుకా పేరొచ్చిందో ఎప్పుడూ అంతు బట్టలా.

ఇవ్వాళ్ళ సూర్యాస్తమయం తరవాత మా యింటి వెనక పచ్చిక బయల్లో పచార్లు చేస్తుంటే, ఇంకా చంద్రోదయం కాని మబ్బులు లేని ఆకాశంలో దర్శనమిచ్చింది .. ఒక్క పాటున బుర్రలో చిరుదీపం వెలిగింది, ఈ నక్షత్ర సముదాయానికి ఆంగ్లంలో ఆ పేరెందుకొచ్చిందో.

భారద్దేశపు అక్షాంశరేఖ నించి చూస్తే ధృవతార క్షితిజసమాంతర రేఖ (horizon) కి బాగా చేరువలో కనబడీ కనబడకుండా ఉంటుంది. సప్తర్షిమండలం దానికి దగ్గర్లోనే దాని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. వేసవి రాత్రుల్లో సప్తర్షిమండలం ఎప్పుడూ ఉదయిస్తూ కనిపిస్తుంది, అంచేత గాలిపటాన్ని చేసే నాలుగు నక్షత్రాలూ పైకి ఉన్నట్టూ, మిగతా మూడు నక్షత్రాలూ తోకలా ఉన్నట్టూ కనిపిస్తాయి.

మిషిగన్ అక్షాంశరేఖ నించి చూస్తే ధృవతార క్షిసరే కి సుమారు యాభై డిగ్రీల కోణంలో ఉంటుంది. వేసవి రాత్రుల్లో సూర్యాస్తమయమైన వేళలో సప్తర్షిమండలం భారద్దేశంలో కనిపించే దృశ్యానికి తల కిందులుగా కనిపిస్తుంది. అంటే తోకగా ఉండే మూడు నక్షత్రాలూ చక్కగా వొంపు తిరిగిన గరిటె కాడలాగానూ, గాలిపటంలా ఉండే నాలుగు నక్షత్రాలూ లోతైన గరిటె లాగానూ. అదీ బిగ్ డిప్పర్!

ఈ దృశ్యం దక్షిణభారద్దేశంలో ఎక్కడా కనబడదు. కాష్మీరు ప్రాంతాల ఏవన్నా కనిపిస్తుందేమో.

నేటి రైతులోని సజీవాత్మ

ఇట్లు ఒక రైతు పుస్తక రచయిత గొర్రెపాటి నరేంద్రనాథ్ మరణ వార్త కలవర పరిచింది.
నిన్ననే నవోదయ నించి మొదటి పుస్తకాల బంగీ అందింది. వచ్చిన పది పుస్తకాల్లోంచీ ఎందుకో ఈ పుస్తకమే నా దృష్టి నాకర్షించింది. ఒక్క బిగిని చదివేశాను. కథలంటే చెవికోసుకునే నేను, తెలుగులో గనీ ఇంగ్లీషులో గానీ ఒక నాన్-ఫిక్షను పుస్తకాన్ని ఇంత ఇదిగా చదవలేదు.

ఇవ్వాళ్ళ పొద్దున లేచి బ్లాగులు చూస్తుంటే ముందుగా కొణతం దిలీప్ బ్లాగులోనూ, అటుపై నారాయణీయంలోనూ ఈ నమ్మలేని వార్త.

ఆంధ్రజ్యోతిలో బాలగోపాల్ కదిలించే అక్షర నివాళి ఇచ్చారు.

నరేంద్రనాథ్ గారి జీవితం ఆదర్శప్రాయం అని చెప్పటం వైశాఖ సూర్యుణ్ణి చూపించి, దీపమమ్మా అని చెప్పటం లాగుంటుంది. పార్టీలకీ సిద్ధాంతాలకీ ఇజాలకీ అతీతంగా నేల మీద, మనుషుల మధ్య నిలబడి, కళ్ళెదురుగా అను నిత్యం తన తోటి వారిని పట్టి పీడిస్తున్న సమస్యలకి నిర్మాణాత్మకమైన పరిష్కారాలని వెదికేందుకు నడుంకట్టి అవిశ్రాంతంగా శ్రమించిన సాహసి ఆయన. దేశంలో ఏం జరుగుతోంది, మన పల్లెల్లో ఏం జరుగుతోంది అని మనసుకి పట్టించుకునే ప్రతి ఒక్కరూ చదివి తీరాల్సిన పుస్తకమిది.

ఆయన చెయ్య బూనిన పని సామాన్యం కాదు, నాకు ప్రత్యక్షంగా, అనుభవపూర్వకంగా తెలుసు. ఆయన నడిచినంత తీవ్రంగానూ, పూర్తిగా ఆయన పద్ధతిలోనూ కాకపోయినా, నేనూ ఆ దారిలో నాలుగడుగులు వేసినవాణ్ణే!

నరేంద్రనాథ్ గారూ, మీ జ్ఞాపకం మా మనసుల్లో ఆరని జ్వాలగా రగులుతుండాలి!

అమెరికా అంటే నాకిష్టం - 01

నా మెట్టినిల్లు అమెరికా మొన్నీ మధ్యనే పుట్టిన్రోజు జరుపుకుంది.
దాన్ని గురించి ఆలోచిస్తుంటే .. తీగ తగిల్తే డొంకంతా కదిల్నట్టు .. ఏవేవో ఆలోచనలు.
నేనీ దేశం రావడం యాదృఛ్ఛికంగా జరిగింది. నేనిక్కడికి రావాలని గొప్ప ఆరాటం లాంటిదేమీ పడలేదు. అమెరికా వెళ్ళలేక పోతే నా జన్మ వ్యర్ధంలాంటి ఆవేశాలేవీ పళ్ళేదు. నా జీవితంలో అప్పటిదాకా జరిగిన అనేక ముఖ్య పరిణామాలన్నీ నా ప్రమేయం పెద్దగా లేకుండానే జరిగిపోయినట్టే ఇది కూడా జరిగింది. అప్పట్లో నా ఉద్దేశమల్లా .. ఇదొక అవకాశం. ఉపయోగించుకుని చూద్దాం ఏమవుతుందో .. అని మాత్రమే.

మొన్నటి జూలై 4 సందర్భంగా రేగిన ఆలోచనల్తో, అమెరికాలో నాకిష్టమైన విషయాల గురించి ఇక్కడ పంచుకుందామని బుద్ధి పుట్టింది. ఆ వరుసలో ఇది మొదటి టపా. ఈ వరుసకి ఒక ప్రాధాన్యత ఏమీ లేదు. నాకు గుర్తొచ్చినవి గుర్తొచ్చినట్టు రాస్తుంటాను.

నేషనల్ పబ్లిక్ రేడియో ప్రస్తావన నా టపాల్లో ఇంతకు ముందు చూసే ఉంటారు.
ఈ సంస్థ దేశరాజధాని వాషింగ్టన్ డీసీలో ఉంది. తానే అనేక కార్యక్రమాల్ని, ముఖ్యంగా వార్తలకి సంబంధించిన వాటిని, ప్రొడ్యూస్ చేసి ప్రసారం చేస్తుంటుంది. అంతే కాక తమ నెట్వర్కులో సభ్యులైన కొన్ని స్టేషన్లు ప్రొడ్యూస్ చేసే కార్యక్రమాలని తమ సర్వీసు ద్వారా బట్వాడా చేస్తుంది.

అందులో, ఫిలడెల్ఫియా నగరంలోని WHYY స్టేషన్లో తయారయ్యే ఫ్రెష్ ఏర్ (Fresh Air) కార్యక్రమం నాకు చాలా ఇష్టం. నిర్వాహకురాలు టెరీ గ్రోస్ (Terry Gross) ఈ కార్యక్రమాన్ని ఒక ఇంటర్వ్యూ ఫార్మాట్ లో నడిపిస్తారు. అనేక సమకాలిక సమస్యల గురించి ఎవరో ఒక్క వ్యక్తితో టెరీ సంభాషిస్తారు. మనకి ప్ర్ధాన మీడియాలో ఎక్కువగా కనిపించని వినిపించని ఉద్యమకారులు, సైద్ధాంతికులు, ఈ కార్యక్రమంలో వినిపిస్తారు. నటులు, దర్శకులు, రచయితలు, సంగీతకారులు ఈ కార్యక్రమంలో మనకి వినిపిస్తారు. ఈ షో ఎప్పుడూ పనిరోజు మధ్యలో, ఏ మధ్యాన్నం పన్నెండింటికో వస్తుంది. విద్యార్ధి రోజుల్లో లాబ్ కి మనమే మహరాజులం కాబట్టి లాబ్ లో రేడియో పెట్టుకుని తప్పక వినేవాణ్ణి. ఇప్పుడు జాలం పుణ్యమాని ఇంటికొచ్చాక పాడ్కాస్టులు వింటున్నా. ఇంటర్వ్యూ చెయ్యాలి అంటే టెరీ చేసినట్టు చెయ్యాలని నాకు అదొక స్టాండర్డ్ గా ఏర్పడిపోయింది. తన అతిథులతో మాట్లాడేటప్పుడు ఆమె సమయోచితంగా వినబరిచే ఆత్మీయత, ఆర్ద్రత, కొంటెతనం, అంతలోనే వారి ఆలోచనల లోతుల్ని కొలిచే నిశిత దృష్టి .. అన్నీ నాకు చాలా ఇష్టం. వియత్నాం యుద్ధం సమయంలో అమెరికా రక్షణమంత్రిగా పనిచేసిన మెక్నమారా ఇవ్వాళ్ళ చనిపోయారుట. ఆయనతో టెరీ 1995లో జరిపిన ఇంటర్వ్యూ పునః ప్రసారం ఇవ్వాళ్టి విశేషం.

నాకు అమితంగా నచ్చే ఇంకో కార్యక్రమం డయాన్ రీం షో (Diane Rehm Show). దీన్ని వాషింగ్టన్ డీసీలోని అమెరికన్ విశ్వవిద్యాలయపు రేడియో స్టేషన్ WAMU వారు నిర్మిస్తున్నారు. ఇది కూడా సంభాషణల ప్రోగ్రామే కానీ దీన్ని డయాన్ నడిపే విధానం ఫ్రెష్ ఏర్ కంటే భిన్నంగా ఉంటుంది. ఎక్కువగా ఈ కార్యక్ల్రమంలో సమకాలీన జాతీయ అంతర్జాతీయ సమస్యల మీద ముగ్గురు నలుగురు మేధావుల్ని అతిథులుగా పిలుస్తారు. డయాన్ సంభాషణకి దిశ నిర్దేశించడం, ఎప్పుడు ఎవరు మాట్లాడాలని సూచిస్తుండడమే కాక, మధ్య మధ్యలో ఆయా అతిథులు వెలిబుచ్చే అభిప్రాయాలకి సానబెట్టేలాంటి ప్రశ్నలు కూడా వేస్తుంటారు. అంతే కాక, శ్రోతలు కూడా ఈ కార్యక్రమంలో, ఫోను ద్వారా కానీ, ఈమెయిలు ద్వారా కానీ పాల్గొనవచ్చు, అతిథుల్ని ప్రశ్న లడగొచ్చు, లేదా చర్చ గురించి మన అభిప్రాయం చెప్పొచ్చు. అప్పుడప్పుడూ డయాన్ కూడా కళాకారుల్నీ రచయితల్నీ అతిథులుగా ఆహ్వానిస్తుంటారు. ఇవ్వాళ్టి కార్యక్రమంలో ఆఫ్రికన్ నవలా రచయిత్రి చిమమందా అడీచీ వెలిబుచ్చిన అభిప్రాయాలు నాకు చాలా నచ్చాయి.

అమెరికాలో నేషనల్ పబ్లిక్ రేడియోలో ఈ రెండు కార్యక్రమాలూ అంటే నాకు చాలా ఇష్టం.