పౌర్ణమి నించీ అమావాస్య దాకా - 5

గౌతమీ ఎక్స్‌ప్రెస్ ఆదివారం ఉదయం అనుకున్న సమయానికే రాజమహేంద్రి స్టేషను చేరింది. సామాన్లు దింపుకుని ప్లాట్ఫాం మీద నిలబడి ఉండగా అదే రైల్లోంచి దిగిన బంధువులు చివుకుల వెంకట్‌నీ, వారి అమ్మగారినీ పలకరించాను. ఇంతలోనే, ఎక్కడో పది పెట్టెల అవతలినించీ అమరేంద్రగారు వచ్చి ఆత్మీయంగా వీడ్కోలు చెప్పి, బండి కదులుతుండడంతో వెళ్ళిపోయారు. అక్క ఫోన్ చేసింది, కారులో స్టేషన్ బయటనే ఉన్నదని, వెంకటేష్ లోపలికి వచ్చాడనీను. ఇంతలో వెంకటేష్ రానే వచ్చాడు. ఎలాగూ చక్రాల సామానులే గనక, వాటిని దొర్లించుకుంటూ, ప్లాట్ఫాం పొడుగంతా నడిచి, లెవెల్ క్రాసింగ్ దగ్గర బయటపడ్డాం. ఓ పది నిమిషాల్లో ఇల్లు చేరుకున్నాం.

మా అక్క, శంకగిరి సరస్వతి, ONGCలో ఛీఫ్ ఇంజనీరు. బావగారు, JSR మూర్తిగారు కూడా ONGCలో ఛీఫ్ ఇంజనీరుగా పని చేసి రిటైరయ్యారు. బావగారి పెదనాన్నగారు, బ్రహ్మశ్రీ జోస్యుల సూర్యనారాయణగారు, తొంభై అయిదేండ్ల నవయువకులు. కొంతసేపు వారితో పిచ్చా పాటీ, సంగీత సంభాషణ. ఆయన కొన్ని దశాబ్దాల పాటు శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి పేరిట రాజమహేంద్రిలో సంగీత సేవ చేశారు. మా అక్క, బావగార్లు కూడా రాజమహేంద్రిలో సంగీత సభల నిర్వహణలో ముఖ్య భూమిక పోషిస్తూ వచ్చారు. సంగీత సభలు ఎలాగూ పెడుతున్నాము గదా, కథా రచయిత అయిన తమ్ముడొస్తున్నాడు, అందుకని ఒక సాహిత్య సభ పెట్టుకుంటే బాగుంటుందని అక్క సంకల్పించింది.

ONGC విశ్రాంత జెనరల్ మేనేజరు, సాహిత్యాభిమాని, విజయకుమార్ గారి ప్రోద్బలంతో, వారి సంస్థ సాహిత్య గౌతమి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం రివర్ బే హోటలు సమావేశ మందిరంలో సభ జరిగింది. ప్రముఖ కవి, తెలుగు విశ్వవిద్యాలయం బొమ్మూరు కేంపస్ డీన్, ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారు సభా సంచాలకులుగా, రాజమహేంద్రిలో తెలుగు సాహిత్యానికి పేరెన్నిక గన్న దిగ్గజాలవంటి పండితులు వేదికనలంకరించారు. స్వాగత వచనాలు, ప్రార్ధనాగీతం ముగిసినాక సభ మొదలైంది. ప్రముఖ కథా రచయిత, పర్యావరణ రక్షణ కార్యకర్త, డా. తల్లావఝల పతంజలి శాస్త్రి గారు సాహిత్యంలో స్థానీయకత గురించి మాట్లాడారు. సాహిత్యమంటే లిఖితమే కాదనీ, చెంచులు, సవరలు వంటి ఆటవిక సమాజాల మౌఖిక సాహిత్యంలో వారి పరిసరాలు, పర్యావరణం, వాటికి అనుగుణమైన జీవన పద్ధతులను గురించి ఎన్నో వివరాలు పొందుపరచబడి ఉన్నాయని, ప్రపంచ వ్యాప్తంగా ఉదాహరణలతో చెప్పారు. తరువాత సంస్కృతాంధ్ర పండితులు చింతలపాటి శర్మగారు మన ప్రాచీన సాహిత్యంలో సంస్కారాన్ని తెలియజేసే అంశాలను గురించి ప్రసంగించారు. తైత్తిరీయ ఉపనిషత్తుతో మొదలు పెట్టి వాల్మీకి రామాయణం, మహాభారతం మీదుగా కాళిదాసు శాకుంతలంతో సోదాహరణంగా, రసవత్తరంగా ప్రసంగించారు.

మహీధర రామశాస్త్రిగారు (మరా శాస్త్రి) రూర్కేలాలో ఉద్యోగరీత్యా ముప్ఫయ్యేళ్ళ పైగా నివాసం ఉన్న సందర్భంలో ఒరియా భాష క్షుణ్ణంగా నేర్చుకుని, తెలుగు నుండి ఒరియాకూ, ఒరియానుండి తెలుగుకీ కథలనూ కవితలనూ అసంఖ్యాకంగా అనువదించారు. ముఖ్యంగా కవితాత్మ చెడకుండా, మూలంలోని క్లుప్తతను, భావసాంద్రతను అనువాదంలో సాధించడం గురించి తన అనుభవాలను సోదాహరణంగా వివరించారు. కాదర్ ఖాన్ గారు వృత్తి రీత్యా పన్నుల అధికారి అయినా ప్రవృత్తిరీత్యా సాహిత్య ప్రియులు, అంతకన్న ఎక్కువగా హాస్య ప్రియులు, సాంఘిక సమస్యలకి హాస్య పరిష్కారం అనే అంశం మీద ప్రసంగించారు. మొదట్లోనే ఆయన చెప్పిన ఒక మాట నాకు చాలా నచ్చింది. సమస్యకి హాస్యం పరిష్కారం కాదు. కాకపోగా, అసందర్భంగా హాస్యాన్ని వాడితే, అది వికటించే అవకాశం కూడా ఉన్నది. ఐతే పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్న తరుణంలో సమయోచితంగా హాస్యాన్ని వాడి వేడెక్కిన మనసుల్ని కొంచెం చల్లబరచ వచ్చనీ, చల్లటి మనసుతో ఆలోచించినప్పుడే సమస్యలకి పరిష్కారాలు దొరుకుతాయని చెప్పారు. చరిత్ర నించీ, తన జీవితంనించీ హాస్యాన్ని సందర్భోచితంగా వాడగలగటాన్ని ఉదహరించారు.

పుట్ల హేమలత గారు, తన పి హెచ్ డి పరిశోధన అంశమైన అంతర్జాలంలో తెలుగు సాహిత్యం అనే అంశం మీద మాట్లాడారు. తెలుగు బ్లాగుల చరిత్రని క్లుప్తంగా సమీక్షించి, అటుపై వ్విధ జాల పత్రికలు, ఇంకా ఇతరత్రా జరుగుతున్న సాహిత్య సృష్టి, అందులోనే ఎదురౌతున్న కొన్ని పెడధోరణులను ప్రస్తావించారు. యెర్రాప్రగడ రామకృష్ణగారు కవి, నటుడు, వ్యాఖ్యాత, పత్రికా రచయిత. గోదావరీ తీరంతో తెలుగు సాహిత్యానికున్న అనుబంధం అనే అంశం గురించి, పెద్దగా మాట్లాడకుండా నన్నయ్యగారి శ్రీవాణీ .. పద్యంతో మొదలు పెట్టి, ఎందరో మహామహుల పద్యాలను రచనలను తన మధురమైన గళంలో ఆలపించి, ఆహా, గోదావరీ తీరమంతా తెలుగు సాహిత్యమే కదా అనే సత్యాన్ని స్ఫురణకు తెచ్చారు.

చివరిగా నేను అమెరికా తెలుగువారు చేస్తున్న భాషా సేవ గురించి రెండు ముక్కలు చెప్పాను. తానా వంటి సాంస్కృతిక సంస్థలు, సిలికానాంధ్రా వంటి సాంస్కృతిక విద్యా సంస్థలు, వంగూరి ఫౌండేషన్ వంటి సాహిత్య సంస్థలు, అజొవిభొ ఫౌండేషన్ వంటి కళా సంస్థలు చేసిన, చేస్తున్న వివిధ కార్యక్రమాలను టూకీగా ప్రస్తావించాను. అమెరికను విశ్వవిద్యాలయాలలో తెలుగు బోధన ఆవశ్యకతని పరిచయం చేసి, ఆ దిశలో గత పదేళ్ళలో జరుగుతున్న ప్రయత్నాలను గురించి చెప్పాను. సంస్థలుగా వ్యక్తులుగా చాలా రకాల పనులు చేసినా, ప్రభుత్వం మాత్రమే చెయ్యగలిగిన పనులు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి బడిస్థాయిలో తెలుగు బోధన. ఒక ఎనిమిదవ తరగతి తెలుగు వాచకం తెరిచి చదివితే, అందులో పిల్లలకు ఆసక్తి కలిగించే పాఠ్యాంశాలు ఏమున్నాయి? అవి ఎలా బోధించబడుతున్నాయి. ఇటువంటి కీలకమైన విషయాలను భాషా ప్రేమికులు పట్టించుకోవాలి అని చెప్పి ముగించాను.

ఆచార్య సుధాకర్ గారు, సభ ఆద్యంతం, తన సమయోచిత సరస సంభాషణతో, ఉల్లాసంగా సభను నడిపించారు. విజయ కుమార్ గారు, మా అక్కా, బావా వక్తలందరినీ శాలువాలతో సత్కరించారు. అటుపైన ఆ సభామందిరంలోనే ఏర్పాటైన విందు భోజనం. కానీ అప్పటికే బాగా ఆలస్యమవడంతో కొందరు అతిథులు వెళ్ళిపోయారు. ఆ కొద్ది సమయంలోనే ఇతర వక్తలతో కొద్దిగా సంభాషించ గలిగాను.

మరుసటి రెండు రోజులు బంధు మిత్రులతో కాలక్షేపం. విశాఖ నించి మా చెల్లెలు కూడా వచ్చింది మమ్మల్ని చూడ్డానికి. యెర్రాప్రగడ రామకృష్ణగారిని కొద్ది సేపు కలిశాను. అంతర్యామి అనే పేరిట పత్రికల్లో రాసిన ఆధ్యాత్మిక వ్యాసాల సంకలనం బహుకరించారు. తల్లావఝల వారు కూడా ఇటీవల ప్రచురించిన కొత్త పుస్తకాలు పంపించారు.

ఒక రోజు మా ఆవిడ కజిన్ సుధాకర్, తనూజ దంపతులతో గడిపాము. తనూజ ఆధ్వర్యంలో మంగళ వారం సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేసుకుని బాలత్రిపుర సుందరీ సహిత విశ్వేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నాము. సుధాకర్ గారి హోటల్ "షెల్టన్ - రాజమహేంద్రి" చూశాము. అన్ని హంగులతో చాలా బాగున్నది హోటల్. ఆ రోజే వారి మిత్రులు ఏర్పాటు చేసిన కార్తీక మాస వనభోజనాలలో మేము కూడా అతిథులుగా వెళ్ళొచ్చాము.

ఇక ఆ సాయంత్రం టేక్సీలో విజయవాడ ప్రయాణమయ్యాం. మంచి బండి అని చెప్పి ఇచ్చాడు. అదేదో పాతకాలపు బండి. విజయవాడ చేరేటప్పటికి మా నడుములు విరిగినాయి. దానికి తోడు రింగు రోడ్డు ట్రాఫిక్‌లోఇరుక్కుని, అటు తిరిగి, ఇటు తిరిగి, చివరికి  రామవరప్పాడు రింగురోడ్డు దగ్గర, "కే" హోటల్లో బతుకుజీవుడాని రాత్రి తొమ్మిదిన్నరకి చేరుకున్నాం. వాళ్ళ పుణ్యమాని బఫే డిన్నరు పెట్టారు.

Comments

Vasu said…
చాలా చక్కగా ఉన్నాయి సంగతులు.. మేము కూడా మీ పక్కన ఉండి ప్రయాణం చేస్తున్న అనుభూతి కలిగింది.

అన్నీ వరస పెట్టి చదివేశాను.

మీరు ఇంత పెద్ద సాహితీ మిత్రుల సర్కిల్ ఎలా ఏర్పర్చుకున్నారో చెప్పరూ.

మేము కూడా పరిచయాలు పెంచుకుంటాం..

విజయవాడ దాకా వచ్చి ఆపారు , ఆతర్వాత ఏమి జరిగిందో నే చెప్తా నాకు ద్రోహం చేసి. కలవకుండా విజయవాడ చుట్టి వెళ్ళిపోయారు. ఒక రకం గా క్షేత్రపాలకుడిని నిర్లక్ష్యం చేసి నట్లు ఫీలయ్యా .. :P :P
తదుపరి భాగం ఎప్పుడు ?
Bavundndee.. very interesting. mundugaa teliste memoo kalusukunevaallam!
Unknown said…
టెంపో ఎక్కడ తగ్గకుంద ఇప్పటివరకు ఓ థ్రిల్లర్ నవల లా సాగింది ఈ బ్లాగు పయనం! ఫ్రయణం చివరి భాగం కొసం ఎదురు చూస్తున్నాం!

మా బె౦గుళూరు కబుర్ల కోస౦ ఇ౦కా ఎదురు చూస్తున్నాను