తెలుగు పాఠం - ఏప్రిల్ 5 - క్రావడి చిందులు

గతంలో తెలుగు పాఠాలు వెలువరించి అప్పుడే చూస్తూ చూస్తూ ఏడాది కావస్తున్నది.
మరీ ప్రతీవారమూ క్రమంతప్పకుండా చెయ్యలేకపోయినా అప్పుడప్పుడూ, ఏదైనా చెప్పాలని బుద్ధికి తోచినప్పుడు మంగళవారం పూట ఈ శీర్షికన మళ్ళీ వెలువరిస్తుంటాను.

భవదీయుడు బ్లాగరి, యువమిత్రుడు కమల్ చక్రవర్తికి "వ్రాయటం" అంటే ప్రాణం. చాలామంది బ్లాగర్లు వ్రాయకుండా రాసేస్తున్నారని ఆయన తన ఆవేదన చాలాచోట్ల వ్యక్తం చేశారు.

తెలుగులో కొన్ని పదాలకి మొదటి అక్షరానికి ఇలా క్రావడి (ర వొత్తు) ఉన్నది. అది ఆ పదం లక్షణం .. అంతే. కానీ మాట్లాడేటప్పుడు ఆ క్రావడిని ఉచ్చరించక పోవడం కూడా అనాదిగానే వస్తున్నది. ఉదా. క్రింద .. కింద; బ్రతుకు .. బతుకు. క్రావడి వాడినంత మాత్రాన అది గ్రాంధిక భాష అని చాలామందికి ఒక భ్రమ ఉన్నది. క్రావడి లేకపోతే అది వ్యావహారికభాష అనే అపోహకూడా ఉన్నది. ఇది గ్రాంధిక వెర్సస్ వ్యావహారిక పోటీ కానే కాదు. అసలు 1900 సంవత్సరం ప్రాంతాల్లో గ్రాంధికభాషకి ప్రత్యామ్నాయంగా సూచించబడిన భాషకి శిష్టవ్యావహారికమని పేరు. అంటే పెద్దలైనవారు, బాగా చదువుకున్నవారు, సాంప్రదాయం బాగా తెలిసినవారు సామాన్యంగా తమ వ్యవహారాల్లో వాడుతుండే భాషని ప్రామాణికం చెయ్యాలి, ముఖ్యంగా విద్యాబోధనలో అనేది అక్కడి చర్చనీయాంశం. అలా శిష్టవ్యావహారికం మన విద్యా వ్యవహారాల్లో ప్రమాణం అయింది. నేను పదోతరగతి దాకా తెలుగుమీడియంలోనే చదివాను. అప్పట్లోకూడా సైన్సు సోషలు పరీక్షల్లో వాక్యాలు పద్ధతిగా రాయవలసి వచ్చేది. వృక్షములకు కొమ్మలు ఉండును, ఇట్లు ప్రయోగము చేసితిని, అక్బరు జనరంజకముగా పరిపాలించెను - ఇలా రాసేవాళ్ళం. అక్బరు యుద్ధం చేశాడు, నేను ప్రయోగం చేశాను అని రాస్తే మార్కులు తగ్గించే వాళ్ళు. అది గ్రాంధికం కాదు, వ్యావహారికమే.

ఏదో ఒక సందర్భంలో, రాసిన తెలుగు మాట్లాడే తెలుగుని ప్రతిబింబించడం మొదలు పెట్టింది. ముఖ్యంగా సృజనాత్మక రచయితలు, కవులు ఇటువంటి వాడుకలు మొదలు పెట్టి ప్రచారం చేశారు. వివిధ విషయాలపై పత్రికలలో ప్రచురితమవుతున్న వ్యాసాల్లో కూడా ఈ ధోరణి ప్రబలింది. భాష విషయంలో బాగా పట్టుదల ఉన్న సంపాదకులు కొందరు, నార్ల, కొడవటిగంటి ప్రభృతులు కూడా ఈ పరిణామానికి దోహదం చేశారని నా నమ్మకం. దీన్ని వాడుక తెలుగు అనడం మొదలుపెట్టారు. కొంతమంది మనం మామూలుగా వాడే
స్పెల్లింగులని కూడా తమకి ఇష్టమైనట్టుగా మార్చుకుని వాడడం కొనసాగిస్తున్నారు. ఉదా: వూరు, యేరు. అటుపైన ఆయా వాడుకలు ఆయా రచయితల వ్యక్తిగత శైలిగా నిలిచిపోయాయి. సృజనాత్మక రచనలో అంటే సరే ఆ రచయిత ఇష్టం - మరి వ్యాసాల్లో, పత్రికల్లో, బ్లాగుల్లో - ఏ పబ్లిక్ డొమెయిన్‌లో అయినా వాడే భాషకి ఒక ప్రమాణం ఉండనక్కర్లేదా? ఎవరిష్టం వచ్చినట్టు వారు రాసుకుంటూ పోతే భాష ఏమైపోతుంది. ఇవ్వాళ్ళ రేపు, మన వెండితెర హీరోలని అనుసరిస్తూ యువత ఎవరూ ళ ఉచ్చరించడం లేదు - వాల్లు వచ్చారు, వెల్లరా వెల్లు, కల్లు తెరిచి చూడు - ఇలా మాట్లాడుతున్నారు. మాట్లాడినట్టే రాయాలి అంటే, రేపట్నించీ తెలుగులో ళ అనే అక్షరం అదృశ్య మైపోతుందేమో? ఇదొక ఆసక్తికరమైన చర్చ.

వ్రాయడం రాయడం గురించి ఇంకో తమాషా ఉంది. తెలుగులో రాయడం అంటే రుద్దడం అనే అర్ధం కూడా ఉంది. నూనె రాయడం, వొంటి మీద రాయడం .. ఇలా. దీన్ని ఎట్టి పరిస్థితిలోనూ వ్రాయడం అనరు. ఐతే, క్రావడితో మొదలయ్యే అన్ని పదాలకీ ఇటువంటి సమస్య లేదు. క్రింద అన్నా, కింద అన్నా అర్ధంలో తేడా ఏంలేదు.

ఇంకో తమాషా కూడా ఉంది. నేను బడి విడిచిపెట్టినాక రాస్తున్న తెలుగులో ఎప్పుడూ రాస్తూనే వచ్చాను - వ్రాయలేదు. దీన్ని గురించి కొంత ఆలోచించిన తరవాత, వ్రాయడమే కరక్టు అని తెలిశాక కూడా చాలా కాలంగా అయిన అలవాటు ప్రభావమో ఏమో, రాయడం సాగినట్టుగా వ్రాయడానికి చేతులు రావు.

ముచ్చటగా మూడో తమాషా - ఈ క్రావడి చిందులు తెలుగు పదాలకి మాత్రమే. సంస్కృత తత్సమాల (అంటే సంస్కృతంలో పుట్టి తెలుగులో వాడుతున్న పదాలు)కి ఈ సందిగ్ధం లేదు, అక్కడ క్రావడి ఉంటే చచ్చినట్టు వాడాల్సిందే.

ఇప్పుడు పాఠకులకి హోంవర్కు: మీ దృష్టికి వచ్చిన మరికొన్ని తెలుగు క్రావడి పదాల్ని రాయండి. క్రావడి ఉండాలా, అక్కర్లేదా? ఉన్న క్రావడి తీసేస్తే ఆ పదానికి వేరే అర్ధం వస్తున్నదా? ఎలా రాసినా పరవాలేదా? మీ అభిప్రాయం కూడా చెప్పండి.

Comments

కొత్త పాళీ గారు,

నా ఉద్దేశ్యం ఏంటంటే(వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే).. వ్రాయటం, రాయటం గా రూపాంతరం చెందితే నాకెందుకో పరవాలేదు.. అనిపిస్తుంది.. భాష కొన్ని శతాబ్దాలు గా మారుతూనే వస్తోంది.. మున్ముందు కూడా మారుతూనే ఉంటుంది. పట్టి నియంత్రించి ఉంచితే మారకుండా ఉంటుందా? అని నా అనుమానము. నావరకూ 'రాయ వద్దు.. వ్రాయి.. ' అని ఎవరైనా అంటే తప్పక ఆ అభిప్రాయాన్ని గౌరవించి స్వీకరిస్తాను.

చిన్న Deviation.. SMS లలో, చాట్ విండో ల్లో మారిన ఆంగ్ల స్పెల్లింగులు ఇప్పుడు.. ఆఫీసు లో ఈ-మెయిల్స్ కి కూడా నెమ్మది గా వచ్చేస్తున్నాయి.

ఫేస్ బుక్ /లేక ఇతర చాట్ విండోలలో లేక సాటి తెలుగు వారికి రాసే ఈ-మెయిల్స్ లో తెలుగు లిపి వాడితేనే నన్ను చాదస్తపు ముసలమ్మ లా బంధు మిత్రులు ఈ మధ్య చూస్తున్నారు. :) అయినా పట్టు వదలకుండా ద్విభాషా సూత్రాన్ని పాటిస్తూ ఏది రాసినా తెలుగు/ఆంగ్ల భాషల్లో రాస్తున్నాననుకోండి.

రాసిన వాక్యాలు కూల్ గా ఉంఛి చదవాలని వారికి అనిపించేలా ప్రయత్నం చేస్తూ .. ఎలాగైనా కనీసం నా పరిచయస్తులకైనా తెలుగు లో రాయటం అలవాటు చేయాలని చూస్తున్నాను..
Anonymous said…
బాగుంది మాస్టారూ, మీ బ్లాగులు ఎందుకని సంకలునుల్లో లేవు?
కొత్త పాళీ గారు,

చదివే వాళ్ళకి అర్థాన్ని అందించగలిగితే వాడుక భాషే ప్రామాణికంగా మారినా పరవాలేదనిపిస్తుందండీ.

శిష్టవ్యావహారికం మాత్రమే ప్రామాణికంగా ఉండడం బహుశా కముందు ఉండక పోవచ్చు. ఎందుకంటే, సమాజాలు అభివృద్ధి చెందే కొద్దీ శిష్టులు అని ప్రత్యేకంగా ఎక్కువమంది ఉండకపోవచ్చు.

ఖచ్చితమైన భావాన్ని ప్రకటించగలిగే పదాలని వదులుకోకుండా, అర్థం మారకుండా వ్యావహారికం గానీ, వాడుక భాషగానీ పైచేయి సాధిస్తే నష్టమేమీ ఉండదనిపిస్తుంది.

శిష్ట వ్యావహారికం వాడుకలో తగ్గిపోతుందంటేనే, బహుశా సమాజం యొక్క ఆలోచనల వేగం పెరిగిందనుకోవచ్చు. మన భాష కూడా మన ఆలోచనల వేగానికీ, సంక్లిష్టతకీ సరిపోయేలా రూపాంతరం చెందాల్సిందే కదా !

మనకంటూ ఉన్న కొన్ని విశిష్టమైన శబ్దాలనూ, ధ్వనులనూ విసర్జించడం మాత్రం మంచి పరిణామం కాదనే అనిపిస్తుంది. (ఉదాహరణకి, ళ కి బదులుగా ల వాడటం)

ఇక తత్సమాలవిషయానికొస్తే, అవి పరభాషా సంగ్రహాలు కాబట్టి, మూల భాష కాలానుగుణంగా మార్పు చెందట్లేదు కాబట్టి అవి అలానే ఉండొచ్చు.
రవి said…
"ఏదో ఒక సందర్భంలో, రాసిన తెలుగు మాట్లాడే తెలుగుని ప్రతిబింబించడం మొదలు పెట్టింది..."

తెలుగు మీడియంలో నేను చదువుతున్నప్పుడు కూడా శిష్టవ్యవహారికానికే మార్కులు. ఆ రోజుల్లో పత్రికలలో నవలలూ, కథలూ రాజ్యమేలేవి. ఆ పత్రికల భాషే నెమ్మదిగా చదువుల్లోకి జొరబడిందని నా అనుకోలు.

భాష నిరంతరపరివర్తనశీలి కనుక "రాయడం" లో తప్పేమీ లేదనే నా ఉద్దేశ్యం. అయితే ఏదైనా కావ్యమో, పద్యసాహిత్యంలో రచనో వెలయించేప్పుడు రచయిత ఒళ్ళుదగ్గరపెట్టుకుని "వ్రాయడమే" మంచిది. ఎందుకంటే కావ్యోద్దేశ్యం వేఱు, లౌకిక రచనాప్రక్రియల అంతరార్థం వేఱు.
Home work:
మ్రొక్కు - మొక్కు
త్రొక్కు - తొక్కు

నేను విన్నదేంటంటే మన ఆంధ్ర రాష్ట్రం వారే రాబోయే తెలుగు పాఠ్య పుస్తకమందు కొన్ని అక్షరాలను తొలగిస్తున్నారంట మరియు రాయు, మొక్కు.. ఇలా వ్రాయడం కూడ సబబే నట.. ఇది ఎంతవరకు నిజమో, సబబో మరి :(
Anonymous said…
ఈనాడు దినపత్రికలో కళ్యాణం అని కాక కల్యాణం అని పడుతుంది.కల్యాణం అన్న పదమే వ్యవహారికమని వారి లెక్క.నాకు తెలిసి ఎవరో కొందరు తెగులు వాళ్ళు తప్ప తెలుగు వాళ్లంతా కళ్యాణం అనే వ్యవహరిస్తారు.
కొత్తపాళీ గారూ http://pakkintabbayi.blogspot.com/ ఇది నా కొత్త బ్లాగు కూడలి లో ఇంకా లిస్ట్ చేయలేదు.ఈ లోగా మీరోసారి చూడాలని నా కోరిక(అసందర్భ ప్రసంగానికి క్షమాపణలతో)
--పవన్ సంతోష్ సూరంపూడి
కృష్ణప్రియ, మంచి విషయాలు చెప్పారు.
అజ్ఞాత, మీ పేరు (తెర పేరైనా) చెప్పి ఉంటే బాగుంటుంది. సంకలనుల్లో కలపకపోవడం ఉద్దేశపూర్వకంగానే.
WP, కొన్ని ఆసక్తికరమైన అంశాలు సూచించారు. వీటిని గురించి విడిగా మళ్ళీ రాస్తాను.
రవి, నిజమే. పూర్వకాలంలో ఒక వ్యక్తి అనేక ప్రక్రియల్లో రచనలు చేసేవారు. ఈ మధ్య కనీసం నాకు తెలిసినంతలో అటువంటి వ్యక్తులు చాలా తక్కువ. ఎక్కడో కల్పన, అఫ్సర్ వంటివారు తప్ప. వారైనా కవిత్వంలో వచనకవిత్వాన్నే అభిమానిస్తున్నారు తప్ప పద్యకవిత్వం జోలికి పోలేదు. అందుకని పద్యకవులు వేరే, వచన కవులు, వచన రచయితలు వేరే.
గిరీష్, మీ ఉదాహరణలు బాగున్నై.
మ్రొక్కు - మొక్కు; క్రావడి తీసేసినా అర్ధం మారదు.
త్రొక్కు - తొక్కు: క్రావడి తీసివేస్తే తోలు, చర్మం, పండ్లకీ కూరగాయలకీ పైన ఉండే పొర అనే అర్ధం వస్తుంది.
సంతోష్, మీ నూతనగృహప్రవేశ సందర్భంగా శుభాకాంక్షలు.
మళ్ళీ తెలుగు పాఠాలు మొదలు పెట్టినందుకు ధన్యవాదాలు. ఈ 'రాయడం' 'వ్రాయడా'లు కొంతలో కొంత మేలు. కాని ఈ మధ్య(అంటే చాలా రోజుల నుంచే) ఈనాడు పత్రికలో అక్షరదోషాలే కాకుండా వ్యాకరణ దోషాలకు అంతే లేకుండా పోతోంది. ఇక విషేషణాల సంగతైతే మరీను "కత్తి" "కేక" లాంటి పదాలు అలవోకగా వాడేస్తున్నారు.
వారి భాష ప్రభావం 'భవిష్యత్తు భాషపై' ఉంటుందన్న కనీస స్పృహ లేకపోవడం శోచనీయం.
గత కొంతకాలంగా వెన్నాడుతున్న సందేహం నివృత్తి చేసారు. వ్రాయడం రాయడం రెండూ వ్యవహారికమేనని.. కానీ ఇప్పుదు క్రావడిని వాడడం కొంత కష్టంగానె వుంది మరి... ఇలా మీరు తెలుగు పాఠాలు చెప్తూ వుండాలని కోరిక...
జయ said…
క్రొత్త- కొత్త
ప్రాత - పాత
మ్రోయు - మోయు
మ్రోగు - మోగు
మ్రాను - మాను (చెట్టు మొదలు, మొద్దు)
మ్రాకు - మాకు
వ్రేలు - వేలు
త్రాగు - తాగు
కొత్తపాళీ గారు, ఇవీ నేను కష్టపడి రెండు రోజులనుంచి ప్రోగేసాను (పోగేసాను):) ఔనంటారా, కాదంటారా...ఏమంటారు? ప్లీజ్...ప్లీజ్, కనీసం ఒకటి రెండైనా కరెక్ట్ అనండి.
జయగారు, చంపేశారు! ఐతే నేనిప్పణ్ణించీ క్రొత్తపాళీ అని రాసుకోవాలి నా తెరపేరుని! :)
మంచి లిస్టు తయారు చేశారు. ప్రాత - ఇది కచ్చితంగా చెప్పలేను గాని మీర్రాసిన మిగతావన్నీ క్రావడి చిందులే. క్రావడి తీసేస్తే అర్ధాలు మారేవి ఎన్నో?
క్రావడి అనే పదం ఇప్పుడే నేర్చుకున్నాను. బ్లాగుల్లోనూ, ఈ నాటి పత్రిక ల్లోనూ ఎక్కువమంది రాస్తున్నారు. వ్రాసేవారు తక్కువ. మాట్లాడేటప్పుడు వత్తులు వదిలేసినా వ్రాసే టప్పుడు విధిగా ఉపయోగిస్తే బాగుంటుందనుకుంటాను. ఱ ఉపయోగం తగ్గిపోయింది. ఇంకొంత కాలం పోతే ళ కూడా కన్ను మూయవచ్చు. స శ ల తేడా తెలియటం లేదు. అంతా కాకపోయినా కొంత బ్లాగు మాయ ఉందనుకుంటాను మన వ్రాతలలో. వాడుక భాష ఆమోదయోగ్యమైనా వ్రాసేటప్పుడు పద్ధతులు పాటిస్తే మన తెలుగు చదవడానికి బాగుంటుందేమో నని ఆశ.
బాలు said…
కొత్తపాళీగారూ,
లేటుగా కామెంటుతున్నందుకు ఈసారికి క్షమించెయ్యండి.
పైన పక్కింటబ్బాయి(ఇల్లుమారాడు)చెప్పినదానికి నా సమాధానం... ’కల్యాణం‘ అనేది సరైన పదమే. ఓసారి శబ్దరత్నాకరం తిరగేస్తే తెలుస్తుంది. కావాలంటే బాపుగారు తీసిన ’సీతాకల్యాణం‘ పోస్టరు చూడండి. రవణగారికి ఆ మాత్రం తెలుగు రాదంటారా?
ఈ సందర్భంగా... సదరు పక్కింటబ్బయగారు వాడిన ‘తెగులు’వాళ్లు పదాన్ని నేను తీవ్రంగా ఖండిస్తన్నానధ్దెష్కా!
@బాలు, బావుంది. కంఠాభరణంలో సోమావధాన్ల లాగా చాలా కాలం నేనుకూడా ళ, ఖ, భ అని పలికితేనే అది సంస్కృతమని భ్రమలో ఉండేవాణ్ణి. తరవాతెప్పుడో ఎవరో చెప్పగా, అసలు సంస్కృతంలో ళ లేదు - ఆయా పదాలు తెలుగులోకి వచ్చినప్పుడు కొన్నిచోట్ల ల ని ళ చేశారు అనే అభిప్రాయానికొచ్చాను. మరి ఈ కళ్యాణమా - కల్యాణమా - నాకూ తెలీదు మరి. ఇదిలా ఉండగా, తెలుగుపదం గుంపులో ఇటీవలే ళగురించి జరిగిన ఆసక్తికరమైన చర్చ చూడండి. తాడేపల్లిగారు కొన్ని ఆసక్తి కరమైన విషయాలు చెప్పారు.
బాలు said…
కొత్తపాళీగారూ
మంచి లంకె ఇచ్చారు. చక్కటి చర్చ.
తా.ల.బా.సు.గారు చెప్పింది అక్షరాలా నిజం. దాశరథి రంగాచార్య నోటి వెంట విన్నానా మంత్రం. ఋగ్వేదంలో తొలి ఋక్కు అదే. వేదం ‘అగ్నిర్మీళే...’అనే ఋక్కుతోనే మొదలవుతుంది. సంస్కృతంలో ళ లేదనడం అన్యాయం. ఉత్తర భారతీయుల్లో చాలామందికి పలకడం రాక వాడుకలోంచి తీసేశారంతే.
ఎందుకు రాదు, రాలేదు... అంటే, తెలుగును ఇంచక్కా పలికే మంచువారమ్మాయి లాంటి వాళ్లని చూడండి. మీకే అర్థమయిపోతుంది. అపరిచితుడు డైలాగులాగా, అక్కడొకరు అక్కడొకరు ళని ‘ల’గా పలికితే పర్వాలేదుగానీ, ఐదు కోట్ల మంది ఐదైదుసార్లు అలా పలకడం మొదలెడితే తెలుగులోనూ ళ కనుమరుగైపోతే పెద్దగా ఆశ్చర్యపడక్కర్లేదు.
మాలతి said…
మంచి చర్చ తెచ్చేరు. క్రావడిలాగే ఱ కూడా వాడకం తగ్గిపోయింది. కానీ మరో సందేహం. ఈమధ్య అమెరికాలో పిల్లలకి తెలుగు పాఠాలు పుస్తకంలో ఞ కి గుణింతాలు ఇచ్చారు. ఞి ఞై లాటివి - ఇది పూర్వం ఎప్పుడయినా వాడుకలో ఉందా అని నాసందేహం.
పైవ్యాఖ్యలలో కూడా మంచి విషయాలే వచ్చేయి. అభినందనలు.
మాలతిగారు, నెనర్లు. బండిర, అరసున్నల వాడకం తగ్గిపోవడం ఇంకా ముందుగానూ, ఇంకా తీవ్రంగానూ జరిగింది.
ఞ,ఙ లకి కూడా గుణింతం ఉంటుంది, ఎందుకుండదూ. కాకపోతే వాటిని మనం ఆ రూపంలో రాయము, అంతే. తెలుగులో ఈ రెండు హల్లులకీ స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నట్టు కనబడదు, ణ, న, మ లకి ఉన్నట్టు. అంచేత ఇవి సంస్కృత తత్సమాల వాడుకలో, ముఖ్యంగా అనునాసిక సంధుల్లో కనిపిస్తాయి.
తెలుగు బోధన సంగతి చెప్పకండి - గానుగెద్దు పద్ధతి అదంతా.
మాలతి said…
తెలుగులో ఈ రెండు హల్లులకీ స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నట్టు కనబడదు, - నేనంటున్నది కూడా అదేనండీ. ఇక్కడ పెరుగుతున్న పిల్లలకి అలాటివి ఎఁదుకని. ఏమోలెండి నేనే వెనకబడి ఉన్నానేమో అనిపిస్తోంది.
అర(ఱ)సున్న పరీస్థితి కూడా ఇదే అన్నగారూ.
S said…
అమ్మో, తెలుగు టీవీల్లో వచ్చే భాష చూసి పిల్లలు నేర్చుకుంటే, ఒక ళ నే కాదు... భాషే నాశనం అయిపోతుందేమో!! :(
'కృష్ణుడి'ని 'క్రిష్నుడు'గా మార్చనంత కాలం 'వ్రాయడం','రాయడం'గా మారినా అంత బాధపడనవసరం లేదేమో!
కృష్ణుడు మద్ది మ్రానులను క్రూల్చాడు.
కృష్ణుడు వెన్న దొంగలించుట మానుకున్నాడు.
రెండో వాక్యంలో అర్ధం సంపూర్ణంగానే ఉందనిపిస్తోంది. భాష నిరంతర పరివర్తనశీలి. మనిషి కూడా!
chavera said…
ఎన్నటికి మారనిది మార్పు ఒక్కటే .
ఏనుగు వీరా స్వామి కాశి యాత్ర' (1838 -40 ) లో 'వార్త' ను కన్నడము లో లాగా ವಾರ್ತ అని వాడారు . అలాగే సగం 'ర' వచ్చే అన్ని పదాలలోనూ. .

ఇప్పుడు ఎవ్వరూ అలా వాడడము లేదు.
భాష ముఖ్య ఉద్దేశ్యం పరస్పర సమాచార మార్పడి.
తెలుగు చాలా ఉన్నతమైన భాష , విస్తృతమైన భాష . ప్రతి జిల్లా జిల్లాకు మారుతుంది.
ఎదుటివాడి తెలుగు భాష కంటే మాదే గొప్ప అనుకొనే వారి వల్లే , మనకు ఐక్యత లేకుండా పోయింది.
మధురాంతకం రాజారాం దీని మీద చక్కటి కధ ఒక్కటి వ్రాసారు/రాసారు.
chavera గారు, మీ అభిప్రాయానికి ధన్యవాదాలు. భాషస్వరూపం గురించిన రెండు అంశాలు బాగున్నాయి, కాని తెలుగువారిలో భాషపట్ల పరస్పర అసమానతల గురించిన మీ వ్యాఖ్య ఆసక్తికరంగా ఉన్నది.
ఎలాగూ బ్లాగు మొదలు పెట్టారు కాబట్టి ఇలాంటి విషయాలు మీరు రాస్తే బాగుంటుంది.
chavera said…
తెలుగు భాష దినోత్సవ 29 August సందర్భంగా
జనరల్ అల్లం రామకృష్ణ రెడ్డి గారు కోల్కత్త లో 1998 ఉగాది నాడు 20 మంది తెలుగు వారిని కుటుంబ సమేతంగా ఆహ్వానించారు.
విందు బోజనానికి ముందు అందరిని తెలుగులో పరిచయ వాక్యం మాట్లాడమన్నారు.
అందరమూ మాట్లాడాము, వారి వారికీ అలవాటు అయిన తెలుగులో.
ప్రతి ఒక్కరికి మిగిలిన వారి భాష వింతగా అనిపించింది.
వాడుక తెలుగులో అన్ని రకాలు ఉన్నాయి మరి.
ఇంగ్లీషులాగా తెలుగులో కూడా అన్ని భాషలనుండి పదాలు చేరాయి.
ఇంగ్లీషులాగా తెలుగులో కూడా అన్ని రకాల వాడుక భాష లుండడం మన భాష కు గర్వ కారణం.
తెలుగు ప్రజల భాష. విస్తృతంగా మాట్లాడపడుతున్న భాష. ఎవ్వరీ ప్రాపు లేకుండా సజీవంగా మనగలిగిన భాష.
నా మాతృ భాష సజీవం , అమరం.
లాంగ్ లివ్ మై మదర్ టంగ్.