పుస్తకాలు పుస్తకాలు

మళ్ళీ కబుర్లు చెప్పడం మొదలు పెడదాము అనుకున్నాను గానీ తీరా రాయడానికి కూర్చుంటే ఇప్పటికిది అంతా పుస్తకాల గురించే అయింది.

నా కథల సంపుటి రంగుటద్దాల కిటికీ మళ్ళీ కొంచెం న్యూస్‌లోకొచ్చింది. మా వూళ్ళో ఉండే మీరు అక్కడెక్కడో పుస్తకం విడుదల చెయ్యడమేవిటి అని చెప్పి, మిత్రుడు కాలాస్త్రి, అతని మిత్రబృందం డిట్రాయిట్ పరిసర ప్రాంతమైన నోవై నగరంలో మొన్న శనివారం పుస్తకావిష్కరణ సభ ఏర్పాటు చేశారు. డిట్రాయిట్ తెలుగు సమితి కార్యవర్గ సభ్యులు కూడా ఉత్సాహంగా పాల్గొని సభని జయప్రదం చేశారు. నాపైని వాత్సల్యంతో శ్రీ యెడవల్లి సోమయాజులు గారు పుస్తకాన్ని ఆవిష్కరించారు. తానా పూర్వాధ్యక్షులు డా. బండ్ల హనుమయ్య గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. పుస్తకాన్ని సమీక్షిస్తూ మిత్రులు ప్రసాద్ సామంతపూడి, డా. వేములపల్లి రాఘవేంద్ర చౌదరి గార్లు నా కథల గురించి చెప్పిన నాలుగు మంచి మాటలు నాకెంతో సంతోషాన్ని కలిగించాయి. డీటీయే అధ్యక్షులు చలపతి కోడూరిగారు సభకి అధ్యక్షత వహించి జయప్రదంగా జరిపించారు. కాలాస్త్రి ఇంకేవన్నా విశేషాలు చెబుతారేమో చూద్దాం. సభ వివరాలు ఆంధ్రజ్యోతి ఎన్నారై సెక్షన్లో.

పుస్తకం సైట్లో వెలిగించిన వొత్తి అనేక బ్లాగుల్లో టపాకాయలు పేలుస్తోంది. మొత్తానికి హేలీగారు హేలీ తోకచుక్కంత సంచలనం సృష్టిస్తున్నారు ఈ బ్లాగ్లోకంలోని తెలుగు సాహిత్యాభిమానుల్లో. యువతరాన్ని ఆకట్టుకునే సాహిత్యమేదీ తెలుగులో రావట్లేదు - ఇంగ్లీషులో చూడండి, హేరీ పాటర్ ఎంత పఠనాసక్తిని పెంచిందో - అని అతనన్న మాటలకి కల్పన గారు, మాలతి గారు ఆసక్తి కరమైన విశ్లేషణ చేస్తూ విస్తృతమైన చర్చకి తెర తీశారు. ఈ చర్చల్లో బయటికొచ్చిన ముఖ్యాంశాల గురించి నా అభిప్రాయాలివి.
1. అన్ని చర్చనీయాంశాల్లాగానే ఇందులో రెండు భాగాలు - తెలుగు సాహిత్యం ఏ స్థితిలో ఉందీ అని చెయ్యాల్సిన పరిశోధన ఒక అంగం. క్రియాశీలంగా కొత్త సాహిత్య సృష్టి చేసుకోవలసిన కార్యాచరణ దీక్ష ఇంకో అంగం.
2. కథానిక, కవిత - ఈ రెండు ప్రక్రియలు తప్పించి తెలుగులో ఇటీవలి కాలంలో ఇతర ప్రక్రియల్లో చెప్పుకోదగిన రచనలేవీ రాలేదు. ఇది నిర్వివాదాంశం.
3. మాయమంత్రాలతో కూడిన జానపద సాహిత్యం మనకి తెలుగులో చాలానే ఉంది, కానీ నేటి పాఠకులకి ఆ కథల్లోని భాషకానీ, కథన పద్ధతులు కానీ ఆకర్షణీయంగా లేవు. అంతెందుకు, ఒక కాలంలో విపరీతమైన ఆసక్తితో వీటిని చదివిన నేనే సుమారు పదేళ్ళ క్రితం మళ్ళీ చదవడానికి ప్రయత్నించినప్పుడు, ఏంటీ చెత్త అని జుగుప్స కలిగింది. అంత దరిద్రంగా ఉన్నయ్యి.
4. వివిధ ప్రక్రియల్లో, ముఖ్యంగా యువతరాన్ని ఆకట్టుకునేట్టు సాహిత్యం తయారు కావాలి. దాని వ్యాప్తికి తగిన వాతావరణం కూడా ఒకటి ఏర్పడాలి. నాకు తెలిసి ప్రముఖ కవి శివారెడ్డిగారు రాష్ట్రమంతటా పర్యటిస్తూ, పాఠశాలలకి కళాశాలలకి వెళ్ళి కవితా గోష్ఠులు నిర్వహిస్తుంటారు. ఇటువంటి ప్రయత్నం ఎంతవరకూ జరుగుతోంది? ఆసక్తి కరమైన సాహిత్యం దొరకడం ఒకటే కాదు, ఆ సాహిత్యాన్ని చదవడం దాన్ని గురించి మాట్లాడ్డం ఫేషనబుల్ అనే వాతావరణం ఒకదాన్ని . వ్యాపింపచెయ్యాలి
5. నామిని తెలుగు సాహిత్యానికి ఏం చేసినా చెయ్యకపోయినా పుస్తక ప్రచురణ విక్రయాల్లో ఒక పని చేసి చూపించాడు. తానే ముద్రించి, పుస్తకాల సంచులు పల్లె పల్లెల్లో బడులకి మోసుకెళ్ళి అమ్మే ప్రయత్నం చేశాడు. ఇన్ని కబుర్లు చెప్పేవాళ్ళం, సాహిత్యాన్ని గురించి ఇంత బాధపడేవాళ్ళం, ఎంత మందిమి అతను చేసిన దానిలో పదోవంతు చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాం?

దీన్ని గురించి చెప్పాల్సింది ఇంకా చాలా ఉంది. ఇంకో పూట కొనసాగిస్తా. ఇంకొక్క మాట చెప్పేసి ఈ టపాని అచ్చేసెయ్యాలి. ఆఫీసు పని పిలుస్తోంది.

ఉరుమురిమి మంగలం మీద పడ్డట్టు హేలీగారు బుచ్చిబాబు చివరకు మిగిలేది మీద ధూమకేతువులాగా విరుచుకుపడ్డారు పుస్తకం సైట్లోనే. ఎన్నో దశాబ్దాలుగా ఆధునిక తెలుగు సాహిత్యంలో క్లాసిక్ గా వెలుగుతున్న ఈ నవల పట్ల హేలీ రాసింది అమర్యాదగానూ, అభ్యంతరకరంగానూ ఉన్నదని పలువురు పాఠకులు అభ్యంతర పెట్తడం ఆసక్తికరంగా ఉన్నది. హేలీ ఆ పుస్తకాన్ని పూర్తిగా కానీ సరైన దృష్టితోకానీ అర్ధం చేసుకుని ఉండకపోవచ్చు (ఆ మాటకొస్తే ఏది సరైన దృష్టి?) తన అభిప్రాయాన్ని కొంచెం కోంటెతనంగా కొంచెం వ్యంగ్యంగా చెప్పారు - సాహిత్యంలో కొంటెతనం ఎప్పణ్ణించీ నేరమయింది? ఏమో, నాకైతే హేలీ చెప్పినదాన్లో ఏదీ అభ్యంతరకరంగా, అంత బాధపడిపో వలసినట్టుగా లేదు. నేను ఎవర్నీ తప్పు పట్టడం లేదుగానీ తట్టిన ఒక ఆలోచనని మీముందు పెట్టకుండా ఉండలేకపోతున్నా. ఇటీవల యార్లగడ్డ ద్రౌపది నవల నేపథ్యంలో భారతీయ (హిందూ మత అని చదువుకోండి, పర్లేదు) ఎవర్ గ్రీన్ క్లాసిక్ అయిన మహాభారతాన్ని ఆధునికులు తమకి నచ్చినట్టు ఇంటర్ప్రెట్ చేసుకోడానికి అవకాశం ఉన్నదీ అని వాదించిన వారే .. చివరకు మిగిలేది అనే ఆధునిక క్లాసిక్ ని హేలీ అనే అత్యాధునికుడు తనదైన ఇంటర్ప్రెటేషన్‌తో చూస్తే అభ్యంతర మెందుకు? అతను చెప్పినది సరైన అవగాహన కాదని ఉలుకెందుకు? ఆధునికత అనేది తమతోనే ఆగిపోతుందా?

Interesting, don't you think?

Comments

ఆధునికత అనేది తమతోనే ఆగిపోతుందా? ఆగిపోదు. నేను చూసిన దృష్టి తోనే అందరూ చూడాలి అనుకోవటం.....విడ్డూరం.
తెలుసు సమితి అని రాసినట్టున్నారు!
నెనర్లు. సవరించాను
Purnima said…
Interesting? Naah.. Disgusting! Well, in ways.. funny too.
>> "కథానిక, కవిత - ఈ రెండు ప్రక్రియలు తప్పించి తెలుగులో ఇటీవలి కాలంలో ఇతర ప్రక్రియల్లో చెప్పుకోదగిన రచనలేవీ రాలేదు. ఇది నిర్వివాదాంశం"

"చెప్పుకోదగిన" అన్నది కొంచెం తిరకాసైన విశేషణం. మంచి పబ్లిసిటీతో గొప్పగా అమ్ముడుపోయిన పుస్తకాలు మాత్రం కచ్చితంగా లేవనే చెప్పవచ్చు. మీరన్నట్టు యువతరాన్ని ఆకట్టుకునే సాహిత్యం కూడా రాలేదని ఒప్పుకోవాలి. దీనికి చాలా కారణాలే ఉండవచ్చు. ఒక ముఖ్యమైన pattern, ఇండియాలో అలా ప్రాచుర్యం పొందిన సాహిత్యం కూడా ఇంగ్లీషులోనే ఉండడం. అమ్ముడుపోయే సాహిత్యం ఇంగ్లీషులోనే రాయడానికి రచయితలు, చదవడానికి పాఠకులూ ఇష్టపడ్డం దీనికి కారణం కావచ్చు.

ఎనభైల దాకా వచ్చిన అలాంటి సాహిత్యం (యండమూరి, మల్లాది వంటి వాళ్ళది) ఆ తర్వాత రాకపోవడానికి ఏంటి కారణం? తెలుగులో హఠాత్తుగా రచయితలు మాయమైపోయారా? తర్వాతి తరం పాఠకులు తెలుగు సాహిత్యానికి దూరమయ్యారా? దీనికి నా దగ్గర ఎలాంటి డేటా పాయింట్లు లేవు.

ఒక కాలంలో ఒకో రకమైన సాహిత్యం ఆ కాలపు యువతని ఉర్రూతలూగించడానికి ఆనాటి సాంఘిక పరిస్థితులు చాలా వరకూ కారణం అన్నది నిర్వివాదమైన అంశం. అంచేత ఈ కాలంలో యువతిని ఉర్రూతలూగించే సాహిత్యం తెలుగులో ఏదీ రాకపోవడం వెనకాల కూడా సామాజికమైన కారణాలు ఉండే ఉంటాయి.

ఈ దృష్టితో ఆలోచించాలంటే ముందుగా ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ప్రాచుర్యమూ, అమ్ముడుపోయే విలువా లేనంత మాత్రాన ఆ సాహిత్యానికి "సాహిత్య విలువ"/"స్థాయి" తక్కువని భావించడం తప్పు. ఉదాహరణకి రేగడివిత్తులు నవల చేతన్ భగత్ నవలల కన్నానో, హేరీ పోటర్ నవల కన్నానో తక్కువ స్థాయి నవల అని అనలేం కదా. ఆ పోలికే అసమంజసం.

ఇక మీ చివరి పేరాలో విషయానికి వస్తే, నేను ద్రౌపది నవల చదవలేదు కాబట్టి దాని గురించి మాట్లాడలేను. నేను పుస్తకం సైటులో అన్నట్టు, నా ఉద్దేశంలో ప్రతి రచనకీ ఒక పరిధి పరిమితి ఉంటాయి. మహాభారతమైనా, చివరకు మిగిలేది అయినా. వాటికున్న పరిధి కాస్త విస్తృతమైనదైతే, ఆ పరిధిలోనే వాటిని రకరకాలుగా ఇంటర్ప్రెట్ చేసే అవకాశం ఉంటుంది. అలా చెయ్యడం వల్ల సాధారణంగా ఆ రచనని మరింత బాగా అర్థం చేసుకోడానికి వీలవుతుంది. అదే ఆ పరిధిని దాటి వేరే దృష్టితో ఇంటర్ప్రెట్ చెయ్యడానికి ప్రయత్నిస్తే మొత్తం గందరగోళం అవుతుంది. ఆ రచన మొత్తం విపరీతంగా కనిపిస్తుంది. అలాంటి ఇంటర్ప్రెటేషన్ వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు.
కామేశ్వర్రావుగారు ..
యువతరాన్నే కాదు, నన్ను ఆకుట్టుకున్న పుస్తకం ఏదీ వచ్చినట్టు గుర్తు లేదు. మీ దృష్టికి వస్తే తప్పకుండా చెప్పండి.
->->->->
"ఉదాహరణకి రేగడివిత్తులు నవల చేతన్ భగత్ నవలల కన్నానో, హేరీ పోటర్ నవల కన్నానో తక్కువ స్థాయి నవల అని అనలేం కదా. ఆ పోలికే అసమంజసం."
<-<-<-<-<
Agreed. But Regadivittulu is older than 10 years.
Vasu said…
"చివరకు మిగిలేది" గురించి అంత చర్చ( రచ్చ) చేసిన వాళ్ళు, మీరు ద్రౌపది గురించి రాసినదానికి తేడ/పోలికేంటి అని అడిగితే కిమ్మనలేదు.. ఎందుకు చెప్మా .. చూడబోతే ప్రతీ విషయాన్ని వాళ్ళ దృష్టితో చూడకపోతే బతక నిచ్చేడట్టులేరు. ఏంటిది. ఇలాగైతే మాలాటి లేత బ్లాగర్లు (బ్లాగ్ వయసు రీత్యా) రాసే ధైర్యం ఎలా చెయ్యాలి :):)
హ హ హ. వాసుగారూ, జాల చర్చలు భీత హృదయాలకి అచ్చిరావు :)
Vasu said…
"జాల చర్చలు భీత హృదయాలకి అచ్చిరావు"
లైన్ బావుంది పేటెంట్ చేసేసుకోండి. నాకెందుకో మీరు ఈ మధ్య మాట్లాడేవి పింగళి గారిని గుర్తుకు తెస్తున్నాయి. :D

"వాసు గారూ" - ఏంటిది.. నేనొప్పుకోను.
ద్రౌపదికీ హేలీ వ్యాసానికీ పోలికా! మీరెక్కడికో వెళ్ళిపోయారు కొత్తపాళీగారూ. అత్యాధునిక వ్యాఖ్యానం అంటే అపహాస్యం అని నాకు తెలీదు క్షమించాలి.ద్రౌపది నేను చదివాను.కానీ నాకు అందులో అపహాస్యం కనిపించలేదు.

హేలీ వ్యాసంతో నా అభ్యంతరమల్లా “మదర్ థెరెసా నాకు మల్లికా షెరావత్ లాగా నచ్చింది” అన్నట్టున్న అతని శైలి గురించి. అక్కడా అభ్యంతరపెట్టానేగానీ అది "తప్పు" అని చెప్పలేదు. I only expressed my disagreement, never said its wrong.
మురళి said…
సాహిత్యం గురించి ఆసక్తికరమైన అంశం చర్చకి పెట్టారు.. గడిచిన పది పదిహేనేళ్ళలో వచ్చిన మార్పులు, ముఖ్యంగా టీవీ మాధ్యమం సాహిత్యానికి పరోక్షంగా నష్టం చేసిందంటే మీరు ఒప్పుకుంటారా? వార పత్రికల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం, ఉన్న పత్రికలూ కూడా మసాలా దినుసుల మీద ఆధార పడితేనే అమ్మకాలు నిలుపుకోగలం అనే వ్యాపార సూత్రానికి కట్టుబడిపోయి ఉండడం.. నాణ్యమైన రచయితలని తయారు చేయలేకపోవడం... మరో పక్క కొత్త తరానికి చదువంటే కేవలం క్లాసు పుస్తకాలు, ఎంసెట్, ఐఐటీ మాత్రమే అనే తరహా పెంపకం... ఒక్కొక్కటిగా వెతకడం మొదలు పెడితే కర్ణుడి చావుకి ఉన్నన్ని కారణాలు కనిపిస్తాయి మనకి. సాహిత్య పరంగా ఇది 'సంధియుగం' అనాలేమోనండీ..
Kottapali gari news in eenadu.
http://www.eenadu.net/story.asp?qry1=20&reccount=23
"యువతరాన్నే కాదు, నన్ను ఆకుట్టుకున్న పుస్తకం ఏదీ వచ్చినట్టు గుర్తు లేదు. మీ దృష్టికి వస్తే తప్పకుండా చెప్పండి"

ఈ మధ్య కాలంలో వచ్చిన తెలుగు నవలలు ఇంచుమించుగా ఏవీ నేను చదవలేదండి. ఇంకా సాహిత్య ఎకాడమీ బహుమతి వచ్చిన ద్రౌపదే చదవలేదు! నా దగ్గరున్న అతి కొత్త నవల రేగడివిత్తులే, అందుకే దాన్ని ప్రస్తావించాను.
అయితే మిమ్మల్ని ఆకట్టుకున్న పుస్తకం ఒకటి నా దృష్టికి వచ్చింది, దాని గురించి చెప్తాను. :-) "అంటరాని వసంతం". ఇదేదో క్రాసెగ్జామినేషన్లా అనిపిస్తే నన్ను క్షమించండి. కిందటేడాది పుస్తకం సైటులో ఈ పరిచయానికి కామెంటుతూ, "నా వుద్దేశంలో ఇది తెలుగులో గత పదేళ్ళల్లో వచ్చిన గొప్ప నవలల్లో ఒకటి." అని మీరే అన్నారు. దీనిబట్టి మీ దృష్టిలో మరికొన్ని గొప్ప నవలలు కూడా ఉన్నాయని అర్థమవుతోంది :-)
మీకు కచ్చితంగా ఎక్కువ పుస్తకాలతో పరిచయం ఉంది కాబట్టి, మీరు చదివిన తెలుగు పుస్తకాల్లో (గత పదేళ్ళలో వచ్చినవి) మీకు బాగా నచ్చిన ఒక రెండిటిని తీసుకొని, ఒకవేళ అవికూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేవని మీకు అనిపిస్తే, అలా ఎందుకనుకుంటున్నారో కొంచెం వివరిస్తే ఇక్కడ చర్చకి ఉపయోగకరంగా ఉంటుంది.
@ కామేశ్వర్రావుగారు .. అంటరాని వసంతం వచ్చి పదేళ్ళకంటే బాగా ఎక్కువే అయింది. ఆ కామెంటులో ఏదో మాట వరసకి రాశాను పదేళ్ళనీ, గొప్ప పుస్తకాల్లో ఒకటి అనీనూ.
కాస్త చదవదగిన పుస్తకాలు కథా కవితా సంకలనాలు, కొన్ని సాహిత్య వ్యాస సంకలనాలు తప్పి ఇంకేం గుర్తుకి రావడం లేదు.
మహేష్ గారు, భిన్నాభిప్రాయాలకి తావుండాలి అన్న సూత్రాన్ని మీరు వ్యతిరేకించారని నేననలేదు. మీ టాలరెన్స్ నాకు శ్లాఘనీయమే.
ఎక్కడైతే మీరు పోలిక లేదు అంటున్నారో కచ్చితంగా అక్కడే నాకు పోలిక కనబడింది. మీరు ఆ మదర్ తెరెసా వాక్యాన్ని ఉటంకించడం కూడ సమంజసంగా ఉంది. ఎందుకంటే, ద్రౌపది నవలని గురించి సాంప్రదాయవాదులు (ఇది నేను పెట్టిన లేబులు) లేవనెత్తిన విమర్శల్లో అదికూడ ఒకటి.
కొత్తపాళీగారి టపా చూసి పుస్తకం వైపు వెళ్ళాల్సి వచ్చింది. ఏదో అనుకుని అటెళ్తే అదేదో అయ్యింది. వెళ్ళినందుకు వినోదం కలిగిందా అని అడుగుతున్నారా? అదో మాయ! రంగులరాట్నమూనూ!

ఇక విభేదించడం అనే నాగరికత సంగతికి వస్తే అభ్యాసపూర్వకంగా కానీ, ప్రయత్నపూర్వకంగా కానీ అది పెంపొందే అవకాశాలు ఎక్కువ. ప్రసిద్ధమయిన ప్రతీదీ స్థిరమయింది కాదు కదా…అలాగే ఇదీనూ…..ఒక్కోసారి మీద పడి రక్కేసిన వాళ్ళే, గోళ్ళు ఊడగొట్టింతరువాతో, వాటంతటవే ఊడిపోయింతరువాతో మళ్ళీ పెరిగే వరకు పుంజీడు రాజీ మంత్రాలు పఠిస్తారు అని ఖడ్గ తిక్కనగారు చెప్పినట్టు గుర్తు….

సంచలనం కావాలో సమచలనం కావాలో తేల్చుకోవాల్సింది పుస్తకం వాళ్ళు. సంచలనం కావాలనుకుంటే సంతోషం, అది తీరినట్టే. టి.వి నైన్ రవిప్రకాష్ ఆత్మ ఆవహించినట్టే. సమచలనం కావాలంటే గొంగళికి చిల్లులు పెట్టాల్సిందే!

నవల అనేది అధికంగా జీవితానికి ప్రతిబింబంబం లాంటిది. అందులోని పాత్రలు, తపేళాలూ మనలాంటోళ్ళే. అలాక్కాదు అబ్బాయీ అంటే – చుట్టూ వుండే వ్యక్తుల్ని తీసుకుని ఒక త్రిశంకు స్వర్గాన్ని సృష్టించడమన్నమాట. ఒక నవల, రచన మన మీద చెరగని ముద్ర వెయ్యాలంటే జీవితాన్ని ప్రతిబింబించి తీరాలి. ఎప్పటి జీవితమైనా సరే, ఏ కాలానికి సంబంధించిందైనా సరే – ఒకటే లెఖ్ఖ. జీవితంలానే సుఖదుఃఖాలు, సంతోష విషాదాలు, రాజకీయాలు, రక్తమాంసాలు, వ్యక్తిత్వాలు అందులో సజీవంగా నిలబడాలి. ఇతివృత్తం, పాత్రల అవినాభావ సంబంధం సమపాళ్ళలో చక్కగా కుదరాలి. అదీ సందర్భానుసారంగా. ఐతే కొన్నిట్లో ఇతివృత్తం పాలు ఎక్కువయ్యో, కొన్నిట్లో పాత్రల పాలు ఎక్కువయ్యో అభాసు పాలవుతాయి. చిట్టిబాబు రాసింది నిలబడింది అంటే పైన చెప్పినవాటిలో అన్నీ కాకపోయినా, అవసరమైనంతవరకూ సమమో – దమమో పాళ్ళలో తూకం వేసుకుని విగ్రహరూపును సంతరించుకుంది. ఆ రూపు కొంతమందికి నచ్చకపోయినందువల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు. విగ్రహారాధన ఉన్నంతకాలం నాస్తికులుండరూ! అలానే ఇది కూడా! విగ్రహం ముక్కులో లోపం వుందనీ, ఆ ముక్కు బద్దలు కొట్టి అచ్చోట అలభ్యమైన కిసలయాన్ని వెదుకుదామని బయలుదేరేవాళ్ళకి జిల్లేడు కొమ్మలే లభ్యమవుతవి. జిల్లేడు కిసలయిస్తే పాలు చిగురించినట్టే!

ఇక్కడ ఒక ఆంగ్ల సూక్తి చెప్పాలె – :)

In fiction everything is true except names and dates and in history nothing is true except names and dates.

శ్లేష ఉపయోగించడం చేతనయిన వారు దానిని చక్కగా ఉపయోగించుకోవచ్చు. కాకపోతే ఒక కొలిక్కి రావాలి అనుకునే చర్చల్లో శ్లేష ఉపయోగం ఒక రకంగా అపాయాన్నే సృష్టిస్తుందని ఇక్కడి మాటలు తెలియచేస్తున్నాయి. భవదీయుడి కామెంటుతో సహా! ఒక పిట్ట కథ – అప్పుడెప్పుడో…ఎప్పుడో… ఒకావిడ తన నగలని గాడిద రోమాలతో తయారు చేసిన కుంచెతో శుభ్రం చేసుకుంటూంటే, ఆవిడ మరిది గారు వచ్చి వదినా, వదినా, గాడిదవా? అని అడిగాడుట. అయితే ఆవిడ అవును మరిదీ, ఊరగాడిదో, కంచర గాడిదో తెలీదు కానీ గాడిదవేను! అని సమాధానం ఇచ్చిందిట. మరి తరువాత మరిది గారు గోతిలో పడ్డాడో, గాడిదెక్కి ఊరేగాడో తెలియదు కానీ……అదండీ సంగతి…… (అసలు గాడిద రోమాలతో కుంచె ఏమిటా? అది కూడా తెలియకపోతే, ఇంతే సంగతులు చిత్తగించవలెను!)

ఏతావాతా – ఇక్కడ కొంతమందికి హేలీ మరిదిగానూ, కొంతమందికి వదినగానూ సంతోషాన్ని పంచుతున్న తపేళా – అనగా పాత్ర అన్నమాట నిజ్జంగా నిజం. హేలీ బరహా పనిచెయ్యలేదన్నది ఇనుము ఇసకైనంత నిజం. వారు తెలుగులో కన్నా ఆంగ్లంలో బారాయగలను అనుకున్నారు, అందులోనే నొక్కి వక్కాణించారు.

దీనికి ఇంత ప్రాముఖ్యత ఇవ్వడం అనవసరం. కొత్తపాళిగారు టి.వి.నైన్ ప్రకాష్ లాగా సంచలనం అని బాబాగారి ఊదీ వేసి ఈ వేళ అనవసరంగా వేళ్ళు నొప్పిపుట్టించారు. :) పోనీ రాయకుండా వుందామంటే సభ, అందులోని రష్యా, అమెరికా, చైనా మొదలైన శాశ్వత సభ్యులు సమావేశమయ్యింతరువాత (ఎక్కడైనా వీరే కాబట్టిన్నూ, వీరు తప్ప ఏ సమావేశాల్లోనూ, చర్చల్లోనూ ఇంకెవరూ కనపడకపోవటం మూలానూ) ఊరక కూర్చోవాలంటే అహ్మెదినిజాదు ఆవహిస్తానని హెచ్చరించటం మూలాన్నూ…..అదండీ…ఇక మంత్రసాని దెప్పులు మొదలేమో! :) :)

కామేశ్వరరావుగారూ – ఆయనెవరో – మా పిల్లాడు కుక్కపాలు పితికి తాగాడండీ, దానికి ప్రాయశ్చిత్తమేమన్నా వున్నదా అంటే రేవులో జలకాలాడే ముసలమ్మ దగ్గర సంకల్పం చెప్పించుకుని బంగారు కుక్క దానం చెయ్యి, పాపం పోతుంది అన్నాట్ట శాస్త్రులుగారు. :) అదండీ కుర్రోడి జాతక రీత్యా జరపబడిన, జరిగిన విధివైచిత్ర్యం….

ఇకపోతే లలిత గారికి నెమ్మదిగానైనా విచ్చుకత్తులు కనపడ్డందుకు పరమాన్నం తిన్నంత సంతోషంగా వున్నది.
Vamsi garu .. thank you for the detailed explanation. As one of my esteemed former colleagues used to say - it is as clear as mud :)
Hahaha.....That's one hilarious quote from the esteemed friend. :) :)

Exactly - that's the essence and the beauty of this mud. :) Will chat offline about it.
HalleY said…
@Vamsi M Maganti
"హేలీ బరహా పనిచెయ్యలేదన్నది ఇనుము ఇసకైనంత నిజం. వారు తెలుగులో కన్నా ఆంగ్లంలో బారాయగలను అనుకున్నారు, అందులోనే నొక్కి వక్కాణించారు."
బాబోయ్ ! మీరు డిటెక్టివ్ లా ? . అబద్దం చెప్పి నేను ఏమి సాధిస్తానని? . అలా అనుకుంటే ఈ కామెంటు కూడా తెలుగులో రాయవలసిన అవసరం నాకు లేదు . ఎందుకండి ఉన్నదీ లేనిదీ రాస్తారు :) .

నా కామెంటుకీ ఈ పోస్టుకీ మరీ దగ్గర సంబంధం లేదు కానీ ఒక చిన్న అనుమానం :

"Purchase options below for US residents only. Users from the rest of the world may contact Navodaya Publishers Vijayawada: vjw_booklink AT yahoo.co.in"

తెలుగులో ఒక పేపాల్ పొర్టల్ పెట్టటానికి యెంత ఖర్చు ఔతుందో మీకు తెలుసా ?. నా ఉద్ధేశంలో నవోదయ , విశాలాంధ్ర వంటివారు ముందుకు వచ్చి ఒక తెలుగు పుస్తకాల ఆన్లైన్ పోర్టల్ పెడితే చాలా మందికి ఉపయోగపడుతుంది.
@HalleY
There is already a comprehensive Telugu online bookstore supplying worldwide.
http://www.avkf.org/BookLink/book_link_index.php
This is being done on non-profit idea.
Navodaya and other booksellers find it prohibitive to maintain an active website - hosting costs, etc. They simply don't have the people to do it in house and hiring someone to do it is too expensive. Also, Don't know if paypal and such offer their services for e-commerce within India. In US, each transaction has a $0.30 minimum fees which becomes excessive in INR if one buys only one book per transaction.
రవి said…
గత కొన్ని రోజులుగా కచేరీలో బ్లాగులు మూసివేయడంతో మీ బ్లాగుకు వచ్చి చూసే భాగ్యం ఇప్పుడే కలిగింది. మీరు (కూడలి) అస్త్ర సన్యాసం చేసి కొంత ఇబ్బంది పెడుతున్నారు.

Hally గారి చివరకు మిగిలేది పుస్తక పరిచయం చదివిన తర్వాత నాకొక విషయం అనిపించింది. ఓ పుస్తకానికి సమీక్ష వ్రాయడం అసిధారావ్రతం లాంటిది. అందుకు నిర్దుష్టమైన పరిధి, సమీక్ష చేయబడ్డ పుస్తకంలో ప్రస్తావించిన "విషయం" (subject) మీద పట్టు లేకపోతే రక్తికట్టదు, ప్రయోజనమూ ఉండదు, సరికొత్త భావాల ఉత్పత్తీ జరుగదు. అయితే halley వ్యాసం పుస్తకపరిచయంగానే స్వీకరించాలి. అది ఒక పూర్తీస్థాయి సమీక్ష కాదు.

కామేశ్వర్రావు గారి పాయింట్ బావుంది.

"ఎనభైల దాకా వచ్చిన అలాంటి సాహిత్యం (యండమూరి, మల్లాది వంటి వాళ్ళది) ఆ తర్వాత రాకపోవడానికి ఏంటి కారణం? తెలుగులో హఠాత్తుగా రచయితలు మాయమైపోయారా? తర్వాతి తరం పాఠకులు తెలుగు సాహిత్యానికి దూరమయ్యారా? దీనికి నా దగ్గర ఎలాంటి డేటా పాయింట్లు లేవు."

వారిద్దరి నవలలు దాదాపు అన్నీ అప్పట్లో ఎగబడి చదివిన పాఠకుడిగా కొన్ని విషయాలు వీలు దొరికితే నా బ్లాగులో రాస్తాను.
@ రవి .. కూడలి నుంచి నేను తీసుకున్న సన్న్యాసానికి విరుగుడుగా ఏం చెయ్యాలో మీకు తెలియదని నేననుకోను :)
మల్లాది యండమూరి పుస్తకాల అనుభవాలు తప్పక రాయండి