సరికొత్తగా పలకరించే పాతమిత్రులు

మా అమ్మావాళ్ళింటో అందరమూ దక్షిణభారత హిందీ ప్రచారసభ పరీక్షల ఘనాపాఠీలము. అందరమూ అథమాధమం ప్రవేశిక దాకా పేసయ్యాం.

ఈ ఉద్యమానికంతా ఆద్యులు మా అప్ప (మా నాన్నగారు). ఆయన పుట్టుకతో తమిళుడైనా, భాషా జిజ్ఞాస మెండు. ఆంధ్రా లొయొలా కాలేజిలో బోటనీ హెడ్డుగా ఉద్యోగంలో చేరి, మా అమ్మని పెళ్ళాడి, విజయవాడలో కాపురం పెట్టాక ఆయనకి హిందీ నేర్చుకోవాలని కోరిక పుట్టింది. అప్పటికప్పుడు ఓనమాల దగ్గర్నించి మొదలెట్టి నాకు ఊహ తెలిసే సమయానికి (అంటే ఒక పదిహేనేళ్ళ కాలంలో) చిట్ట చివరి పరీక్ష ప్రవీణ కూడా పేసయ్యారు. ఆయన తన చదువు కోసం కొన్న పుస్తకాలు అలా ఇంట్లో ఉండడంతో మాకందరికీ ఒక వయసు రాగానే ప్రాథమిక తో మొదలెట్టి వరసగా లాగించి పడేసేవారు. ఈ సిలబసూ పుస్తకాలూ ఆట్టే మారేవి కావు. రాష్ట్రభాష పరిక్షకి అనుకుంటా మా అప్ప చదువుకున్న ఫులవారీ కవితా సంకలనమే నేణూ చదూకున్నా.

ఏదో చెప్పబోయి ఏవిటో చెప్పుకొచ్చా. అసలు సంగతేవిటంటే, ప్రవేశికలోనో విశారదలోనో మాతృభాషా సాహిత్యమ్మీద ఒక పేపరుండేది. మరి మా అప్పకి మాతృభాష తమిళం కాబట్టి ఆయనది తమిళంలో రాసుండాలి. మా అమ్మ కోసమో, మా పెద్దక్కయ్య కోసమో ఈ పరీక్షలకి సంబంధించిన తెలుగు కథల పుస్తకం ఒకటి మా యింట్లో ప్రవేశించింది. నాకప్పుడు ఎనిమిదో తొమ్మిదో ఉంటై. కథలంటే పిచ్చి. ఆ పుస్తకం నాకు చిక్కితే యధాలాపంగా తెరిచి వచ్చిన కథ చదవడం మొదలు పెట్టాను. ఒక పల్లెటూరబ్బాయి, తొలిసారి నగరానికొచ్చి, అక్కడ ఒక కేంటీన్లో టిఫిను తినడంతో కథ మొదల్వుతుంది. ఆ కథలో వాతావరణం అంతా ఏదో కొత్తగా అనిపించింది నాకు. ఆ తినుబండారలన్నిటికీ పావ్ ఉసల్ అనీ, భజ్యా అనీ తమాషా పేర్లు. ఇంతకీ ఆ కుర్రాడు అక్కడ ఒక ఫేక్టరీలో కార్మికుడుగా చేరి డబ్బు సంపాయించి పల్లెలో ఇంటికి పంపుతూ ఉంటాడు. అలా చాలా దూరం నడుస్తుంది కథ.

నేను చాలా పెద్దవాణ్ణయ్యాక, కొకు కథల సంపుటులు చదువుతుంటే దాని పుటల్లోంచి అకస్మాత్తుగా నా ముందుకెగిరి పలకరించాడు ఆ పల్లెటూరబ్బాయి, విఠల్. కథ పేరు కొత్తజీవితం. అదే కేంటీను, అవే పావ్ ఉసల్, భజ్యా. నిజంగా చిరకాలమిత్రుణ్ణి అకస్మాత్తుగా కలుసుకున్నంత ఆనందం కలిగింది నాకు. ఎంత ఆశ్చర్య పోయానో .. నేనప్పుడెప్పుడో చదివిన ఆ కథ కొకుదా? ఆ విఠల్ కొకు సృష్టా? అందుకే అంతబాగా గుర్తుండి పోయాడు కాబోలు.

అటువంటి మిత్ర పునర్దర్శనమే మళ్ళీ ఈ మధ్య తటస్థించింది. నేను డ్రెక్సెల్ వివిలో విద్యార్ధిగా ఉన్న రోజుల్లో, మా విద్యార్ధులందరం కూచోడానికి లాబ్ భవనం బేస్మెంటులో ఒక విశాలమైన జాగా ఉండేది. అక్కడ పూర్వ విద్యార్ధులు వదిలి పోయిన అనేక నవలలూ, పత్రికలూ ఉండేవి. నవలలు బహుశా అన్నీ చదివేశాను నేనక్కడ ఉన్న కాలంలో. చాలా వాటికి పై అట్టలుండేవి కావు. అలా చదివిన నవలల్లో ఒక సైన్సు ఫిక్షను నవల్లోని కొన్ని విశేషాలు భలే గుర్తుంది పోయాయి. ఒక అంతరిక్ష నౌక ఒక వింత గ్రహానికి వెళ్తుంది. మానవ నౌకకి నాయకత్వం వహించిన కేప్టెను తనని తాను రిలాక్స్ చేసుకోడానికి క్లిష్టమైన డిఫరెన్షియల్ ఈక్వేషన్లని మనసులోనే సాల్వ్ చేస్తుంటాడు. ఆ గ్రహవాసులు తమని తాము ఫ్యుంచ్ క్లిక్ అని పిల్చుకుంటారు. వాళ్ళకి ఒక వేపు రాతి గదలాంటి ఒక బలమైన చెయ్యీ, రెండో వేపు అతి నాజూకైన రెండు చేతులూ ఉంటై. వాళ్ళు ఎటువంటి ఇంజనీరింగ్ పరికరాన్నైనా అతి త్వరగా తమ అవసరానికి తగినట్టు మార్చేసుకోగలరు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఎన్నో అలా గుర్తుండి పోయాయి.

ఈ మధ్యన మంచి సైన్సు ఫిక్షను చదవాలనే కోరిక మళ్ళీ తిరగబెట్టి లైబ్రరీనించి ఒకదాణి తరవాత ఒకటి ప్రసిద్ధి గాంచిన సైఫై నవలల్ని తెచ్చి చదువుతూ వచ్చా. ఆ క్రమంలో మళ్ళీ నన్ను పలకరించారు, కేప్టెన్ బ్లెయిన్, మరియూ ఫ్యుంచ్ క్లిక్ అనబడే మోటీలు. భలే ఆశ్చర్యం వేసింది .. ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు? సుమారు పదిహేనేళ్ళ తరవాత!

చిరకాల మిత్ర పునర్దర్శనం బహు ఆనందదాయకం. అనుకోకుండా అకస్మాత్తుగా జరిగితే, ఇక చెప్పాలా? ఆ ఆనందం ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది.

Comments

మురళి said…
ఎప్పుడో 'యువ' లో చదివి, కథ తప్ప మిగిలిన వివరాలన్నీ మర్చిపోయిన కథల్ని ఇప్పుడు 'పాలగుమ్మి పద్మరాజు కథలు' సంకలనం లో చదువుతుంటే నాకూ ఇలాంటి ఆనందమే కలుగుతోంది.. నిజం.. దీనిని అనుభవించాల్సిందే తప్ప వర్ణించలేం..
శ్రీ said…
నా బ్లాగ్ చూసి సాయి గారు ప్రక్రుతి పిలుపు పంపినప్పుడు ఇల్లాగే ఉంది...
మేధ said…
అవును.. అప్పుడెప్పుడో చదివిన వాటిని మళ్ళీ అనుకోకుండా చదవడం చాలా బావుంటుంది..
sunita said…
అవును సుమా!నిజమే!
Hima bindu said…
మా కాలేజీ బోటనీ హెడ్ ఎవరా అని చదివినప్పటినుండి తెగ ఆలోచిచ్చేస్తున్నాను .లయోలకి మొట్ట మొదట రంగులద్దినోళ్ళం మేమెకదా .-:) కో-ఎడ్యుకేషన్ మాతోనే .
చిన్ని గారు, అలాగా? చాలా సంతోషం. మీది చాలా కొత్తతరం లేండి. మా అప్ప పేరు ఎస్.ఎన్.రామస్వామి గారు. లొయొలా కాలేజి మొదలైన (1954 అనుకుంటా) నాటి నించీ బోటనీ హెడ్ గా పని చేశారు 1975 వరకూ. లైబ్రరీ మెయిన్ ఫ్లోర్లో ఆయన ఫొటో ఉండేది. మరి తరవాత ఉంచారో లేదో తెలీదు. ఆయన స్మృతిలో ఇప్పటికీ నాలుగు రజత పతకాలు విద్యార్ధులకి బహుకరిస్తుంటాము ప్రతి యేడూ.
asha said…
మహేశ్‌గారి బ్లాగులో వోల్గా గారి "మానవి" గురించిన సమీక్ష చదివినప్పుడు ఇలానే అనిపించింది.
భావన said…
అవును నాకు మొన్నీ మధ్య పుస్తకాలు సర్దుకుంటుంటే ఎప్పటిదో పురాణం సీత (ఆ పేరు తోనే రాసే వారనుకుంటా కదా ఆయన) గారి "ఇల్లాలి ముచ్చట్లు" పుస్తకం కనపడి చింతచిగురు పప్పు బ్రిలియంట్ గా వండిన విధానం మళ్ళీ ఒక్కసారి చదివి ఎంతో ఆనంద పడ్దాను...
తృష్ణ said…
చిన్నప్పుడు చదివిన చాలా పుస్తకాల్ని మళ్ళీ తెరిస్తే..మీరు రాసినట్లే పాత మిత్రుల్ని పలకరించినట్లే ఉంటుంది...నేను కూడా పనిగట్టుకుని అప్పుడప్పుడు చదివిన పుస్తకాల్నే మళ్ళి మళ్ళి చదువుతు ఉంటానండి..ఆ ఆనందం మాతల్లో చెప్పలేనిది..