శ్రీ మేడసాని మోహన్ గారితో ముఖాముఖి

శనివారం నాడు మా సాహితీసమితిలో సహస్రావధాని శ్రీ మేడసాని మోహన్ గారు ప్రసంగించారు. మేం వెళ్ళటానికి అంతా సిద్ధమై తీరా చివరి నిమిషంలో ఏదో అడ్డంకి వచ్చి వెళ్ళలేక పోయామే అని బాధ పడుతుంటే ఆదివారం మధ్యాహ్నం తానా అధ్యక్షులు డా. బండ్ల హనుమయ్య గారింట్లో వారిని కలిసి గంటన్నర సేపు ముచ్చటించే అదృష్టం కలిగింది.

మోహన్ గారు పాతికేళ్ళకి పైగా తి.తి.దే వారి అన్నమాచార్య ప్రాజెక్టులో పని చేస్తున్నారు. సహాయ పరిశోధకునిగా మొదలుపెట్టి ప్రాజెక్టు డైరక్టరుగా అత్యున్నత స్థానాన్ని అధిష్టించారు. ఈ సమయంలో అన్నమాచర్యుల సంకీర్తనలపై, కుటుంబ చరిత్రపై, తిరుపతి దేవాలయాల చరిత్రపై, ఆ ప్రాంత చరిత్రపై లోతైన పరిశోధనలు చేసి ఏన్నో మౌలికమైన సత్యాలను వెలికి తీశారు. కొన్ని కీలకమైన చారిత్రక విషయాలను ప్రతిపాదించి నిరూపించారు. దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా అన్నమాచార్యుల సంకీర్తనలని ప్రచారం చెయ్యటంలో అనేక ప్రత్యక్ష కార్యక్రమాలలో వ్యాఖ్యాతగా, సంధానకర్తగా వ్యవహరించారు.

సంకీర్తనలు, చరిత్ర, అధ్యయనము, పరిశోధన - ఇవి వృత్తి ధర్మాలయితే, పద్య రచన, అవధానము వారి ప్రవృత్తి ధర్మాలు. చిన్నప్పటినించీ పద్యసాహిత్యమంటే మక్కువ. కౌమార దశలోనే లభించిన గురూపదేశంతో ధ్యానవిద్య అలవడి ధారణశక్తినీ, కవితాధారనీ ప్రేరేపించింది. ధారణ జ్ఞాపకశక్తికి ఒక రూపం. అవధానంలో పృఛ్ఛకులకి సమాధానంగా చెప్పిన పద్యాలన్నిటినీ అవధానం చివర మళ్ళీ అదేవరుసలో ఏకబిగిన ఏకరువు పెట్టడాన్ని ధారణ అంటారు.

పదిహేనేళ్ళ వయసులో, మోహన్ గారు పదవ తరగతి పరిక్షలు రాసిన తరవాత వేసవి శలవల్లో బడి ఆచార్యులు, ఊరి పెద్దలు పృఛ్ఛకులుగా మొదటి అష్టావధానం విజయవంతంగా పూర్తిచేశారు. అటుపైన అవధాన ప్రక్రియలో అంచెలంచెలుగా పైకెక్కుతూ శత, ద్విశత, పంచశత, సహస్రావధానాలు నిర్వహించారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 18 నించీ మార్చి 20 వరకూ హైదరాబాదులో వీరు నిర్వహించిన పంచ సహస్రావధానం ఒక అపూర్వ సంఘటన. వెయ్యి దత్తపదులు, వెయ్యి సమస్యలు, వెయ్యి వర్ణనలు .. ఇలా వర్గంలో వెయ్యేసి ప్రశ్నలతో మొత్తం 5,116 అంశాల కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చెయ్యటం మోహన్ గారి మేధకు కలికితురాయి.

అన్నమాచార్యుల సంకీర్తనల గురించి చాలాసేపు ముచ్చటించుకున్నాము. అన్నమయ్యకి ముందు మనకి తెలిసిన ప్రసిద్ధకవులు కవిత్రయం వారు, శ్రీనాథుడు, పాల్కురికి సోమనాథుడు ఇత్యాదులు. వీరందరూ కూడా ఏదో కావ్యాలు రాసేశాం అన్నట్టు కాక ఒక నిర్దిష్టమైన ప్రయోజనాన్ని కోరి గంటం పట్టినవారు. అన్నమయ్య కూడా ఒక నిర్దిష్టమైన ప్రయోజనాన్ని ఆశించే కవి అయినాడు. ఎక్కడో వేదాల్లోనూ, వేదంతములైన ఉపనిషత్తుల్లోనూ, మంత్ర తంత్ర శాస్త్రాల్లోనూ పాతుకు పోయి ఎవరికీ అర్థంకాని "దేవభాష"లో ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను జనసామాన్యానికి చేరువచెయ్యటం ఆయన పరమావధి.

తమిళంలో మహాభక్తులైన ఆళ్వారులు ప్రవచించిన పాశురములు దివ్య ప్రబంధమై ద్రావిడవేదముగా కొనియాడబడినాయి. వైష్ణవ మతరహస్యాలనూ, భక్తి తత్త్వాన్నీ సామాన్యప్రజలకు దగ్గరచేశాయి. తెలుగులో అటువంటి సాహిత్యం లేదు. ఆ లోటు పూరించాలి. అప్పటికి ఉన్న రచనా పద్ధతి పద్యకావ్యాలు రాయటం, ఎక్కువగా సంస్కృత పురాణాల ఆధారంగా. తాను ఎంచుకున్న గమ్యం చేరేందుకు ఇది కాదు పద్ధతి - జనానికి సులువుగా పట్టుబడే ప్రక్రియ కావాలి. అదే పదం - అంటే పాట. భక్తి పరవశంతో రంగరించిన పాటనే సంకీర్తన అన్నారు. అది తరవాత రామదాసు నోట కీర్తనయ్యింది. త్యాగరాజు స్వరంలో కృతిగా అవతరించింది - అది వేరే సంగతి.

తన సాహిత్య సౌధానికి పునాదిగా పదాన్ని ఎంచుకున్నాడు అన్నమయ్య. సున్నితమైన తేట తెలుగు మాటలతో, మిక్కిలి సొగసైన తెలుగు జాతీయాలతో నుడికారాలతో పదాలల్లాడు. వేద మంత్రాలని, తత్త్వసారాన్ని, పురాణ గాథలని తన పదాల్లో కూరి వాటితో శ్రీవేంకటశ్వరునికి స్వరాభిషేకం అక్షరాభిషేకం. చేశాడు. ఏలపాటలు, జోలపాటలు, గొబ్బిళ్ళు, టముకులు, కోలాటం, దాసరి పదాలు - అన్నమయ్య ముట్టని తెలుగు జీవిత పార్శ్వం లేదంటే అతిశయోక్తి కాదేమో.

సంకీర్తనలపై, చారిత్రక సాంస్కృతిక విషయాలపై మోహన్ గారు రాసి ప్రచురించిన వ్యాసాలు లెక్కకు మించి ఉండగా, "పురుషోత్తమ చక్రవర్తి" అనే పేరిట 700 పై చిలుకు పద్యాలతో రచించిన పద్యకావ్యం ప్రచురించ వలసి ఉంది. అన్నమయ్య పదాలను, క్లిష్టమైన మాటలకి అర్థాలతో, సంకీర్తన మొత్తానికి వ్యాఖ్యతో మొత్తం 29 సంపుటాల సాహిత్యం అన్నమాచార్య ప్రాజెక్టుద్వారా సిద్ధమైందనీ, త్వరలోనే ప్రచురణ జరుగుతుందనీ చెప్పారు. ఇందులోనుంచి, ప్రస్తుతం బాగా ప్రసిద్ధి చెందిన సుమారు 1500 పదాలని ఏరి మూడు సంపుటాల్లో అందరికీ అందుబాటులో ఉండేవిధంగా ప్రచురిస్తామని కూడా శలవిచ్చారు.

Comments

Anonymous said…
మీరు మేడ సాని మోహన్ అనగానే నా ముందు మా ఊళ్ళో జరిగిన అవధానం గుర్తుకు వస్తోంది. అప్పుడు నేను ఆరో తరగతో ఏడో తరగతో అనుకుంటా. మేడసాని గారి అవధానం తొలి రోజులు. ఆయన ధారణ శక్తి అబ్బుర మనిపించింది. ఇలాగా గుర్తు పెట్టుకోగలిగితే పరీక్ష లప్పుడు మాత్రం పుస్తకాలు చదివితే సరిపోతుంది మిగిలినప్పుడు చందమామ, బాలమిత్ర, బుజ్జాయి చదువుకోవచ్చనుకునేవాడిని. నాకు తెలిసిన వాళ్ళింట్లో భోజనానికొస్తే భొజన అయిపోయిన తరువాత ఆయన పక్కన కూచోవడం అనిర్వచనీయమైన ఆనందం అప్పుడు. స్కూల్లో అందరికీ చెప్పా నేను ఆయన పక్కన కూచున్నానోచ్ అని.


ఇక్కడ మా వూర్లో ఒక అవధానం పెట్టిస్తే బావుంటుందని నేను సాంస్కృతిక కార్యదర్శి నయినప్పుడు సంబరపడ్డా. కానీ అంత సాహితీ ప్రియులెవరూ లేరు అని బాగా తెలిసివచ్చింది ఎన్నో పాఠాలతో. ప్చ్.. కాలం మారింది లేదా ఇంకొంత కాలం ఆగాలి.


-- విహారి