మోహన రాగ మహా - 2

ఆ ట్రిప్పు నించి ఇల్లు చేరి ఇంట్లో స్టీరియో ఆన్ చేసి ఏవో పనులు చేసుకుంటున్నాను. సంజయ్ సుబ్రహ్మణ్యం పాడుతున్నాడు. ఈ తరం గాయకుల్లో నా కిష్టమైన గాయకుడీయన.
ఏవేవో పాటలు, రాగాలు జరిగిపోతున్నై. నేను కొంతవరకూ నా పనిలో మునిగిపోయి కొంత పరధ్యాసగా వింటున్నా. మోహన ఆలాపన మొదలైంది. అరే, పొద్దుటే నేదునూరి గారి మోహనం .. మళ్ళీ ఇక్కడ కూడా మోహన తటస్థించిందే అనుకుని దాంతో బుర్ర కొంచెం మెలకువ తెచ్చుకుని కాసేపు శ్రద్ధగా అతని ఆలాపన విన్నాను. ఇంతకంటే బాగా పాడచ్చే అనిపించింది. ఎందుకంటే సంజయ్ బాగా పాడటం - రికార్డుల్లోనూ ప్రత్యక్షంగానూ నేను విని ఉన్నాను. భైరవి లాంటి కష్టమైన రాగాల్ని అతను సరసంగా, రసభరితంగా పండించడం నాకు తెలుసు. పొడుగు ఆలాపనే చేసేట్టు ఉన్నాడు, ఏం పాట పాడతాడో అని కుతూహలం, కానీ ఈ ఆలాపన ఏమంత ఉత్సాహంగా అనిపించలా. నాకు ఇంట్రస్టు పోయింది. నేను నా పనిలో పడిపోయాను. స్టీరియో దాని పని అది చేసుకుపోతోంది.
నేను చేస్తున్న పని ముగించి తలెత్తి చూద్దును గదా, అప్పటికే అతను నెరవులు వేస్తున్నాడు. నెరవులు అంటే - పాటలో ఏదో ఒక లైను తీసుకుని, దాన్ని వాగ్గేయకారులు స్థిరపరిచిన స్వరంలో కాకుండా, గాయకుడు తన సృజన శక్తితో విడమరిచి విస్తరించి పాడటం. కర్ణాటక సంగీతంలోని improvisational elementsలో ఇదొకటి. మాట స్పష్టంగా అర్థం కావట్లేదు కానీ, ఏదో బాగా తెలిసిన ముక్కల్లేనే వుంది.
"తరమనూ ఝావ తారమ హిమ .."

ఓహ్హోహో, అర్థమైంది.
ధర మనుజ+అవతార మహిమ విని ..
ఇది మోహన రామా అని మొదలయ్యే త్యాగరాజ కృతి. రాముని సద్గుణాల్నీ, రామావతార పరమార్థాన్నీ మోహన రాగమనే రసాయనంలో రంగరించి ఆ రసాన్ని ఈ కృతిలో పిండాడు స్వరార్ణవాన్ని జీర్ణించుకున్న ఆ అపర నారదుడు, త్యాగరాజస్వామి. త్యాగరాజ కృతుల్లో పది గొప్పవాటిని ఎంచుకోమంటే నా లిస్టులో ఈ కృతి తప్పక ఉంటుంది.
మళ్ళీ కథకొద్దాం. పాపం మన తమిళ సోదరులకి త థ ద ధలన్నిటికీ కలిపి ఒకటే అక్షరం - దాంతో వొచ్చిన తిప్పలివి - ధర మనుజావతార కాస్తా తరమనూ అయి కూర్చుంది. అఫ్ కోర్సు, నెరవులు పాడేప్పుడు - అక్కడ ఉచ్చారణ కంటే రాగ ప్రస్తారానికే పెద్దపీట కాబట్టి కొంత మాట విరుపులు తప్పవనుకోండి.
సీడీని కాస్త వెనక్కి తోసి పాట మొదణ్ణించీ విన్నాను. మిగతా సాహిత్యమంతా బానే పాడాడు సంజయ్. నెరవుల తరవాత స్వరకల్పన కూడా బానే వుంది, "తరమనూ" ని లక్ష్యపెట్టక పోతే.
ఈ పాట అయ్యాక ఒరిత్తి మహనా పిరందు అనే తిరుప్పావాయ్, పెట్రతాయ్ తనమహన్ మరందాలుం అనే విరుత్తం రాగమాలికలో, చివరిగా ఆరాయ్ ఆశై పడాయ్ అనే శైవ భక్తి కీర్తన నాదనామక్రియ రాగంలో తమిళంలో చాలా బాగా పాడాడు. ఈ చివరి రెండు అంశాలూ ఎమ్మెస్ సుబ్బులక్ష్మి ఏదో రికార్డులో పాడింది.
ఇదేదో live recording. రెండు సీడీల సెట్టు. సంజయ్ గాత్రంలో బెస్టని చెప్పను గానీ, విన దగ్గదే.
వివరాలివిగో

http://www.charsur.com/aspx/ProductDetails.aspx?ProductId=113

మూడవ మోహనం త్వరలో ..

Comments

Sriram said…
Sanjay is one of my favourite too...but he man handles the saahityam most of the times, which is a lil painful. But his RTPs are really great!he sang one in bahudari last time here...magnificient...

btw, do you know whats a barODaa kurma? thats parota kurma in a tam hotel :)