రామజోగి మందు భవరోగాలకి సరైన చికిత్స



రామభక్తి సామ్రాజ్యవాసి రామదాసు

కంచెర్ల గోపన్న ఉద్యోగానికి తహసీల్దారు అయుండవచ్చునుగానీ ఆయన మనసూ జీవితమూ మాత్రము శ్రీరామునికే అంకితమైనవి.
రామదాసు కీర్తనలను తొలిసారిగా విన్నప్పుడు వరదగోదావరిలాగా పొంగిపొరలే రామభక్తి మనలను ముంచివేస్తుంది. సాహిత్యంలోని సరళత, పాడుకోవడంలో సౌలభ్యమూ మనలను ముగ్ధుల్ని చేస్తాయి. పారవశ్యంలో చిందు వేస్తున్న భక్తుని తూగువంటి లయ మనలను ఊపేస్తుంది, లేచి చిందెయ్యమటుంది. ఒక మూల ఏకాంతంలో కూర్చుని తాటాకులమీద గంటంతో రాసినవి కావు కీర్తనలు. తోటి భక్తులతో చేరి రాముని సన్నిధిలో మైమరచి ఉండగా, తన మానస పర్వతాలలో రామభక్తి ఊటలూరి, పాయలు గట్టి ప్రవహించిన సాహిత్య స్రవంతులివి, సంగీత ఝరులివి.

రాముడుంటే చాలు, రామభక్తి ఉంటే చాలు, ఆహా రామనామం ఎంత మధురం, భవరోగములన్నిటికీ విరుగుడైన మందు కదా రామనామం - ఇటువంటి భక్తిభావన చిప్పిల్లే కీర్తనలు అనేకం. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకూ, తారకమంత్రము కోరిన దొరికెను, పాహి రామప్రభో, రామజోగి మందు గొనరే - ఇటువంటి కీర్తనలలో లక్షణాలు ప్రస్ఫుటంగా ప్రకటించబడినాయి. ఇది భక్తి సాహిత్యానికి మొదటి లక్షణం. ఇదిలా ఉండగా, నా మొరాలకించవయ్యా నన్ను రక్షించవయ్యా, అని మొరబెట్టుకుంటూ నా మాట వినవా, నన్ను పట్టించుకోవా అని నిష్ఠూరమాడే కీర్తనలు - ఏతీరుగ నను దయజూచెదవో, ఎటు పోతివో రామ, పలుకే బంగారమాయెనా - ఇటువంటి పాటలలో తన ప్రభువు పట్ల భక్తితో పాటు స్వామికి అతి చేరువ అయిన ఒక చెలికాని చనువు మనకి వినిపిస్తున్నది. నేనెంత మొరబెట్టుకున్నా స్వామి వినడంలేదు అని చెప్పి, అయ్యవారిని కాదని అమ్మవారిని ఆశ్రయించాడు - రామచంద్రులు నాపై చలము జేసినారు, సీతమ్మా, చెప్పవమ్మా; ననుబ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ - అంటూ.

లోకప్రసిద్ధమైన రామదాసు చరిత్రములో ఆయన లౌకికంగా చాలా కష్టాలు అనుభవించాడనీ, గోల్కొండనవాబు తానీషావల్ల ఖైదు చెయ్యబడినాడనీ తెలుస్తున్నది. సరే, భక్తునికి కష్టాలు వచ్చినప్పుడు మరి తన స్వామితోకాక ఎవరితో చెప్పుకుంటాడు అని మనం సరిపెట్టుకోవచ్చు. అమ్మవారి సిఫారసు కోరడం కూడా అంగీకరించవచ్చు. ఐతే రామదాసు నిష్టూరాన్ని దాటి ఎకసెక్కానికి పూనుకున్నాడు. పాహిమాం శ్రీరామా అంటే పలుకవైతివి అనే కీర్తనలో వినబడే వెక్కిరింపు, మనం సాధారణంగా సంభాషణలలో వాడే - అబ్బబ్బో, అయ్యయ్యో, ఆహాహా - వంటి ఆశ్చర్యార్ధకాలతో మనకి కూడా ఆశ్చర్యం కలిగించడమేగాక, చక్కని అనుప్రాసలతో సాగే ఎకసెక్కెం గిలిగింతలు పెట్టేట్టుగా ఉన్నది.
ఉదాహరణకి ఒక చరణం -
ఇబ్బందినుండీ కరి బొబ్బ పెట్టినంతలోనే
గొబ్బున కాచితివట జబ్బుసేయక
నిబ్బరముగా నెంతో కబ్బమిచ్చి వేడుకున్న
తబ్బిబ్బు చేసెదవు రామ, అబ్బబ్బబ్బా
బహుశా రాజభటులు పెట్టిన చిత్రహింసలు భరించలేక కావచ్చును - ఇక్ష్వాకు కులతిలక అనే కీర్తనలో భద్రాచల రామునికీ ఆయన పరివారానికీ తాను తయారుచేయించి అర్పించిన విలువైన ఆభరణాలన్నిటినీ ఏకరువు పెట్టి, నీ తండ్రి దశరధ మహారాజు పెట్టేనా, లేక నీ మామ జనకమహారాజు పంపేనా - ఇవన్నీ అని రాముణ్ణే నిలదీశాడు. కలికి తురాయి నీకు మెలుపుగ జేయిస్తి, నీవు కులుకుచు తిరిగెదవు ఎవడబ్బ సొమ్మని అని కోపం చేశాడు. మళ్ళీ వెంటనే తను చేస్తున్న అపచారం జ్ఞప్తికి వచ్చింది కాబోలు, తిట్టితినని ఆయసపడవద్దయ్యా, దెబ్బలకోర్వక తిట్టితినయ్యా అని మళ్ళీ తానే రాముణ్ణి అనునయించాడు. విధంగా రాముని పట్ల ఒక భక్తునిగానే కాక, నిష్టూరమాడే చనువున్న ఒక చెలికానిగా, అమ్మవారి దగ్గర మారాము చేసే పసిపిల్లవానిగా, కోపం చేసుకోగలిగే ఒక పెద్దన్నగా గోపన్న మనకి ఆయన కీర్తనలలో దర్శనమిస్తున్నాడు.

తెలుగులో పదకవితకి ఆద్యుడు, భక్తి కవిత్వానికీ, అనన్యసామాన్యమైన కల్పనాశక్తికీ చిరునామా అయినటువంటి తాళ్ళపాక అన్నమాచార్యుడు రామదాసుకి సుమారు రెండువందల సంవత్సరాల ముందటివాడు. రామదాసుకి అన్నమాచార్యుల గురించి తెలుసునా, అన్నమయ్య పదరచన ప్రభావం రామదాసు కీర్తనలమీద ఉన్నదా అని ఇదమిత్థంగా చెప్పలేము. కానీ అందుబాటులో ఉన్న రామదాసు కీర్తనలను పరిశీలించగా ఇటువంటి ప్రభావం లేదనే అనిపిస్తున్నది. రామదాసు కీర్తనలలో వినబడే గొంతు భక్తితో నిండి ఉన్నప్పటికీ అమాయకంగానూ, ఒకింత వేడికోలుగానూ ఉంటుంది తప్ప అన్నమయ్యలోని శృంగార శిఖరాలుగానీ వేదాంతపు లోతులుగానీ కనబడవు. భాగవతాన్ని తెనిగించిన పోతన మహాశయుని ప్రభావం ఏమన్నా ఉంటే ఉండవచ్చుగజేంద్రమోక్షము, ప్రహ్లాదచరిత్ర వంటి భాగవతంలో ప్రసిద్ధ ఘట్టాల ప్రస్తావన రామదాసు కీర్తనలలో తరచు కనిపిస్తుంది. రాముణ్ణి కేవలం రామావతారంగా కాక, పరబ్రహ్మ స్వరూపమైన శ్రీమన్నారాయణునిగా భావించి పూజించడం కనిపిస్తుంది. ఒక పక్కన ఏమిరా రామా అని చనువుగా సంబోధిస్తూనే, మరొకపక్క రామచంద్రులు నాపై చలము చేసినారు - అని మర్యాదావాచకమైన బహువచనం వాడుతూ, ఒక ప్రభువుపట్ల సేవకుడు కనబరిచే కైంకర్య స్వభావమూ కనబడుతుంది. కైంకర్య స్వభావం వైష్ణవ మత లక్షణం. కానీ గోపన్న అన్నమయ్యలాగా స్మార్తాన్ని వదిలి వైష్ణవం స్వీకరించలేదు. పోతన వలెనే తన రామభక్తియే తనకు చాలు ననుకున్నాడు కాబోలు.
తెలుగు సంస్కృతిమీద, సాహిత్యం మీద, సంగీతం మీద రామదాసు కీర్తనలు వేసిన ముద్ర చెరిపివేయలేనిది. పామరులైనా అతి సులభంగా పాడుకునేందుకు అనువైన సరళమైన భాష, సంకీర్తన పద్ధతిలో, భజనపద్ధతిలో సాగే సంగీతమూ కలిసి ఉండడం వలన అటు వీధిలో సంకీర్తన చేసుకుంటూ తిరిగే హరిదాసులకీ, ఇటు ఇంటిలో పనీ పాటా చేసుకుంటూ కూని రాగాలు తీసుకునే ఆడవారికి కూడా నిత్యం నోటిలో నానుతూ వచ్చాయి కీర్తనలు. అంతే కాక, రామ భజన, చెక్కభజన, కోలాటం వంటి జానపద కళారూపాలకు వెన్నుదన్నుగా వెలసినాయి. అలా పాటలు తెలుగుప్రజల దైనందిన జీవితంలో భాగమైపోయినాయి. అంతేకాక సంగీత త్రిమూర్తులలో ఒకరైన శ్రీత్యాగరాజస్వామిని బలంగా ప్రభావితం చేసినాయి. రామదాసుకి నూటయాభయ్యేండ్ల తరువాతివాడైన త్యాగయ్య, ఎక్కడో తంజావూరు దగ్గరనున్న తిరువయ్యారులో నివాసముండినవారు, రామదాసుని తన ఆధ్యాత్మిక గురువుగా భావించి అనేక కృతులలో ప్రహ్లాద నారదాది పరమభాగవతోత్తములతో సమానునిగా రామదాసుని భావించడమే కాక, రామదాసు సంకీర్తనల పద్ధతిని అనుసరిస్తూ దివ్యనామ సంకీర్తనములనీ ఉత్సవసాంప్రదాయ కీర్తనలనీ రచించారు.

తెలుగువారే కాదు, సకలభారతీయులు గర్వపడవలసిన మహాగాయకుడు, వాగ్గేయకారుడు, శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు తాను విజయవాడ ఆకాశవాణిలో సంగీత ప్రయోక్తగా ఉండగా ఎన్నో రామదాసు కీర్తనలని లక్షణశుద్ధంగా స్వరపరిచి, వీనులవిందైన వాద్యసహకారం మేళవించి ప్రముఖ గాయనీ గాయకులతో పాడించారు. కీర్తనలు భక్తిరంజని కార్యక్రమంలో ప్రసారమవుతూ ఉండేవి. అంతేకాక, సుమారు 1970 ప్రాంతంలో మొదలు పెట్టి తానే స్వయంగా గానం చేసిన రామదాసు కీర్తనలను మూడు విడతలుగా, కేసెట్లు, సీడీల రూపంలో విడుదల చేశారు. దేశ విదేశాలలో ఉన్న తెలుగువారు మళ్ళి మళ్ళీ రామదాసుని స్మరించుకుని ఆయన రామభక్తిని కొంతైనా అనుభవించడానికి రికార్డులు ఉపయోగపడతాయి.

రామజోగి మందు గొనరే!
http://mio.to/VFkr

Comments

Naga Pochiraju said…
http://www.youtube.com/watch?v=zEnWlYxKeXc

Somehow I like this version.
Vasu said…
బావుంది .. సందర్భోచితంగా..

రామదాసుకి అన్నమయ్య తెలియకపోవడం ఒక వేళ నిజమయితే చాలా విచిత్రంగా అనిపిస్తోంది ...

అప్పటి తరం వాళ్ళు ఎవరన్నా ఇలాటి విషయాలు వ్రాసి ఉండచ్చు కదా. . బావుండేది ..మన వాళ్ళకి విషయాలని డాక్యుమెంట్ చెయ్యడం అంటే ఉన్న బద్ధకం ఇప్పటిది కాదేమో .


మానస పర్వతాలలో - ఇది కొత్తగా ఉంది .. యెద కనుమలలో , గుండె లోయల్లో అని విన్నా కానీ


"అన్నమయ్యలాగా స్మార్తాన్ని వదిలి వైష్ణవం స్వీకరించలేదు"

అవునా .. చప్పున గుర్తుకు రావట్లేదు కానీ శివుడిని కూడా అన్నమయ్య ఏదో కీర్తన లో ఎక్కడో స్తుతిస్తాడు అని గుర్తు .. వైష్ణవులు అది చెయ్యరు అనుకుంటా ..


నేను రామదాసు కీర్తనలు మొదట విన్నది మంగళంపల్లి వారి గొంతు లోనే . నాన్నగారు తరచుగా అవే పెడుతూ ఉండేవారు ..

ఇంక వేరే వాళ్ళవి ఏవి విన్నా అవి సొక్కలేదు


P.S. అన్నమయ్య , శ్రీ రామ దాసు పాపం ఏం నేరం చేశారో కానీ సినిమా రూపం లో రాఘవేంద్ర రావు బి.ఏ కి దొరికిపోయారు..
Zilebi said…
తాళ్ళ పాక వారు రామదాసుకి తెలిసి ఉండ వచ్చునా అన్నదాని గురించి !

అబ్బే, అప్పట్లో రాయలసీమ కున్ను, గోదారి తీరానికున్ను సంబంధాలు లేవండి ! ఎవరి కి వారే 'సంగీత' నగరే!

తాళ్ళ పాక వారిని , తి తి దే వారు బయటకు లాగ కుంటే (అదీ తాళ్ళ పాక అన్నమాచార్యుల వారు ఇప్పటి పక్క జిల్లా వారై ఉండ బట్టి, కొండ దేవర వారి గురించి పాడబట్టిన్ను) ప్రాచుర్యం పెంపొందించక ఉంటే, కాలగతి లో రాబోయే కాలం లో ఎప్పుడో అప్పుడు తెర బయటకు వచ్చి ఉండే వారేమో మరి అన్నమాచార్యుల వారు.


జిలేబి.
Kottapali said…
Lalitha Sravanthi - yes this is the more widely sung tune. Balamurali sang in his own tune.

Vasu - అన్నమయ్య శివుణ్ణి నేరుగా స్తుతించిన ఘట్టం నాకెక్కడా తారసపడలేదు. శిఉణ్ణి తప్పక ప్రస్తావించాడు ఎంతమాత్రమున నెవ్వరు తలచిన అనే సంకీర్తనలో, మరి కొన్నిటిలోనూ ..

Ramana - నెనర్లు.

Zilebi - కావచ్చునండి. నాకు చారిత్రక విషయాల పట్ల ఆసక్తి తక్కువే, అంచేత ఈ విషయాలు పనిగట్టుకుని పరిశోధించను. కానీ భాండాగారాన్నించి తితిదే బయటికి తీస్తేనేగాని అన్నమయ్య కీర్తనలు ఎవరికీ తెలిసేవి కావు అని నమ్మడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు.



చాలా బాగుంది..

మిగిలిన కీర్తనలు పరిచయం ఉన్నాయి కానీ..

"పాహిమాం శ్రీరామా అంటే పలుకవైతివి ..."
ఎప్పుడూ వినలేదు. ఎక్కడైనా ఆడియో లింక్ ఉందా? తెలపగలరు.

చాలా బాగా చెప్పారండీ...
Kottapali said…
కృష్ణప్రియ, శ్రీలలిత, నెనర్లు.
టపా చివర్లో ఇచ్చిన లింకు తెరిస్తే అక్కడ 30 పైగా రామదాసు కీర్తనలు బాలమురళిగారు పాడినవి వినవచ్చు. అందులోనే "పాహిమాం శ్రీరామా అంటే పలుకవైతివి ..." కూడా ఉన్నది.
Anonymous said…
Nice write up.

~sUryuDu
"పాహిమాం శ్రీరామా" - ఈ కీర్తన బాలమురళిగారి బాణీ కన్నా ఎస్.పీ.బి. పాడిన బాణీ (తాళం) నచ్చుతుంది. బాలమురళిగారి వరుస, పాట అసలు నడకకి (యతిప్రాసలకి) అతికినట్టుగా అనిపించదు.
అదే "గరుడగమన రారా" వరస బాలమురళిగారిది నచ్చుతుంది, ఎస్.పీ.బి. పాడిన వరస కన్నా. రామదాసు కీర్తనలన్నీ చాలావరకూ భజనలుగా పాడుకోవలసినవే. అలాంటి బాణీలే వాటికి నప్పుతాయని నా అభిప్రాయం.

"రామచంద్రులు నాపై చలము చేసినారు" - ఇక్కడి బహువచనంలో మరియాద కన్నా వెక్కిరింపే నాకు వినిపిస్తుంది, కీర్తనంతటినీ దృష్టిలో ఉంచుకున్నప్పుడు.
ఎస్.పీ.బీ. పాడిన రామదాసు కీర్తనలు ఇక్కడ వినవచ్చు (హార్డుకోరు శాస్త్రీయసంగీత ప్రియులకు నచ్చకపోవచ్చు :-)):
http://www.hummaa.com/music/album/sree-bhadrachala-ramdas-keerthanams-sp-balasubrahmanyam/27458
Satyanarayana Piska said…
నారాయణస్వామిగారూ !
రామదాసు గురించి చాలా చక్కని వ్యాసం అందించారు. అభినందనలు.
Srinivas said…
రామదాసుకి అన్నమయ్య తెలుసో తెలీదో నాకు తెలియదు గానీ, రామజోగి మందుని పోలిన మందుని అన్నమయ్య కూడా "అమ్మినట్లున్నారు" :). ఇవాళ ఇంటికి వస్తున్నప్పుడు వోలేటి వారు పాడగా "కొనరో కొనరో మీరు కూరిమి మందు - ఉనికి మనికి కెల్లా ఒక్కటే మందు" అనే పాట విన్నాను. ఆయన ఆలాపన ముగుస్తూ వయోలిన్ అందుకుంటుండగా వెలిగింది బారు దీపం - "మోహనం!"

ఎంత బాగా పాడారో... నాకు అర్థమైనంతలో - ఏ ఫ్రిల్సూ లేకుండా నెమ్మదిగా, నిండుగా పాడారనిపించింది. Well rounded rendition!

వోలేటి వెంకటేశ్వర్లు ఓ పెద్ద జీనియస్ అనే వారట శ్రీపాద పినాకపాణిగారు. సంగీతకారులకిచ్చే ఇలాంటి కితాబులను ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియదు (బాలమురళి non-conformist అంటే కొంత తెలుస్తుంది. ఎమ్మెల్వీ daringగా పాడుతుంది అంటే? GNB విప్లవం తీసుకొచ్చారు అంటే?). మీ సంగీత వ్యాసాల్లో ఇలాంటి వాటి గురించి రాస్తారా సార్?
Kottapali said…
శ్రీనివాస్ గారు, చాలా ఆలస్యంగా చూశాను మీ ఈ వ్యాఖ్య. వోలేటి పాడిన మోహనరాగ అన్నమయ్య పదం నాక్కూడ చాలా ఇష్టం. అవును, ఆ గానంలో ఆయన ఆ రాగాన్ని చాలా మౄదువుగా లలితంగా పాడారు. మోహనానికున్న ప్రత్యేకత అదే. ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు. ఏ రూపంలోనైనా బాగుంటుంది.
ఇక స్వామి నామం భవరోగాలకి మందు అనే ఆలోచనకి ఆద్యుడు అన్నమయ్యేనేమో. శివుడిపరమైన రచన ఒకటి -- పిత్థం తెలియ మరుందొన్రు ఇరుక్కుదు -- అని తమిళ కృతి ఉన్నది, కానీ రచన ఏ కాలమో తెలియదు.
Kottapali said…
http://translationsofsomesongsofcarnticmusic.blogspot.com/2011/09/pitham-theliya-marunthu.html

This link says it is Gopalakrishna Bharathi, so, he's a contemporary of Tyagarajaswami
రామజోగి అంటే అర్థం వివరించగలరు....రామజోగి అంటే రామోజీ+యోగి కలయిక.రామదాసుని చెరసాల నుండి విడిపించడానికి రాముడు రామోజీ అనే పేరు తో (రామదాసు బంటు )రామజోగి గా చేతిలో చిరుతలు తంబుర్ర తో అచ్చు రామదాసు ఆకారం లో వచ్చి రామదాసుని తమాషా నుండి బంధ విముక్తుణ్ణి చేస్తాడు. అందరూ రాముడిని రామదాసు బంటు అని చెపుతున్నారు....కానీ ఆయన వచ్చింది "రామజోగి" అనే అవతారంలో. అంటే రామజోగి అంటే రాముడు.