మనం ఎప్పటికి నేర్చుకుంటాం

రేపు అమెరికాలో థేంక్స్ గివింగ్ అనే పండగ. నేను నాకు లభించిన ఏయే వరాలకి ధన్యుడనయ్యానని అనుకుంటున్నానో రాద్దామని ఊహించుకుంటూ నవతరంగంలో అడుగు పెడితే అక్కడ ముంబాయి మారణ కాండలో మృతులకి ఆత్మశాంతి అని టపా. నిర్ఘాంతపోయి వరసగా బీబీసీ, యెన్‌పీఆర్ లు గాలించా.

ఇంతలో బయటికి వెళ్ళాల్సి వచ్చింది. NPR లో All Things Considered వింటూ వెళ్తున్నా, ఇంకా ఏమన్నా కొత్త సమాచారం చెబుతారేమోనని. ఇదివరలో బెంగళూరు అహ్మదాబాదులలో చిన్న సైజు పేలుళ్ళు జరిగినప్పుడు ఇక్కడ వచ్చిన కవరేజి చాలా తక్కువే. బహుశా ఈసారి ముంబాయి కావడం వల్లనూ, దాడులు జరిగింది ఎక్కువగా విదేశీ యాత్రికులు విడిసే పెద్ద హోటళ్ళమీద కావడం వల్లనూ కావచ్చు, సుమారు ఐదు నిమిషాల కథనం వినిపించారు. ఇంతకు ముందు వెబ్ లో తెలియక ఇప్పుడు తెలిసిన కొత్త వార్త - ఒబెరాయ్ హోటల్లో ఇద్దరు ముగ్గురు బందిపోట్లు సుమారు వంద మంది దాకా వ్యక్తుల్ని బందీ చేసి ఉంచారని. పోలీసు నించి కానీ, రాష్ట్ర, కేంద్ర హోం శాఖల నించి కానీ అధికారకంగా ఏమీ ప్రకటన వినబడక పోవడం గమనార్హం.

ఈ వార్తలు వినడమే బహు ఆందోళన కరంగా ఉండగా, పుండు మీద కారం చల్లినట్టు ఇక్కడ అమెరికాలో ఉంటున్న దక్షిణాసియా సెక్యూరిటీ స్పెషలిస్టు ఒకాయనతో చిన్న ఇంటర్వ్యూ చేశారు. ఈ మధ్య ఇటువంటి దాడులు అనేక భారతీయ నగరాల్లో జరిగినట్టున్నాయి గదా, భారత ప్రభుత్వమూ, రక్షణదళాలూ ఏమి చేస్తున్నట్టు అని రేడియో ఆమె అడిగిన ప్రశ్నకి అతను ఏమాత్రం మొహమాటం లేకుండా, ఇదివరకే భారతీయ గూఢచారి వ్యవస్థలు ప్రభుత్వానికి ఇటువంటి దాడులు జరుగుతాయని నివేదికలు ఇచ్చాయని చెబుతూనే, వివిధ రక్షణ దళాల వేగు వ్యవస్థ పరమ దరిద్రపు స్థితిలో ఉందనీ, దేశంలో ఎన్నో ఏళ్ళుగా రగులుతున్న అశాంతి చర్యల నేపథ్యంలో ఇటువంటి చైతన్య రాహిత్యం చాలా విచారించాల్సినదీ అని చెప్పాడు. అంతే కాక ఇప్పుడూ ముంబాయిలో జరిగిన దాడి వ్యూహం చూస్తే దీని వెనక ఉన్న శక్తులు కొత్త తెగువనీ, కొత్త లక్ష్యాన్నీ రూపొందించుకున్నట్టుగా కనిపిస్తున్నదని కూడా చెప్పాడు.

నాకైతే అది విచారించాల్సినదిగా కాదు .. మిగుల భయ పెట్టేదిగా ఉన్నది. ఎందుకీ మంత్రులు? ఎందుకీ మంత్రాంగం? ఏమి చేస్తున్నాయి ఇంటా బయటా పని చెయ్యాల్సిన గూఢచారి వ్యవస్థలు? ఏ మన్ను తిని పడుకున్నాయి. మొన్నటికి మొన్న హైదరాబాదులో లుంబినీ పార్కు, కోఠీ పేలుళ్ళు. నిన్ననే బెంగళూరు అహ్మదాబాదుల్లో వరస పేలుళ్ళు. ఇవన్నీ ఇంకేదో పెద్ద ముంపుకి ముందు పిల్ల అలలు అని చెప్పకనే చెబుతున్నట్టు. ఇవ్వాళ్ళ పెను ఉప్పెన రానే వచ్చింది. ఏదీ మనకి రక్షణ కల్పించాల్సిన చెలియలి కట్ట?

Comments

ఈ సంగతులు మనకు ఏమి కొత్త కాదు. రోజు ప్రపంచం లో ఎక్కడో ఒక్క దగ్గర ఇలాంటివి జరుగుతూనే వుంటాయి. అయితే వీటికి నిజంగా బాధ్యులు ఎవరో చెప్పడం కష్టమే. ప్రభుత్వపు వైపల్యమా .. లేక ప్రభుత్వం పెంచి పోషిస్తున్న అధికార గణాల యొక్క వైపల్యమో చెప్పడం చాల కష్టం..ఈ మారణహోమాలు ఆగా ఆగవు... ప్రభుత్వపు తీరు మారదు..
మేధ said…
ప్రొద్దున్నే ఈ వార్తలతోనే నిద్ర లేచా.. మళ్ళీ ముంబైలోనే.. అది కూడా దర్జాగా, లోపలికి వచ్చి, విదేశీయులని బందీలుగా తీసుకున్నారు అంటే, ఏం చెప్పగలం..
ఇంకా బాధాకరమైన విషయం, ఆ ఆపరేషన్లో, సమర్ధులైన పోలీస్ ఆఫీసర్స్ మరణించారు..
ఈ విషయాలన్నీ ఇంటిలిజెన్స్ వాళ్ళకి ముందే తెలిసినా, నివారించలేకపోయారు అంటే, ఇంత కంటే చేతకానితనం ఏదీ ఉండదు.. ఎంతసేపు ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్ప, ప్రజల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు..
తీవ్రవాదులు ఎంతకి తెగించినా, ఎవరూ వాళ్ళని పట్టుకోరు, పొరపాటున పట్టుకున్నా కూడా ఏ శిక్ష వేయరు.. వెంటనే బెయిల్ మీద విడిపించేస్తారు.. కొండొకచో, శిక్ష వేసినా కూడా, దాన్ని అమలు చేయరు..
అయిన కరడు కట్టిన ఉగ్రవాదులని శిక్షిస్తే, ఇక్కడ మైనారిటీల మనోభావాలు ఎందుకు దెబ్బ తింటాయో, నాకు ఎప్పుడూ అర్ధం కాదు..
హోం మంత్రి, ప్రధాన మంత్రి ఏది జరిగినా ఒకే రకం మొహం పెట్టి, ఒకే లైన్ చెప్పడం తప్ప వేరే పీకింది ఏమి లేదు. మొంబైలో జరిగింది తలుచుకుంటేనే, ఒళ్ళు మండి పోయి, తీవ్రమైన ఆవేశం వస్తోంది. కాని ఏమి చేయలేని నిస్సహాయత. దీనికి కారణాలు ఎవరు/లేక ఏమిటి అంటే ఏమి చెప్తాను,
* నర నరాల్లో జీర్ణించుకుపోయిన లంచగొండులా?? పాస్పోర్ట్ నుంచి ఏదైనా కొనుక్కోగల దేశమా?
* మన స్వంతలాభం చూసుకొని, అది ఎటువంటి పరుస్తితులకి దారి తీస్తుందో తెలుసుకోలేని రాజకీయనాయకులా??
* లక్షలు లక్షలుగా పెరుగుతున్న, వీసా లేని పరదేశ జనాలని పెంచొ పోషిస్తున్న యంత్రాంగమా??

ఎందుకీ గొడవలు, ఎందుకీ మారణహోమం, మనం ఎక్కడనుంచి ఎక్కడికెళ్తున్నాం.. అంతా అయోమయం, అంతా భీభత్సం
KumarN said…
నిజమే..సాయంత్రం నుంచీ సి ఎన్ ఎన్ చూస్తున్నా!! భయమూ, ఒకరకమయిన నిస్సయహాత లతో మునిగి పొయి ఉన్నా. అసలీ టెర్రరిజం కు ఎదురే లేదా?! మనమందరం ఇలా భరిస్తూ భరించేల్సిందేనా?

ఎప్పుడూ అనుకోలేదు నేను మన దేశం, నా లాంటి కామన్ మాన్ కి ఇన్ సెక్యూర్డ్ అని, కాని గత ఆరు నెలలుగా నా అభిప్రాయం కొంచెం కొంచెం మారుతూ వస్తుంది. అసలా హోటల్లలో సెక్యూరిటీ ఏమయ్యింది? కొన్ని సంవత్సరాల క్రితం నేనెళ్ళి ఉన్నప్పుడు, ఓ..హడావిడి కనిపించింది..అంతా పై పైన వెదేశీ అతిథులకు ఒక రకమయిన ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇమేజ్ నివ్వడమేనా?

ఒక్క మనిషిని తప్పు పట్టలేము కాని, నేను బాగా గౌరవించే మన్మోహన్ సింగ్ గారి మీద నాకు ఆ భావన తగ్గి పోతుంది. మరీ ఇలా అలారం పెట్టినట్లుగా టంచనుగా...ప్రతి నెలకీ, వారానికీ.. అదేదో ఆర్ డి ఎక్స్ సేల్ లో దొరుకుతున్నట్లుగా..
నిజమే మనం ఎప్పటికీ ఏమి నేర్చుకోము. దీనిమీదనే నేను కూడా ఒక టపా రాశాను, వీలతే ఒక లుక్కెయ్యండి. ధన్యవాదాలు
ఈ వార్తలు మనసును కలచి వేస్తున్నాయి. ప్రభుత్వం కొద్దిగా కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించడం లేదు. ఇన్ని జరుగుతున్నా, ఏమీ చేతకాని మన హోం మినిస్టర్ మాత్రం రాజీనామా చేయడం లేదు... ఎప్పుడు పరిస్థితి బాగుపడుతుందో...
కొత్తపాళిగారు! ముంబై మారణ హోమం నేను పేపర్లో చూశాను .మన సిటీలో మాత్రం సెక్యురిటి ఎక్కడుంది సర్ ?
నిన్న సింద్రాబాద్ స్టేషన్లో డమ్మీ బాంబ్ పేలుడు గురించి లోకల్ ఎడిషన్లో చూశా .అప్రమత్తత కోసం అని అంటున్నా నాకైతే
చేతులు కాలేవరకూ చూసి ఆకులు పట్టుకోవడం నేర్పుతున్నట్టుంది .బాంబ్ పేలితే ఎలా అప్రమత్తంగా వుండాలో శిక్షణ
బాగానే ఉంది కాని అటువంటి పరిస్థితి రాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారా ?సిటీ లో ఏదో కొద్ది ప్రదేశాల మాట ఏమోగాని , స్టేషన్ కు వెళ్లినా,సినిమాకి వెళ్ళినా ,షాపింగ్ కి వెళ్ళినా ఎక్కడైనా సెక్యురిటి నామమాత్రంగానే ఉంటోంది . ఇప్పుడు కూడా ముంబై లో పేలుళ్లు జరినై కాబట్టి నగరంలో హై ఎలర్ట్ ప్రకటిస్తారు , నాలుగు రోజులు కట్టుదిట్టమైన భద్రతా పర్యవేక్షణ ఉంటుంది .తర్వాత షరా మాములే .ప్రజలు ప్రతి రొజూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బయటకు రావాల్సిందే .భద్రతా చర్యలు అసలు లేవని కాదు కాని ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది .
Anonymous said…
B B C వారు కూడ స్థానికంగా లండన్ లోనే ఎవరినో ఇంటర్వ్యూ చేసారు. అదే మాట! మన నిఘాసంస్థల వైఫల్యం అని.

చని పోయిన వారికి నివాళులర్పిస్తూ, ఆ క్షతగార్తులకు మనం చెయ్యగలిగిన సహాయం చెయ్యడమే!

సాటివారితో ఇంకొంచెం సహనంతో ప్రవర్తిస్తూ, అప్రమత్తంగా ఉంటూ, జాగ్రత్తలు తీసుకోవడమే, మనం చెయ్యగలిగినది.
ఏమో? ఏమవుతుందో అర్ధం కావట్లేదు..
Ramani Rao said…
వీటి దాడినుండి ఎలా మనల్ని మనం రక్షించుకోవాలి అన్నది నేర్చుకొవాలి. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి వస్తోంది. పొట్ట తిప్పలకోసం బయటికెళ్ళిన క్షణం నుండి ఇంటికొచ్చేదాకా భయంతో, భీతితో బతకాల్సిరావడం నిజానికి అత్యంత బాధాకరమైన విషయం. మనకోసం ఎదురుచూసే వాళ్ళ కోసం....మన ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతకుతున్నాము.
శ్రీ said…
చాలా దారుణమయిన పరిస్థితిలో ఉంది మన దేశ భద్రత విషయం. రోడ్డు మీద మనుషుల్ని పిట్టల్ని కాల్చినట్టు కాలుస్తున్నారు.
ఆలోచిస్తూ ఉంటె.. నాకైతే జరుగుతున్నదానికంటే.. దీని మూలంగా రాబోయే కాలంలో పలు రకాలుగా మనం ఎదుర్కోవాల్సిన పరిణామాలే పెనుభూతంలా కనిపిస్తున్నాయి. :(
sneha said…
కొత్తపాళి గారు, జరుగుతున్న మారణహోమాన్ని చుస్తుంటే చాలా దిగులేస్తుంది. దేశంలో ఎటు చుసినా అల్లర్లు, బాంబు ప్రేలుళ్ళు. ఏమి జరుగుతొందో అర్థం కావడం లేదు.ఈ వార్త విన్నప్పటి నుండి ఎలాగో వుంది. ఎప్పుడు మన ప్రధాన మంత్రులు, మన రాజకీయనాయకులు ఎందుకు సరిగ్గా పనిచేయడం లేదు అనేకంటే నా వంతు కర్తవ్యం ఏమిటి అన్న ఆలోచనలే కలుగుతున్నాయి.

ఎక్కడ చూసిన మనుషుల్లో అసంతృప్తి, అశాంతి. చిన్న పట్టణాల నుండి నగరాల వరకు ఎక్కడ చుసినా జనాలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వున్నారు. చుట్టుపక్కల నివసించే వాళ్ళెవరో కూడా తెలీని పరిస్థితి. ఇలా కాకుండా మనం, మన ఇరుగు పొరుగు వాళ్ళతో కలిసి ఒక పటిష్టమైన community ని ఏర్పాటు చేసుకుంటే మేలేమొ. దీనివల్ల తీవ్రవాదుల దాడి నుండి దేశాన్ని రక్షించుకోవడం సాధ్యమా అంటే తెలీదండి.కాని మన ఇళ్ళు, మన సమాజం, మన ఊరు, మన దేశం అన్న భావం బలపడి మనకు మన సమాజానికి కావలసిన మౌళికావసరాల నుండి మన దేశ సమస్యల వరకు రాజకీయనాయకులను నిలదీసె హక్కు మనకు వస్తుందేమొ. దేశానికి నిజాయితీ గల రాజకీయనాయకుల అవసరం ఎంత వుందో భాధ్యతాయుత పౌరుల అవసరం కూడా అంతే వుంది అనుకుంటున్నాను.
ఇప్పటికైతే నా ఆలోచనలు ఇలా సాగుతున్నాయి ఇవన్ని ఆచరణలో పెట్టి చూడాలి ఎంత వరకు సాధ్యమో. hope oneday i can do it.