శుభాక్షుల కటాక్ష వీక్షణం

మొన్న పొద్దు కోసం భువన విజయం కార్యక్రమం నిర్వహిస్తుండగా సభా ప్రారంభంలో తాడేపల్లి వారు అమ్మవారి మీద చక్కటి స్తుతి పద్యం చెప్పారు. అందులో "..శుభాక్షులఁ జూచు జగజ్జనిత్రి ... దుర్గ మముఁ దేల్చుత దివ్య కటాక్ష వారిధిన్" అన్నారు. అంటే భైరవభట్ల కామేశ్వర్రావుగారు "దేవి కటాక్షవారిధిలో మునిగిపోయినా పరవాలేదు!" అని చమత్కరించారు.
***
నేనసలే విజయవాడ కుర్రోణ్ణి.
ముగురమ్మల మూలపుటమ్మ .. దుర్గ మాయమ్మే మరి!
వొట్టి దుర్గ కాదు, కనక దుర్గ.
సింహ వాహినియై, త్రిశూలాది ఆయుధ ధారిణియై, సురారులమ్మ కడూపారడి పుచ్చెడి యమ్మ ..
కానీ
ఆ పచ్చటి రాకేందు ముఖం నుండి కురిసే కరుణ వెన్నెలలు
ఆ పెదవుల విరజిమ్మే దరహాస చంద్రికలు
ఆ శుభాక్షుల కటాక్ష వీక్షణాలు

ఒక పక్క ఈ తల్లి ఇలా ఉండగా, చదువుకోడానికి వరంగల్లు వెళ్తే అక్కడ కాకతీయుల ఆరాధ్య దేవత భద్రకాళి .. ఆవిడా అంతే
ఆకారం మాత్రం భీకరం
కానీ చల్లని చూపుల తల్లి.
***
మహా యోగులకైన తెలియరాని ఆ తల్లి తత్త్వం, "కాయజాది షడ్రిపుల జయించే కార్యము దెలిసిన" త్యాగరాజుకి తప్ప ఎవరికి తెలుస్తుంది?

అందుకే .. వినాయకుని వలెను బ్రోవవే అని వేడుకున్నారు ఆ తల్లిని మధ్యమావతి రాగంలో.
కుమారస్వామిని లాగానో ఇంకొకరిని లాగానో అనలేదు. వినాయకుని వలెను అన్నారు.
ఎందుకూ .. వినాయకుడంటే అమ్మ వారికి ప్రత్యేకమైన వాత్సల్యం. తన వొంటినించి నిర్మించి, తన ఊపిరినూది ప్రాణ ప్రతిష్ఠ చేసింది గనక. తన కండలో కండ, ప్రానంలో ప్రాణం. సహజమైన మాతృ ప్రేమకి తోడుగా, మరుగుజ్జువాడు, ఏదీ తనకి తాను చేసుకోలేని వాడే .. అయ్యో పాపం లాంటి కించిత్ జాలి కూడా ఉంటుంది కాబోలు.

సకల చరాచర జగతికి అంతశ్శక్తి రూపమైన ఆమె సంకల్పం లేక మనమూ మట్టి ముద్దలమే. ప్రాణ ప్రతిష్ఠకు ముందున్న సున్నిపిండి ముద్దలమే. అందుకే వేడుకుంటున్నారు త్యాగరాజు .. వినాయకుని వలెను బ్రోవవే .. అని.

ప్రముఖ కర్నాటక సంగీత గాయకులు, శ్రీ టి.యం. కృష్ణ గాత్రంలో ఈ కృతి.

మీరు చేపడుతున్న, తలపెడుతున్న సత్కార్యములన్నీ విజయవంతములు కావాలని, లోకకళ్యాణానికి దోహద పడాలని ఈ విజయదశమి మహా పర్వదిన సందర్భంగా మనసారా కోరుకుంటున్నాను.
***
పొద్దులో అభినవ భువన విజయ దశమి

Comments

Purnima said…
మీకూ దసరా శుభాకాంక్షలు!
దసరా శుభాకాంక్షలు....
రమణి said…
అభినవ భువన విజయాన్ని, కవులు, పండితులతో కలిసి విజయవంతం చేసిన మీకు కూడా విజయ దశమి శుభాకాంక్షలు.
టపా చాల బాగుంది