యే క్యా హో రహా హై?

జానేభీదో యారో సినిమాలో పతాక సన్నివేశంలో అన్ని ముఖ్యపాత్రలూ ఒక థియెటర్లో జరుగుతున్న ద్రౌపదీ వస్త్రాపహరణం నాటకంలోకి చొచ్చుకు వచ్చేస్తాయి. నాటకం అస్తవ్యస్తమై పోతుంటుంది. నాటకంలో ధృతరాష్ట్రుడి పాత్ర వేస్తున్న వాడికి, చచ్చినట్టు కళ్ళు మూసుకుని కూర్చోవాలి కాబట్టి, ఏం జరుగుతోందో అర్ధం కాదు. కళ్ళు తెరిస్తే నాటకం ఇంకా అభాసు పాలవుతుందేమోనని భయం. అందుకని రెణ్ణిమిషాలకోసారి, "యే క్యా హోరహా హై" అని అరుస్తుంటాడు, చెవికోసిన మేకలాగా. తరవాత ఈ డయలాగు ఒక దూరదర్శన్ కామెడీ సీరియల్లో (పేరు నాకిప్పుడు గుర్తు లేదు) ఒక పాత్రకి సిగ్నేచర్ డయలాగ్ గా ప్రాచుర్యం పొందింది.

అమెరికా ఆర్ధిక వ్యవస్థకి పట్టిన పడిశానికి ప్రపంచ ఆర్ధిక మార్కెట్లన్నీ ముక్కు దిబ్బెళ్ళేసి ఎడాపెడా తుమ్ముతున్నాయి. ఏ దేశ వాసులైణా, సాధారణ ప్రజలందరూ, పైన చెప్పిన ధృతరాష్ట్రుడిలాగా .."యే క్యా హోరహా హై" అన్న అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది.

ఇటీవల మన తెలుగు బ్లాగ్లోకంలో ఈ వింత పరిస్థితిని మనబోంట్లకి కూడా అర్ధమయ్యేలా విశదీకరిస్తూ రెండు మంచి టపాలొచ్చాయి.
అరిపిరాల సత్యప్రసాద్
కృష్ణశ్రీ
ఆ టపాలకి వచ్చిన కామెంట్లలో మరికొన్ని మంచి సమాచార వేదికలకి లంకెలు కూడా ఉన్నాయి.

ఐతే మనకి రావలసిన ప్రశ్న .. అమెరికాలో మార్టుగేజి ఋణాల్ని వాళ్ల బేంకులు అల్లకల్లోలం చేసుకుంటే మనకెందుకు ఈ సంక్షోభం అని. ఈ విషయం మీద నాకు అర్ధమైన పరిస్థితిని మీతో పంచుకునే ప్రయత్నం ఇది.

సత్యప్రసాద్ గారు చెప్పినట్టు, ఋణాలిచ్చిన బేంకులు, ఆ ఋణాలన్నిటినీ కుప్పపోసి, మళ్ళీ చిన్నా పెద్దా పేకెట్లుగా కట్టి వాటిని విపణి వీధిలో అమ్ముతుంటారు. స్టాకులు, బాండ్లు కొనుక్కున్నట్టే ఇన్వెస్టర్లు (ప్రభుత్వాలు, ప్రభుత్వ బేంకులు, ఇన్వెస్టుమెంట్ బేంకులు, కంపెనీలు, వ్యక్తులు) వీటిని కూడా కొనుక్కుంటారు. ఎక్కువగా వీటి అమ్మకాలు కొనుగోల్లు సాగించేది బేంకులే. ఎప్పుడైతే ఋణాల చెల్లింపులు సజావుగా జరగడం లేదని తెలిసిందో, ఈ పేకెట్ల విలువ ఠక్కున పడిపోయింది. అంటే వాటిని కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. (మార్కెట్లో ఒక వస్తువుకి కొనుగోలు దార్లు ఎంత వెల యిచ్చి కొనేందుకు తయారుగా ఉన్నారు అన్న దాన్ని బట్టే దేని విలువైనా నిర్ణయించబడుతుంది.) ఒక పక్కన బేంకుల డబ్బు ఇలా విలువ లేని (ఎవరూ కొనని) ఈ మదుపుల్లో ఇరుక్కు పోయింది. దాంతో తాము చేసే ఇతర కార్యకలాపాలకి డబ్బు కరువైంది. ఇది ఒక మెట్టు, కిందకి దిగజారడంలో. ఇంకో పక్కన ఈ మదుపుల్ని తమ బేలెన్సు షీట్లలో నష్టంగా చూపించాల్సి వచ్చింది. ఇంతింత పెద్ద లాసులు ఉండేప్పటికి, ఈ బేంకులు సరిగా నడవట్లేదు అనే భయంతో ఆ బేంకుల స్టాకు విలువ పడిపోవడం మొదలైంది. ఇది దిగజారుడికి రెండో మెట్టు.

బేంకుల స్టాకు విలువ పడిపోయినా పెద్ద ఇబ్బంది లేదు గానీ మొదటి దానితోనే వచ్చింది తంటా అంతా. బేంకులు చేసే అసలు ముఖ్యమైన పని డబ్బుని తిప్పుతూ ఉండడం. ఆర్ధిక వ్యవస్థ ఒక పెద్ద కర్మాగారం అయితే, డబ్బు దాన్ని నడిపే ఇంధనం ఐతే, బేంకులు ఆ ఇంధనాన్ని సప్లై చేసే పంపులు. ఇలా బేంకుల డబ్బు ఇరుక్కు పోయేప్పటికి రెండు ముఖ్య పరిణామాలు జరిగాయి. ఒకటి బేంకులు తమ దగ్గర ఉన్న డబ్బునే ఋణాలివ్వ గలవు గానీ లేని డబ్బుని ఇవ్వలేవు. ఒక్క సారిగా కొన్ని బిలియన్ల డాలర్ల మదుపు హుష్ కాకీ ఐపోయేప్పటికి అది కేవలం లాసు ఒక్కటే కాదు. ఆ మేరకి తిరిగి ఋణాలిచ్చే వెసులుబాటుని ఆ బేంకు కోల్పోయిందన్న మాట. రెండోది, కాస్తో కూస్తో డబ్బులున్న బేంకులు కూడా, ఈ దెబ్బతో ఎవడికి అప్పిస్తే ఏవి నష్టం మీద పడుతుందో అనే భయంతో బిర్ర బిగుసుకు కూర్చున్నాయి. ఇంకొక్క ఋణం మంజూరు చెయ్యాలంటే చచ్చే భయం పట్టుకుంది. నా పంపుల ఎనాలజీలో చెప్పాలంటే, ఒక పంపు ఫేలయింది. రెండో పంపుకూడా ఫేలవుతుందేమోనని భయంతో స్విచ్చి ఆఫ్ చేసేశారు.

ఈ దెబ్బతో చిన్నా పెద్దా కంపెనీలకి అవసరానికి డబ్బు అందడం మానేసింది. ఆర్ధిక వ్యవస్థకి ప్రాణమైన డబ్బు ప్రవాహం నిలిచి పోయింది. ఈ కారణం వల్ల (కేవలం సబ్ ప్రైం వల్ల కాదు) ఈ సంక్షోభం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలన్నిటినీ ఏల్నాటి శనిలా పట్టుకుంది. అంతే కాక, ఋణాల సెకండరీ డెరివేటివ్స్ లోనూ, ఈ దెబ్బతిన్న బేంకుల్లోనూ అనేక ప్రపంచ దేశాల ప్రభుత్వాలు, ప్రభుత్వ బేంకులు, ఇంకా బహుళజాతి వ్యాపార సంస్థలు మదుపు దార్లుగా ఉండడంతో ఆయా ఇన్వెస్టుమెంట్లన్నీ కూడా బలంగా దెబ్బ తిన్నాయి.

టూకీగా అదీ కథ.

ఇప్పుడు అమెరికా ప్రభుత్వమూ, ఇతర ప్రభుత్వాలూ దీన్ని సరి దిద్దడానికి చేస్తున్న ప్రయత్నాలు, బేంకులకి చేయూతనివ్వడం మాత్రమే కాదు .. గడ్డ కట్టి పోయిన డబ్బు ప్రవాహాన్ని మళ్ళీ కరిగించి కాస్త కాస్తగా ప్రవహింప చెయ్యాలని, ఈ జీవనదిని పునరుద్ధరించాలని .. వాళ్ళు పడుతున్న పాట్లు. ప్రస్తుతానికైతే .. ఏమీ పని చేస్తున్న సూచనలు లేవు. నాలిక కాల్చుకున్న తెనాలి రామలింగడి పిల్లి తంతుగా ఉన్నది బేంకుల ప్రవర్తన. చూద్దాం, ఏమవుతుందో!

Comments

Anonymous said…
మంచి సినిమా. ये जो है ज़िन्दगी లో టిక్కు తల్సానియత్ అనుకుంటా. రెండు ఏళ్ళ చేతులు చాల గొంతులు నొక్కాయి. బాగా చెప్పారు.
మా ఆయిల్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం 'ఆయిల్ బాండ్లు' అని జారీ చేస్తుంది, సబ్సిడీ నష్టాలను భర్తీ చేసుకోవడానికి. ఈ కాయితాలను మాకంపెనీలు బ్యాంకుల్లో తనఖాగా పెట్టి వందల కోట్ల రూపాయలను అప్పు తీసుకొంటాయి. హఠాత్తుగా ప్రభుత్వం ఖజానా ఖాళీ అయిపోయిందన్నా, మా ఆయిల్ కంపెనీలు అప్పు చెల్లించలేమని చేతులెత్తేసినా ఆయిల్ బాండ్లు నాలుక గీసుకోవడానిక్కూడా పనికి రావు. అప్పుడు ఈ బ్యాంకుల గతి యేమిటి? ఇలాంటి ప్రభుత్వ పరమైన లావాదేవీల్లో కేవలం కాగితంపై కనబడే ఆస్తులు ఎన్నో ఉంటాయి. అవి ఎప్పుడు కరిగి పోతాయో చెప్పలేం.
Unknown said…
ఎఫ్‌ఐఐ ల పెట్టుబడుల మీద ఎంతో ఆధారపడి ఉన్న స్టాకు మార్కెట్టు మనది.
అక్కడ అమెరికాలో కష్టాలు మొదలవగానే అందరూ ఇక్కడ నుంచి తమ పెట్టుబడులు వెనక్కి తీసుకుంటారు.

ఇక ఐటీ కంపెనీల గురించి తెలిసిందే. సర్వీసు కంపెనీలు, ఎమెన్సీలు ఏదయినా సరే అమెరికా కంపెనీల మీద ఆధారపడ్డవే. వీటి మీదా ప్రభావం తప్పదు.

డైరెక్టుగానో ఇండైరెక్టుగానో మన ఆర్థిక వ్యవస్థ అమెరికా ఆధారితమయినది. కాబట్టి అక్కడ తుమ్మితే ఇక్కడ ప్రభావం కనిపిస్తుంది.
మేధ said…
కొత్తపాళీ గారూ జన్మదిన శుభాకాంక్షలు...
Sujata M said…
Sir,

Wish you a very happy birthday. naku ippude uppandindi.

Sujata
మీకు జన్మదిన శుభాకాంక్షలు.
జన్మదిన శుభాకాంక్షలు.
శ్రీ said…
ఈ రోజు మీ పుట్టిన రోజా? అయితె అందుకోండి నా తరపున జన్మదిన శుభాకాంక్షలు!
Bolloju Baba said…
గురువు గారు తన పుట్టిన రోజని టపాలో ఎక్కడా చెప్పలేదే. (మళ్ళి వెనక్కు వెళ్లి చూసాను కూడా)
అందరి కామెంట్లను బట్టి పుట్టినరోజనే తెలుస్తున్నది.
నా తరపున నుంచి కూడా
పుట్టిన రోజు శుభాకాంక్షలు.

బొల్లోజు బాబా
Anil Dasari said…
ప్రపంచమంతా తుమ్ములొస్తున్నాయి కాబట్టి అందరూ కల్సి ఓ చెయ్యేసి అమెరికా జలుబూ, తద్వారా తమ తుమ్ములూ తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నారన్నమాట.
cbrao said…
చైనా,జపాన్ ఆర్థికంగా బాగా ఉన్నాయ్. చైనా దగ్గర సమృద్ధిగా డాలర్లు, జపాన్ యెన్ పెరుగుదల - ఈ పరిస్థితులలో, ఈ రెండు దేశాలు అమెరికాను సంక్షొభంలోంచి బయటపడవేసే ఎలాంటి ప్రయత్నాలు చేసినట్లు కనిపించదు. కారణం తెలియదు. ఇక్కడి ఇళ్ల ధరలు ఇంకా తగ్గే అవకాశముందంటున్నారు. ఇళ్లు కొనే వారు తగ్గారు. అద్దె ఇళ్లకు గిరాకి పెరిగింది. ఇళ్ల అద్దె పెరగటానికి ఇది ఒక కారణం. ఈ ఉపద్రవం లో పెక్కు సంస్థలు సరైన ద్రవ్య చలామణి లేక, తమ ఉద్యోగస్తులను తగ్గించివేస్తున్నారు. కొత్త ప్రాజెక్టులను వాయిదా వేస్తున్నారు. దాని ప్రభావం వలన భారత దేశానికి వ్యాపార అవకాశాలు తగ్గటంతో , అక్కడా ఉద్యోగస్తులను తీసివేయటం జరుగుతుంది. ఈ పరిస్థితి నుంచి కోలుకోవటానికి సంవత్సరం పైనే పట్టవచ్చని కొందరి అంచనా. ఈ విపత్కర పరిస్థితులలో, భారతీయులు ఉద్యోగాలు కోల్పోయి విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. డెట్రాయిట్లో ఒక నిరుద్యోగి తన భార్యా పిల్లలను చంపటం లాంటి దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకొంటున్నాయి. చూడండి http://www.detnews.com/apps/pbcs.dll/article?AID=2008810290387. అమెరికా త్వరగా కోలుకోవాలని ఆశించటం మినహా, ప్రస్తుతం ఏమీ చెయ్యలేని పరిస్థితి.

చక్కటి వ్యాసం అందించిన కొత్తపాళీ గారికి జన్మదిన శుభాకాంషలు.

-cbrao,
San Jose, CA.
శుభాకాంక్షలు తెల్పిన మిత్రులందరికీ .. పేరు పేరునా, మనసారా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.

డెట్రాయిట్ పరిసర ప్రాంతంలో జరిగిన ఈ ఘాతుకం నిజంగా విభ్రాంతి కలిగిస్తోంది. ఆర్ధిక సమస్యలు భీతి కొల్పుతాయి, సందేహం లేదు, కానీ తట్టుకుని నిలబడ్డమే ధీర లక్షణం. ఆ వ్యక్తికి ఇతర మానసిక రుగ్మతలు ఉన్నాయేమోనని ఊహాగానాలు సాగుతున్నాయి.
Anonymous said…
మీ టపా బాగుంది. కాని మీరు రొజు కు ఒకటి రాయలని నా కొరిక. దాని మీద ఎంత బాగ చర్చ జరిగితే అంత మజా నాకు.
నెనర్లు