హైదరాబాదు వాసులకి ఆహ్వానం


గీతాగణేశన్ భరతనాట్యంలో అందెవేసిన చేయి. జయప్రద రామమూర్తి చెయ్యితిరిగిన వేణువాద్య కళాకారిణి. ఈ ఇద్దరు యువ కళాకారిణులు తారనాకలో ఉత్తరా సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనే సంస్థను నెలకొల్పి ఔత్సాహికులకి ఈ రెండు కళలలోనూ చక్కని శిక్షణ ఇస్తున్నారు. తాము తమ గురువుల వద్ద నేర్చిన ఈ విద్యలకి తమ శిష్యులే "ఉత్తరా"ధికారులు అన్న ఆలోచనతో ఈ సంస్థని నిర్వహిస్తున్నారు. హైదరాబాదు పరిసర ప్రాంతాలలో వివిధ పండుగల సందర్భాల్లోనూ ఇతరత్రంగానూ వీరి విద్యార్ధి బృందాలు ప్రదర్శనలిచ్చి ప్రశంసలు చూరగొనడం పరిపాటిగా జరుగుతోంది. రెండేళ్ళ క్రితం శ్రీలంక ప్రభుత్వంచే ఆహూతులై తమ బృందంతో ఆ దేశాన్ని పర్యటించి అనేక ప్రదర్శనలిచ్చారు.

ఐతే ఇవన్నీ ఒక ఎత్తు, ఆగస్టునెలలో వీరు జరిపే తమ సంస్థ వార్షికోత్సవం ఒక ఎత్తు. సభలు జరపటమే వృత్తిగా చేసేవాళ్ళు కూడా అందుకోలేని పనితనంతో జరుగుతుంది వీళ్ళ కర్యక్రమం. ఎక్కడా ఆలస్యం కానీ కాలహరణం కానీ ఉండవు. అనవసరమైన సోదితో ప్రేక్షకుల్ని బాదటం ఉండదు. ప్రదర్శనలు చక్కని కళాత్మక, సాంకేతిక విలువలతో ఆకట్టుకుంటాయి. పిల్లనగ్రోవి బృంద గానం, భరతనాట్య నాటక ప్రదర్శన తమకి తామే గొప్ప ఆకర్షణలు కాగా, ఈ యువగురువులు తమ ఇద్దరి కళలను కలబోసి రూపొందించిన వేణు-నాట్య సల్లాపము అద్భుతంగా ఉంటుంది - ఈ వార్షిక ఉత్సవాల్లో ఈ అంశం ఒక ప్రత్యేక ఆకర్షణ.

అంతే కాక ఈ సందర్భంగా వీళ్ళు చేసే మంచి పని ఇంకొకటుంది. ప్రతి ఏడూ ఒక విద్వన్మణికి సన్మానం చెయ్యడం. చిన్నా చితకా సంస్థలు కొన్ని, అప్పటికే పద్మభూషణ్ లాంటి బిరుదులు పొంది ప్రపంచ ప్రఖ్యాతి పొందిన కళాకారుల్ని పిలిచి వాళ్ళకి తాము కూడా ఒక శాలువాకప్పి ఒక బిరుదిచ్చి - కేవలం ఆ ప్రముఖ వ్యక్తితో ఫొటోలుదిగే అవకాశం అన్నట్టు చేస్తాయి. ఉత్తరా వారి పద్ధతి దీనికి పూర్తిగా భిన్నం - తమ కళల్లో ఎంతో నిష్ణాతులై కూడా స్థానికంగా పట్టుదలతో, నిశ్శబ్దంగా పనిచేస్తూ భావితరాలకి మన సాంప్రదాయ కళలని నేర్పుతున్న గురువుల్ని గుర్తించి సన్మానిస్తారు.

ఉత్తరా వారి ఎనిమిదవ వార్షికోత్సవం రాబోయే శుక్రవారం (ఆగస్టు 24) సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతిలో జరుగుతోంది ఆసక్తి కలవారందరూ ఆహ్వానితులే.

Comments

Sriram said…
ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రచారలేమి వల్ల చాలా మందికి తెలీకుండా జరిగిపోతాయి. మీ వంతుగా మీరు ఇలా అందరికీ తెలియపరచడం చాలా ఉపయోగకరం.

అన్నట్టు, థేంక్స్ టూ తోషిబా, మీచేత భలే చకచకా రాయిస్తోంది,ఇంకా పాడిస్తోంది కూడా :)