దీక్షితుల రచనా దక్షత

ఇది ఈమాటలో మన తెలుగు బ్లాగాస్థాన గురువులు పప్పు నాగరాజుగారి వ్యాసానికి శ్రీ జెజ్జాల కృష్ణమోహనరావుగారి వ్యాఖ్య. ఇందులో వారు చెప్పిన విషయాలు ఇక్కడ సంగీతమంటే ఆసక్తి ఉన్నవారికి ఉపయోగపడతాయని పెడుతున్నాను.

కృష్ణమోహనరావుగారు రచ్చబండ తెలుగు యాహూగ్రూపులో ఛందో విజ్ఞాన సంబంధమైన జాబులు తరచూ రాస్తుంటారు.
*** *** *** *** ***

శ్రీ ముత్తుస్వామి దీక్షితులు మూడు సంగీత పద్ధతులలోఆరితేరినవారు. వారి తండ్రి రామస్వామి దీక్షితులు కూడ సంగీత విద్వాంసులే. వీరు హంసధ్వని రాగమును కనుగొన్నారు. ముత్తుస్వామి గాత్ర సంగీతమును మాత్రమే గాక వీణను కూడ నేర్చుకొన్నారు. వారు పాడునప్పుడు
వీణను కూడ వాయించెడివారు. వీణతో కలిపి పాడుచుండుటచే వారు చౌక (లేక విలంబిత) కాలమును ఎక్కువగా వారి కీర్తనలలో వాడెడివారు. చివర మధ్యమకాలము సామాన్యముగా కీర్తనలలో నుండును. వీరు ఐదారు ఏళ్ళు కాశీలో గడిపినారు. కావున వీరికి హిందూస్తానీ సంగీతముతో బాగుగా పరిచయము. హిందూస్తానీ రాగములను తన కీర్తనలలో వాడియున్నారు (జంఝూటి, జయజయవంతి, యమన్, సారంగ, బృందావనసారంగ, ఇత్యాదులు).

వీరు వీరి తండ్రిగారితో మదరాసు సమీపమున నున్న మణలిలో కొన్ని సంవత్సరములు ఉన్నారు. మణలికి నాయకుడు వేంకటకృష్ణ ముదలియార్. వీరు దుబాసి, సెయింట్ జార్జ్ కోటలో పని చేసెడివారు. అప్పుడప్పుడు ముత్తుస్వామిని, వారి తమ్ముడైన బాలాస్వామిని
కోటకు తీసికొని వెళ్ళేవారు. ఆ సమయములో అక్కడ పాశ్చిమాత్య బ్యాండ్ మేళమును వినేవారు. సి మేజర్‌కు సరిపోయే
శంకరాభరణములో నోటు(ట్టు) స్వరములను వ్రాసినారు. సుమారు నలభైకు పైన సంస్కృతములో వ్రాసినారు. నేడు కూడ ఇట్టి నోటుస్వరాలు కచేరీల చివరలో తుకడలుగా పాడుతారు. ఇంగ్లాండ్ రాష్ట్రగీతమైన గాడ్ సేవ్ ది కింగ్ మెట్టులో సంస్కృతములో వ్రాసినారు! వీరి తమ్ముడు బాలాస్వామి ఒక ఆంగ్లేయునిచేత ఫిడేల్ నేర్చుకొన్నారు. వారి తండ్రిగారి సలహా ననుసరించి ముత్తుస్వామి కచేరీలలో వయలిన్ వాయించేవారు. ఇదే కర్ణాటక సంగీతములో మొట్టమొదట వయలిన్‌ను పక్కవాద్యముగా ఉపయోగించుట. అంతకు ముందు వీణను ఉపయోగించేవారు.

మూడు సంగీత సంప్రదాయాలను అవగాహన చేసికొని అందులో ఘనతను సాధించారు దీక్షితులవారు.

వీరి సంస్కృత కృతులలో ప్రాస, అనుప్రాస, అంత్యప్రాస, యతి, గోపుచ్ఛయతి, బీజాక్షరములు, ముద్రాలంకరము (రాగము పేరు
పాటలో వచ్చుట), ఇత్యాదులు ఎక్కువ. వీరికి భక్తి మాత్రమే కాదు, విభక్తి అంటే కూడ ఇష్టమే. వీరి విభక్తి పాటలు ఒక ప్రత్యేకత. ఒక్కొక్క పాటను ఒక విభక్తిలో వ్రాయుట ఇందులోని విశేషము. ఎనిమిది విభక్తులలో వీరు ఎన్నియో పాటలను వ్రాసియున్నారు. పాటలలో ఉదాహరణ లనవచ్చును వీటిని.

మాత్రుష్కా బొమ్మలాగు పదములలో పదములుంచి వ్రాయుట వీరి కృతులలోని మరొక విశేషము. శ్రీ వరలక్ష్మి నమస్తుభ్యం, వసుప్రదే, శ్రీ సారసపదే, రసపదే, సపదే, పదే పదే, ఇత్యాదులు. దీనికి గోపుచ్ఛయతి అని పేరు.

ఇవన్నీ రచయితకు తెలిసియుండవచ్చు. స్థలాభావమువల్ల వ్రాసియుండక పోవచ్చు. కాని అందరికీ ఇవి తెలిసిన మంచిదని
నేను తెలియజేయుచున్నాను.

Comments

Sriram said…
manchi pani chesaaru...