ఓం నమః పార్వతీ పతయే ...

... హరహర మహాదేవ.

భగవాన్ శంకర్ జీ కీ జై

మహా శివరాత్రి పర్వదినం.

భక్తుల నినాదాలు మిన్నంటుతుండగా, ముగ్గురు అర్చక స్వాములకి తోడు స్థానిక విద్వాంసులు గొంతులు కలిపి, ఓం నమశ్శివాయ అనే పంచాక్షరీ, ఓం నమో భగవతే రుద్రాయ అనే దశాక్షరీ మంత్రాలు పట్టుకొమ్మలుగా మహాన్యాసం యధావిధిగా నిర్వహించి, ఇంచుమించు ముప్ఫై గొంతులు ఒక్క వాక్కుగా ఎలుగెత్తి సస్వరంగా నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః అంటూ రుద్రాధ్యాయాన్ని (దీన్నే రుద్రం, నమకం అని కూడా అంటారు) పదకొండు సార్లు పఠించి, ఆ పరమేశ్వరుని విశ్వమూర్తిత్వాన్ని, సర్వాత్మకత్వాన్ని, శివ స్వరూపాన్ని ప్రత్యక్షం చేసుకుని పాలు, పెరుగు, తేనె, పంచామృతం, చందనం, భస్మ జలం, శుద్ధోదకాలతో అభిషేకించి తరించాము.

భారత దేశ పౌరసత్వానికంతటికీ ప్రతీక గా కూడిన ఆ భక్త మండలిలో తెలుగువారైన మా అర్చకులు బ్రహ్మశ్రీ జానకిరామ శాస్త్రి గారు "జయ జయ మహాదేవా, శంభో సదాశివా" అంటూ శ్రావ్యంగా ఘంటసాలని గుర్తుచేసుకుని - "బోలో భూకైలాస శంకర మహరాజ్ కీ జై" అని భక్తులందరితో నినదింప చెయ్యటం .. నా తెలుగు గుండె గంతులేసి పరవశించింది.
నమస్సోమాయ చ రుద్రాయ చ
నమస్తామ్రాయ చ అరుణాయ చ
నమశ్శంగాయ చ పశుపతయే చ
నమ ఉగ్రాయ చ భీమాయ చ
నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ
నమో హంత్రే చ హనీయసే చ
నమో వృక్షేభ్యో హరికేశేభ్యో
నమస్తారాయ
నమశ్శంభవే చ మయోభవే చ
నమశ్శంకరాయ చ మయస్కరాయ చ
నమశ్శివాయ చ శివతరాయ చ
నమస్తీర్థ్యాయ చ కూల్యాయ చ
నమః పార్యాయ చ వార్యాయ చ
నమః ప్రతరణాయ చ ఉత్తరణాయ చ
నమ ఆతార్యాయ చ లాద్యాయ చ
నమశ్శష్ప్యాయ చ ఫేన్యాయ చ
నమస్సికత్యాయ చ ప్రవాహ్యాయ చ.

శంకరుడైన ఆ సాంబశివుడు అందరికీ ఆనందాన్నీ, ఈ ప్రపంచానికి శాంతినీ ప్రసాదించు గాక!

Comments

Syam said…
meeru maree namakaanni ilaa rasesthe kastam sumaa :)